[‘పద్య కళాప్రవీణ’, ‘కవి దిగ్గజ’ ఆచార్య ఫణీంద్ర రచించిన ‘విషాద యశోద’ అనే పద్యకావ్యాన్ని అందిస్తున్నాము.]
చం.
నిను గొని తెచ్చి నా కడుపు నీడన నాడు పరుండ బెట్టినా
రనుచును క్రొత్త క్రొత్త కథలల్లుచు నుండి రదెంత సత్యమో?
అనుటకు వారికెట్లు మనసన్నది యొప్పెనొ గాని, యద్దియున్
వినుటకు నా మనస్సు మరి వీసము సైతము నొప్పదాయెరా! (16)
సీ.
“దేవకీ వసుదేవ దివ్య దంపతులకు
అష్టమ గర్భమై యవతరించ –
మామయౌ కంసుడే మట్టుబెట్టు ననుచు
వసుదేవుడే యంత భయమునొంది,
నిను బుట్టలో బెట్టి నిశ చిమ్మ చీకటిన్,
కుండ పోతగ వాన కురియుచుండ –
నతి రహస్యంబుగా నరిగి బృందావని,
చేర్చె నా కడ” కంచు చెప్పుచుండ్రి!
తే.గీ.
నవ్వనా? ఏడ్వనా? నమ్మనా? మరి యిక
నమ్మలేనని, గుండెను నాటుకొన్న
మాతృ ప్రేమ కన్నీళ్ళుగా మార్చి, కార్చి,
పిచ్చి చూపులు చూడనా? వేణు లోల! (17)
ఉత్సాహము.
నేటి మాట కాదు! పదియు నేడు వత్సరాల యా
నాటి నుండి తలచుకొనిన నాదు కనుల లోపలన్
మేటి దృశ్యము లవి వరుస మెదులు! – పాలు ద్రాపెడిన్
నాటి నుండి నేటి వరకు నాటుకొన్న బంధమున్!! (18)
మ.
క్షణమైనన్ విడకుండ, స్నానమిడి, పై సామ్రాణియున్ బట్టుటన్;
చనుబాలిచ్చియు బొజ్జ నింపుట; రసాస్వాదంబుగా జోల పా
టను గానంబొనరించి, యూయల పరుండంబెట్టుట న్నిట్టు లా
చిననాట న్నిను గుండె కద్దుకొని, చేసిందెల్ల నే తల్లియో? (19)
కం.
ముద్దుగ నీ రూపమ్మును
దిద్ది, మధుర వేణు గాన దీప్తిని నీలో
యద్ది, ముదుముద్దు పలుకు
లొద్దికగా నేర్పి, ముద్దులుంచిన దెవరో? (20)
కం.
బుడిబుడి యడుగుల నడకలు
వడివడిగా నేర్పి, జున్ను పాలన్, వెన్నన్
తడవ తడవకున్ తినిపిం
చెడి దాన – నిపు డవియెల్ల చెదరిన కలలో? (21)
కం.
వలదని యెది వారించిన,
నలిగెడి వాడవయ! అప్పు డలుకను దీర్చన్ –
పలు విధముల బ్రతిమాలుచు
నిలువెల్లయు నీరసించు నీ యమ యెవరో? (22)
ఆ.వె.
కథల నెన్నొ చెప్పి, గలగలా నవ్వించి,
ఆటలాడి, కలసి పాట పాడి,
చిలిపి చూపులు చూడ – చేర్చి కౌగిట నిన్ను
తన్మయత్వమందు తల్లి యెవరొ? (23)
తే.గీ.
ఎంత ముద్దాడిన, తనివి యెంత మాత్ర
దీరక, మరల మరల ముద్దిడి, యటుపయి –
“దిష్టి తగులునేమో!” యని దిష్టి తీసి,
దేవుని మనమందున మ్రొక్కు దీన యెవరొ? (24)
ఉ.
ఇంతకు నింత నీ వెదిగి యెన్నియొ బుద్ధులు, క్రొత్త విద్దెలన్
వింతగ జూపినంత – మది విస్మయమొందుచు ప్రేమ పొంగుచు
న్నంతకు నంతయున్ పదిలమాయె మహోన్నత పర్వతం బటున్!
చింతను గూర్చ కిప్పుడిక – ఛిద్రమునౌ హృదయమ్మె! ఆత్మజా! (25)
(సశేషం)
డా. ఆచార్య ఫణీంద్ర తెలుగు కవి, సాహిత్య విమర్శకుడు, పరిశోధకుడు. వృత్తిరీత్యా శాస్త్రవేత్త. మెకానికల్ ఇంజనీరింగ్ లో పట్టభద్రుడు. తెలుగులో డాక్టరేట్ డిగ్రీని ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి “19వ శతాబ్దంలో తెలుగు కవిత్వం” అనే విషయంపై సిద్ధాంత వ్యాసాన్ని సమర్పించి సాధించారు. ముకుంద శతకం, పద్య ప్రసూనాలు, ముద్దుగుమ్మ, మాస్కో స్మృతులు, వరాహ శతకం, తెలంగాణ మహోదయం వంటి పద్యకవితా గ్రంథాలను రచించి మంచి పద్యకవిగా గుర్తింపు పొందారు. తెలుగు సాహిత్యంలో “మాస్కో స్మృతులు” పేరిట ‘తొలి సమగ్ర విదేశ యాత్రా పద్య కావ్యా’న్ని రచించారు. తెలుగు వచన కవిత్వ సాహిత్యంలో “ఏక వాక్య కవితల” ప్రక్రియకు ఆద్యులు. ఆయన రచించిన తొలి ఏక వాక్య కవితల గ్రంథం “Single Sentence Delights” పేరిట ఆంగ్లంలోకి అనువదించబడింది.
ఆయన అనేక అవార్డులు, గౌరవాలను ప్రభుత్వం, ఇతర సాంస్కృతిక సంస్థల నుండి పొందారు. ప్రధానంగా – ‘వానమామలై వరదాచార్య’ స్మారక పురస్కారం, ‘దివాకర్ల వేంకటావధాని’ స్మారక పురస్కారం, ‘పైడిపాటి సుబ్బరామశాస్త్రి’ స్మారక పురస్కారం, ‘ఆచార్య తిరుమల’ స్మారక పురస్కారం, ‘బోయినపల్లి వేంకట రామారావు’ స్మారక పురస్కారం, “రంజని – విశ్వనాథ” పురస్కారం, ‘సిలికానాంధ్ర’ గేయ కవితా పురస్కారం, మూడు సార్లు విజయవాడ ‘ఎక్స్ రే’ పురస్కారాలు, ‘కమలాకర ఛారిటబుల్ ట్రస్ట్’ నుండి “వైజ్ఞానిక రత్న” పురస్కారం, పలుమార్లు రాష్ట్ర ప్రభుత్వ ‘ఉగాది’ సత్కారాలు పేర్కొనదగినవి. ఆయన 2012లో తిరుపతిలో జరిగిన ప్రపంచ తెలుగు మహాసభలలోనూ, 2014 లో అమెరికాలో, అట్లాంటాలో జరిగిన “నాటా” తెలుగు సభలలోనూ గౌరవింపబడ్డారు. ఆయన హైదరాబాదులో వి.ఎల్.ఎస్. లిటెరరీ అండ్ సైంటిఫిక్ ఫౌండేషన్ నుండి “పద్య కళా ప్రవీణ” బిరుదుని పొందారు. తూర్పుగోదావరి జిల్లా, ఏలూరు లోని నవ్య సాహిత్య మండలి నుండి “కవి దిగ్గజ” బిరుదుని పొందారు. హైదరాబాదులోని నవ్య సాహితీ సమితి నుండి “ఏకవాక్య కవితా పితామహ” పురస్కారాన్ని పొందారు. ఆయన ప్రస్తుతం “యువభారతి” సాహిత్య సంస్థకు అధ్యక్షులుగా, “నవ్య సాహితీ సమితి”కి అధ్యక్షులుగానూ, “నండూరి రామకృష్ణమాచార్య సాహిత్య పీఠం” కు ప్రధాన కార్యదర్శిగానూ ఉన్నారు. ఆయన ఆంధ్ర పద్య కవితా సదస్సు యొక్క పత్రిక “సాహితీ కౌముది” కి పదేళ్ళపాటు సహసంపాదకులుగా వ్యవహరించారు. ఆయనకు 2013 సంవత్సరానికి గాను తెలుగు విశ్వవిద్యాలయం వారు ‘పద్య కవిత్వం’లో “కీర్తి పురస్కారం” ప్రదానం చేసారు. 2017 లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన “ప్రపంచ తెలుగు మహాసభల”లో డా. ఆచార్య ఫణీంద్ర “పద్య కవి సమ్మేళన” అధ్యక్షులుగా వ్యవహరించి సత్కరించబడ్డారు.