[తిమ్మమ్మ మర్రిమాను గురించి పాణ్యం దత్తశర్మ గారు వ్రాసిన దీర్ఘకవితని ధారావాహికంగా అందిస్తున్నాము.]
17.
వటవృక్ష సమూహంబను అతి చల్లని ఒడిని చేరి
ఎందరు మునులును యోగులు తపమిక్కడ చేసినారు
వారి తపోశక్తి ఇచట ఆవరించి నిలిచి యుండు
‘సానుకూల శక్తి’ అచట సాగుచుండు అనునిత్యము
తదేకమౌ ఏకాగ్రత ప్రకృతిరతులు ఐనవారు
సానుకూల శక్తి వైన తరంగముల చూడగలరు
దివ్యమైన భవ్యమైన భావనలను పొందగలరు
రుగ్మతలను బాసి మనము తనువు శుద్ధి నందగలరు.
టన్నుల కొలదిగ వెడలును ప్రాణవాయు సంపద అట
మహావటము విడుదల తను యొనరించును ప్రాణులకను
దాని వలన రోగములను ‘నయము చేయు శక్తి’ కలిగె
ప్రకృతిని మించిన వైద్యుడు ప్రభవించునె భువిని ఎపుడు.
బెరడు నుండి ‘యాస్పిరిన’ను ఔషధంబు లభియించును
సహజహరిత ప్రదేశముల విహరించిన తగ్గిపోవు
రక్తపు పోటది క్రమమున, ఒత్తిడి స్థాయిలు తగ్గును
‘అటవీ స్నానము’ ప్రకృతి వైద్యములో నయము గూర్చు.
‘ఫికస్ బెంగాలెన్సెస్’ అను శాస్త్రీయ నామము పొందె
హిందువులే కాదు బౌద్ధ జైన మతము ననుసరించు
వారెల్లరు మర్రిమాను పూజింతురు దేవతగను
‘ప్రకృతిలోనె దేవుడుండు’నను నమ్మిక మతసారము.
భారతదేశము లోనే అత్యంతపు పొడిప్రాంతము
రాయలసీమనెడి నిజము అందరికీ విదితము
దానిలోన అనంతపుర ప్రాంతము జలరహితమయ్యె
అక్కడ లేచెను ఈ వట రాజము ఘన హరిత వనము.
మానవ మనుగడ నిలవదు శాశ్వతముగ నవనియందు
కానీ ప్రకృతి నిలుచును కలకాలము చిరకాలము
దీనికి తిమ్మమ మర్రియె తగ నిలిచిన తార్కాణము
నిరంతరము పెరుగుచున్న నిత్యజీవ వర శీలము.
‘క్రిస్ గ్రిఫిత్’ యన్న గొప్ప శాస్త్రవేత్త మాటలలో
తిమ్మమాంబ మర్రిమాను తీర్చును సంతాన కాంక్ష
సంతానోత్పత్తి కట్లు జీవిత పునరుజీవనమునకు
శాశ్వత చిహ్నము, దీనికి ఋణగ్రస్థము మానవాళి.
విశ్వమందు నెచటలేని విస్తారపు ఏక వృక్ష
చెట్టు గుబురు మర్రిమాను చిత్రమునౌ దీని ఘనత
ఎనిమిదివందల నలభై ఆరు మీటర్ల చుట్టుకొలత
భూమాతకు మరకతమణి భూరి ఆభరణంబుగ వెలసె.
భారతీయ ఉపఖండపు స్థానికమౌ మొక్కజాతి
‘మల్బరి’ కుటుంబానికి చెందినదీ మర్రి జాతి
కేవలమిది చెట్టు కాదు వనము దివ్యసౌందర్యము
పూనికతో వ్యాపించిన పందిరి హరితపుసుందరి.
చెట్టువోలె కనిపించదు దట్టముగా గుబురుకొన్న
‘తోపు’, చిన్న అడవే ఇది దూరముగా నుండి చూడ
నాలుగు వేలయిన వేర్లు నలుదెసలను దిగి యుండిన
భూమాతకు గొడుగు పట్టు భువనపు రమ్యపు పందిరి.
కాలగతిని వచ్చునట్టి ఘన తుపానులను గూడ
తట్టుకు నిలిచెను తిమ్మమ మర్రిమాను స్థైర్యంబుగ
వర్షాభావపు వ్యగ్రత, కరువులు మరి కాటకములు
వటవృక్షపు నిత్యమైన పెరుగుదలను ఆపలేదు.
కొండల వరుసల మధ్యన కూడెను ఒక పెద్దపాత్ర
వంటిదైన సమప్రాంతము వర్షపు నీరది ఇంకుచు
భూగర్భపు జలము తెచ్చె భూమికి దగ్గర చేయుచు
ఈ వనరే తిమ్మమ్మకు ఎంతయు సమృద్ధి గూర్చె.
భూరి పాత్ర వోలె నిలిచె ప్రకృతి కర్ష్యము నీయగ
మురుగునీరు పారిపోవు వ్యవస్థయే సహజముగను
ఏర్పడెనక్కడ వేరులు కుళ్ళకుండ కాపాడుచు
ప్రకృతిలోని స్వీయ రక్షణంబున కిదియే దృష్టాంతమనగ.
(ముగింపు వచ్చే వారం)
శ్రీ పాణ్యం దత్తశర్మ 1957లో కర్నూలు జిల్లా వెల్దుర్తిలో పుట్టారు. తండ్రి శతావధాని శ్రీ ప్రాణ్యం లక్ష్మీనరసింహశాస్త్రి. తల్లి శ్రీమతి లక్ష్మీనరసమ్మ. టెంత్ వరకు వెల్దుర్తి హైస్కూలు. ఇంటర్, డిగ్రీ, ఎం.ఎ. (ఇంగ్లీషు), ఎం.ఎ. (సంస్కృతం), ఎంఫిల్, పిజిడిటియి (సీఫెల్), ప్రయివేటుగానే.
దత్తశర్మ ఇంటర్మీడియట్ విద్యాశాఖలో లెక్చరర్గా, ప్రిన్సిపాల్గా, రీడర్గా, ఉపకార్యదర్శిగా సేవలందించారు. కవి, రచయిత, విమర్శకులు, గాయకులు, కాలమిస్టుగా పేరు పొందారు. వీరివి ఇంతవరకు దాదాపు 50 కథలు వివిధ పత్రికలలో ప్రచురితమై వాటిలో కొన్ని బహుమతులు, పురస్కారాలు పొందాయి.
వీరు ‘చంపకాలోచనమ్’ అనే ఖండకావ్యాన్ని, ‘Garland of poems’ అన్న ఆంగ్ల కవితా సంకలనాన్ని, ‘దత్త కథాలహరి’ అన్న కథా సంపుటాన్ని ప్రచురించారు. వీరి నవల ‘సాఫల్యం’ సంచిక అంతర్జాల పత్రికలో 54 వారాలు సీరియల్గా ప్రచురితమై, పుస్తక రూపంలో ప్రచురింపబడి అశేష పాఠకాదరణ పొందింది. 584 పేజీల బృహన్నవల ఇది. ‘అడవి తల్లి ఒడిలో’ అనే పిల్లల సైంటిఫిక్ ఫిక్షన్ నవల సంచిక డాట్ కామ్లో సీరియల్గా ప్రచురించబడింది.
వీరికి ఎ.జి రంజని సంస్థ కవి సామ్రాట్ విశ్వనాథ పురస్కారాన్ని, ‘తెలంగాణ పాయిటిక్ ఫోరమ్’ వారు వీరికి ‘Poet of Profundity’ అన్న బిరుదును, బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంవారు వీరి సిద్ధాంత గ్రంథానికి అవార్డును, సి.పి. బ్రౌన్ సమితి, బెంగుళూరు వారు వీరికి ‘NTR స్మారక శతకరత్న’ అవార్డును బహూకరించారు.
ఇద్దరు పిల్లలు. ప్రహ్లాద్, ప్రణవి. కోడలు ప్రత్యూష, అల్లుడు ఆశిష్. అర్ధాంగి హిరణ్మయి. సాహితీ వ్యాసంగంలో రచయితకు వెన్నుదన్నుగా ఉన్న గురుతుల్యులు, ప్రముఖ రచయిత వాణిశ్రీ గారు. వీరు – తమ సోదరి అవధానం లక్ష్మీదేవమ్మ గారు, మేనమామ శ్రీ కె. సీతారామశాస్త్రి గార్లకు ఋణగ్రస్థులు.
