[భానుశ్రీ తిరుమల గారు రచించిన ‘విశ్వకవి.. రవి’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]
తూరుపు ఆకాశపు
అంచుల ధార కట్టి,
అంభుదికి ఆ అంచున
రాశిగ పోసిన
స్వర్ణ భస్మమునలుముకొని
తూరిన సూరీడు..
సాగరపు అలలపై
చిత్రకారుడై వర్ణ వైవిద్యాన్ని
ఆవిష్కరిస్తున్నాడు..
వర్ణ మిళితమైన
తూరుపు ఆకాశం నిండా
మంద గమనంతో
లేలేత నీరద కన్యలు
రంగుల కోకలతో కదులుతు ఉన్నాయి
బాల సూరీడిని ముద్దిడి
కరిగిపోదామని.
జీవికకై వలసేగుతున్న
పక్షుల గుంపులు ఆ చిత్తరువులో
చక్కగా ఓ పక్కన ఇముడుతూ సాగుతున్నాయి
సాగరాన కెరటాలు ఫణులెత్తుతూ
వెలతురు మణుల ధారణకై
ఉరకలేస్తున్నాయి..
తీరపు తిన్నెలన్నీ చల్లబడ్డ
తమ తనువులపై
వెచ్చదనపు కిరణ స్పర్శకై
ఉవ్విళ్ళూరుతున్నాయి..
మరో ఉదయం,
రసోదయం
శుభోదయం!!!
భానుశ్రీ తిరుమల అనే కలం పేరుతో రచనలు చేసే నా అసలు పేరు తిరుమల రావు పిన్నింటి. నా జననం శ్రీకాకుళం జిల్లా, కవిటి తాలుకా మాణిక్యపురంలో జరిగింది. ప్రాథమిక విద్య నుండి ఉన్నత విద్య వరకూ సొంత ఊరిలోనే జరిగింది.
రామోజీ గ్రూప్ సంస్థలలోని ఆతిథ్య విభాగంలో అసిస్టెంట్ మేనేజర్గా ఉన్నాను.
చిన్నప్పటి నుండి బొమ్మలు గీయడం, చిన్న చిన్న కవితలు రాయటం చేసేవాడిని. కొందరు గురువులు, శ్రేయోభిలాషుల ప్రోత్సాహంతో ఇటీవల కొన్ని పత్రికలకు పంపిన కవితలు, కథలు అచ్చులో చూసుకొని ఆనందపడుతున్నాను. ఇప్పటి వరకు 20 చిన్న పెద్ధ కధలు, 100 కవితలు రాశాను.
