విమలాశాంతి సాహిత్య సాంఘిక సేవా సమితి, సమ సమాజ వికాసార్థం రచనలు చేస్తున్న రచయితలను గౌరవించే దిశగా 2018 – కవితాపురస్కారం కోసం జాతీయ స్థాయిలో కవుల నుండి కవితా సంపుటాలను ఆహ్వానించింది. మా ఆహ్వానాన్ని మన్నించి అధిక సంఖ్యలో కవులు తమ కవితా సంపుటాలను పంపారు.
ఈ పోటీలో యువ కవులతో పాటు లబ్ధప్రతిష్ఠులు కూడా పాల్గొనడం గర్వంగా భావిస్తూ ఆయా కవులకు కృతజ్ఞతలు తెల్పుతూ ‘2018 – విమలాశాంతి సాహిత్య పురస్కారాల’ను సవినయంగా ప్రకటిస్తున్నాం. ఈ పురస్కారాలను ‘శాంతి రజనీకాంత్ కవితా పురస్కారాలు’గా అందించబోతున్నాం.
తెలంగాణా, కోస్తా, రాయలసీమ ప్రాంతాలకు చెందిన సుప్రసిద్ధ సాహిత్యవేత్తలు శ్రీ అమ్మంగి వేణుగోపాల్, శ్రీ కొప్పర్తి వెంకటరమణమూర్తి, శ్రీ తూముచెర్ల రాజారాం గారు, ఈ 13వ పురస్కార న్యాయనిర్ణేతలుగా అందించిన నిర్ణయం మేరకు ‘2018 శాంతి రజనీకాంత్ స్మారక కవితాపురస్కారాల’ను శిఖామణి గారి ‘చూపుడువేలు పాడే పాట’, ఇబ్రహీం నిర్గుణ్ గారి ‘ఇప్పుడేదీ రహస్యం కాదు’ కవితా సంపుటాలకు ప్రకటిస్తూ ఆ కవిమిత్రులను మనసారా అభినందిస్తున్నాం.
2019, జనవరిలో జరిగే పురస్కార ప్రదానోత్సవ సభలో కవిమిత్రులకు ఒక్కొక్కరికి రూ.7500/- లు చొప్పున నగదును బహూకరించి, పురస్కార జ్ఞాపికతో సముచితంగా సత్కరిస్తామని తెలియజేస్తున్నాం. పురస్కార నిర్ణయానికి న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించిన సాహితీమూర్తులకు కృతజ్ఞతలు తెలుపుతున్నాం. పురస్కార ప్రదాన నభ, ఎప్పుడు ఎక్కడ అనే విషయాన్ని తరువాత తెలియపరుస్తామని విన్నవిస్తున్నాం.
ఛైర్మన్ శాంతినారాయణ, కార్యదర్శి వి. వెంకటేశులు
డా. శాంతి నారాయణ ప్రముఖ కథా రచయిత, నవలా రచయిత. కవి. పరిశోధకులు. పల్లేరు ముళ్లు, నమ్ముకున్న రాజ్యం, కొండచిలువ, బతుకు బంతి, నాలుగు అస్తిత్వాలు- నాలుగు నవలికలు, నాగలకట్ట సుద్దులు-1, నాగలకట్ట సుద్దులు-2, గీతలు చెడిపి వీరి ప్రసిద్ధ కథా సంపుటాలు.
మాధురి, పెన్నేటి మలుపులు, ముడి, సాధన వీరి నవలలు. ఇనుపగజ్జెల తల్లి (కథలు); వొరుపు(కవితలు) వీరి సంకలనాలు.
నడిరేయి నగరం, కొత్త అక్షరాలమై.. వీరి కవితా సంపుటాలు.
సీమ అస్తిత్వ కేతనం, (అమృతోత్సవ సంచిక), ప్రశ్నించే జ్ఞాపకం (యాత్రా సాహితి) ఇతర గ్రంథాలు.

