[శ్రీ విడదల సాంబశివరావు రచించిన ‘వెన్నెల స్నానం!’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]
ఈ మాఘమాసం
నిండు పున్నమి రేయి
మంచు గాలులు నా తనువును స్పృశిస్తోన్న వేళ..
అపురూపమైన నీ సోయగాలు ఒలికే
ప్రతి క్షణాన్ని దోచుకోవాలని..
నా హృదయం లోగిలిలో దాచుకోవాలని..
నా అంతరంగం ప్రతిక్షణమూ తపనపడుతోంది!
మన ఇద్దరి అంతర్లోకాలు ఒక్కటైపోయాక
మనోవీధులతో ఏడడుగులు కలిసి నడిచాక
ఒకరు లేకుండా మరొకరం మనుగడ సాగించగలమా!
అందుకే.. ప్రియసఖీ..
నీ హృదయంలో హృదయమై
నీ తనువులో తనువునై
నీ జీవితంలో జీవితమై
నీతోనే జీవిస్తా కడ శ్వాస వరకూ!
నా భౌతిక జీవితం నుండి నువ్వు కనుమరుగై
హృదయం రక్షసికమై..
మనోవేదనతో అలమటిస్తోన్న వేళ కూడా..
నా మది లోయలన్నీ
నీ తలపులతోనే నిండి వున్నాయి!
పగలూ రోజూ నాకు నీదే ధ్యాస!!
నువ్వు నన్ను విడిచి ఊరి పొలిమేరలు దాటి
ఏ సుదూర తీరాల వెళ్ళిపోయావో గాని..
నా ప్రతి శ్వాస నీతోనే వుంది ప్రేయసీ!
నిజ ప్రేమికుల దేహాలు ఎక్కడుంటేనేమిటీ!?
ఆత్మలు మాత్రం..
అంతర్నేత్రానికి అన్నివేళలా..
అన్ని వైపులా.. కనిపిస్తూనే వుంటాయి!
అలానే నువ్వూ..
ప్రతి పగలు.. ప్రతి రాత్రి నాలోనే వున్నావు!
రేయింబవళ్ళూ ఒకే ధ్యాస.. ఒకే యోచన!
ఎప్పటికీ నా కళ్ళల్లోనే నిన్ను దాచుకోవాలని
ఏ సెగలూ నీ దరి చేరకుండా
ఏ నిప్పు రవ్వ నీ మీద పడకుండా
ఏ విస్ఫోటనానికో నువ్వు ఎర కాకుండా,
నేను దగ్ధమైపోయినా పరవాలేదు గాని..
నిన్ను మాత్రం కాపాడుకోవాలని
నా హృదయం నిజాయితీగా కోరుకుంటోంది!
అంతేగాదు ప్రేయసీ..
ప్రతిక్షణం నిన్ను నీడలా వెన్నంటి వుండి
నీ బాధలన్నీ నేనే మోసి
నిన్ను నా ఆత్మలో అలంకరించుకోవాలని
నా మనసు మౌనంగా పలవరిస్తోంది!
దశాబ్దాలుగా..
నా ఎదలోయలలో నిక్షిప్తమై
నన్ను నిరంతరమూ వేధిస్తోన్న
ఓ చిలిపి కోరికను వెల్లడించనా!?
చలి చెలితో సయ్యాట లాడుతూ,
మంచు వర్షాన్ని సైతం లెక్కచేయక
ప్రేమ జంటలకు ఆహ్లాదాన్ని పంచుతోన్న
ఈ మాఘమాసం పూర్ణచంద్రుడి సాక్షిగా
సాగర తీరంలో విహరిస్తూ మనమిద్దరమూ..
ప్రేమ పరిష్వంగంలో ఓలలాగుతూ
‘వెన్నెల స్నానం’ చేయాలి!
ఊహాజనితమైన..
నా ‘ఆశ’కు ఊపిరి పోస్తావు కదూ!?
శ్రీ విడదల సాంబశివరావు గారు 22 జనవరి 1952 న గుంటూరు జిల్లా, చిలకలూరిపేట పురపాలక సంఘం పరిధిలో ఉన్న పురుషోత్తమపట్నం గ్రామంలో ఓ మధ్య తరగతి ‘రైతు’ కుటుంబంలో జన్మించారు. శ్రీమతి సీతమ్మ, రాములు వీరి తల్లిదండ్రులు. స్వగ్రామంలో ప్రాథమిక విద్య, చిలకలూరిపేటలో ప్రాథమికోన్నత విద్య, తెనాలిలో బి.ఎస్.సి. పూర్తి చేశారు.
బాల్యం నుంచి నటనపై అభిరుచి ఉంది. అనేక నాటికలలోనూ, నాటకాలలోనూ నటించి ప్రశంసలందుకొన్నారు. వివిధ సంస్థల నుండి పతకాలు పొందారు. రాష్ట్రస్థాయిలో ఉత్తమ నటుడిగా బహుమతులు పొందారు. వీరు రచించిన ‘పుణ్యభూమి నా దేశం’ (నాటకం), ‘తలారి తీర్పు’ (నాటిక) ప్రసిద్ధమయ్యాయి. టివి ధారావాహికల్లోనూ, కొన్ని సినిమాల్లోనూ ముఖ్య పాత్రలు పోషించారు.
సాంబశివరావు గారు వెయ్యికి పైగా కవితలు రాశారు. వాస్తవిక జీవితాలని చిత్రిస్తూ అనేక కథలు రాశారు. కవితలు, నాటకాలు, కథలు కలిపి 14 పుస్తకాలు ప్రచురించారు. పలు పత్రికలలో ఫీచర్లు నిర్వహిస్తున్నారు.
నాటకరంగలోనూ, రచన రంగంలోనూ ఉత్తమ పురస్కారాలు అందుకొన్నారు. నీహారిక పౌండేషన్ అనే సంస్థని స్థాపించి సమాజ సేవ చేస్తున్నారు.
