[శ్రీమతి నయన కస్తూరి రచించిన ‘అంతిమ కోరిక’ అనే కథని అందిస్తున్నాము.]
రాజేశ్వరమ్మ గారికి ఆ రోజు ఉదయం నుండి చాలా బోర్గా ఉండి ఏ పనీ చేయబుద్ది కావడం లేదు. టివీ పెట్టుకుని కొంచెం సేపు చూడగానే విసుగుపుట్టి, ఆఫ్ చేసేసింది. కొంచెం సేపు వాళ్ళకీ వీళ్ళకీ ఫోన్ చేసి గడిపింది.
రాజేశ్వరమ్మ గారి భర్త చనిపోయి ఏడాది గడిచి పోయింది. ఒక్కడే కొడుకు. అతనికి పెళ్ళై ఇద్దరు పిల్లలు. అమెరికాలో సెటిల్ అయ్యాడు. మొన్న తండ్రి సంవత్సరీకాలకు వచ్చినప్పుడు తల్లిని తనతో రమ్మంటే రాను కాక రానంది. “నాన్న వెళ్లిపోయారు. నేనిక ఎంతకాలం ఉంటానో తెలీదు, నా జీవితంలో లాస్ట్ స్టేజ్ ఇక్కడే గడుపుకుంటాను రా” అని మొండికేసింది. ఇక కొడుకు కోడలు ఎప్పుడూ రమ్మనమనలేదు.
ఇక్కడ ఒంటరితనాన్ని గడపడం కష్టంగానే వున్నా దేశం కానీ దేశం వెళ్ళడానికి మనసు ఒప్పుకోవడం లేదు. దానికి ఆవిడ కారణాలు ఆవిడకు వున్నాయి. నాలుగు నెలల క్రితం కొడుకు రమ్మనమని గొడవ చేస్తే ఇక తప్పక అమెరికా వెళ్ళారామె బాబాయ్. రెండు నెలలు బాగానే గడిపారు. గుడులు, గోపురాలు, కొండలూ కోనలు తిరిగారు. రోజూ ఫోటోల మీద ఫోటోలు గుప్పించేవారు. అప్పుడప్పుడు, తను కూడా వెళ్తే బాగుండేదా, వెళ్లకుండా తప్పు చేసిందా అనిపించేది. ఇంతలోనే బాబాయికి హార్ట్ ఎటాక్ వచ్చి తనువు చాలించారనే వార్త వచ్చింది. అక్కడి నుండి బాబాయ్ని తేలేకపోయారు. ఇక్కడి అన్నదమ్ములు బంధువులు అమెరికా వెళ్లలేకపోయారు. అక్కడున్న ఒక్క కొడుకు ఏదో కానిచ్చాడు. బాబాయ్ అమెరికా వెళ్లి తప్పుచేశాడా అని అప్పుడనిపించింది రాజేశ్వరమ్మకు.
ఇక అక్క సంగతి అయితే సరే సరి! బావగారు, అక్క అమెరికా లోని కూతురి దగ్గరకు వెళ్లారు. ఒక రోజు అక్కకు హార్ట్ ఎటాక్ రాగా కూతురు దగ్గరే ప్రాణం వదిలింది. కూతురు వుండే స్టేట్లో అంత్యక్రియలకు అపాయింట్మెంట్ తీసుకోవాలిట. దానికి పదిహేను రోజుల దాకా పడుతుందిట. ఫ్యూనరల్ రూమ్లో, పోయిన వారి శరీరాన్ని స్టోర్ చేసి, రోజుకొక సారి బయటకు తీసి, ఎవరి ఆర్థిక స్తోమతని బట్టి, శవాన్ని అలంకరించి కొంచెంసేపు చూపించి మళ్ళీ లోపల పెట్టేసేవారుట. పాపం అక్కకూ అలాగే చేశారుట. రాజేశ్వరి ‘ఇదెక్కడి ప్రారబ్దం రా దేవుడా’ అనుకుని, తను మాత్రం ఎట్టి పరిస్తితుల్లోను దేశం విడిచి మాత్రం వెళ్ళకూడదు అని ఒట్టేసుకుంది. ఈ కారణాలతో ఆవిడ దేశం విడిచి వెళ్ళక తన స్వంత ఇంట్లోనే కాలం గడుపుతోంది.
***
రోజులు గడుస్తున్నాయి. ఆరోగ్యం కూడా క్షీణిస్తోంది. బంధువుల సహాయంతో, పనివాళ్ళ సహాయంతో కాలం గడుపుతోంది.
ఒక రోజు నిద్రలోనే ప్రాణం వదిలింది. కొడుకుకి కబురoదిoది. ఫ్లైట్ టికెట్స్ దొరక్క నాలుగురోజుల తర్వాత బయలుదేరుతానన్నాడు. “అన్ని రోజులు బాడీని ఇంట్లో ఏలా పెట్టుకుంటాము? మార్చురీలో పెడతామురా” అని కొడుకుతో చెప్పారు బంధువర్గం లోని పెద్దలు. సరేనంటూ తన సమ్మతి తెలియ జేశాడు కొడుకు.
అక్కడే తిరుగుతున్న రాజేశ్వరమ్మ ఆత్మ ఒక్కసారి ఉలిక్కిపడింది. ‘అంటే ఏమిటీ, నేనిoకో వారం రోజులు ఆ మార్చురీలో ముడుచుకుని పడుండాల్సిందేనా!’ అని రోదిచిందామె ఆత్మ. చుట్టాలందరూ ఎవరికీ తోచింది వాళ్ళు అనుకుంటూ కొడుకు లేకుండా ఒంటరిగా వున్న రాజేశ్వరమ్మను చూసి జాలి పడుతున్నారు. ‘అయ్యో నా ఇంట్లో నేనున్నా అమెరికాకు వెళ్లకపోయినా, నా అంతిమయాత్ర ఇలా జరుగుతుందనుకోలేదు’ అని బాధపడుతూ అందరికేసి చూపు మరల్చింది. అందరూ రాజేశ్వరమ్మగారి మంచితనాన్ని తలుచుకుంటూ, ఆవిడ ఆత్మకి శాంతి కలగాలని కోరుకుంటూ భగవంతుని ప్రార్థిస్తున్నారు, కంట నీరు పెట్టుకుంటున్నారు. అది చూసి రాజేశ్వరమ్మగారి ఆత్మ శాంతించిoది.
‘వీళ్లంతా నా వాళ్ళు’ అనుకుంది. ప్రశాంతంగా నారాయణుని ప్రార్థించి, మార్చురీకి బయలుదేరింది.
