Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

వినాశనం వైపు విశ్వమానవ జాతి పరుగులు

[శ్రీ విడదల సాంబశివరావు రచించిన ‘వినాశనం వైపు విశ్వమానవ జాతి పరుగులు’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]

విశ్వమానవ జాతి..
వినాశనం వైపు పరుగులు తీస్తోంది!
విధాత ప్రసాదించిన మేధస్సుతో
వినూత్న ప్రయోగాలెన్నో చేసి
వినీలాకాశంలో హర్మ్యాలు నిర్మించి
శూన్యంలో సరికొత్త ప్రపంచాన్ని
ఆవిష్కరించే సాంకేతికతను
తమ గుప్పిటలో బంధించారు!
మరి.. ఇదేమి అమానుషం..!?
ఆచరణలో ఆధునికతను
అంతరంగంలో విశాల హృదయ భావనను
నిక్షిప్తం చేసుకున్న ఈ మేధావులు..
మానవ సమాజాన్ని
జాతులుగా.. వర్గాలుగా విభజించి
జనావాసాలను..
యుద్ధక్షేత్రాలుగా మార్చారు!!
ఆకస్మిక బాంబు దాడులకు
పసికూనల లేలేత శరీరాలు
ఛిద్రమై రక్తధారలు స్రవించిన వేళ..
మానవత్వం మూగగా రోదించింది!
దేశాధినేతలు ముష్కరులై
నియంతలుగా మారి..
ప్రజా సంక్షేమ పాలనకు మారుగా
నిరంకుశ వికృత పాలనకు శ్రీకారం చుట్టారు!
పాలకుల రక్తంలో
పగలు.. ప్రతీకారాలు..
మహోధృత జ్వాలలై
ఎగిసెగిసి పడతోన్నవేళ..
ప్రజాజీవనమే కాదు
మానవజాతి యావత్తూ..
బూడిదకుప్పగా మారిపోయింది!
ఆధునిక మానవ మేధస్సు
ఆవిష్కరించిన అణుసంపత్తిని
అరేబియా సముద్రం జలాలలో కలిపి
విశ్వమానవ జగతి సంక్షేమాన్ని
ఉప్పునీటి పాలు జేశారు
యుద్ధోన్మాద ముష్కర పాలకులు!!

Exit mobile version