Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

భారతమాత ప్రశ్న-4

[శ్రీమతి శైలజామిత్ర రచించిన ‘భారతమాత ప్రశ్న’ అనే దీర్ఘ కవితని అందిస్తున్నాము. ఇది 4వ భాగం.]

~
మతాల గోడలు

దయపు మొదటి కిరణం
దేవాలయం గోపురాన్ని తాకింది.

అదే కిరణం
మసీదు గుంబజాన్ని ముద్దాడింది.

అదే వెలుగు
చర్చి శిలువపై నిలిచింది.

అదే తేజస్సు
గురుద్వారా గుమ్మాన్ని అలంకరించింది.

సూర్యుడికి
ప్రార్థనల భాష తెలియదు.

వెలుగుకు
మతం తెలియదు.

గాలికి
సరిహద్దులు లేవు.

వానకు
ద్వేషం రాదు.

అయితే..

దేవుని పేరుతో
మనిషి ఎందుకు
మనిషిని కోల్పోతున్నాడు?

గుడిలో వెలిగించిన దీపమే
ఇంటి బయట
ద్వేషాన్ని ఎందుకు వెలిగిస్తోంది?

ప్రార్థనలో జోడించిన చేతులే
యుద్ధంలో
పిడికిలిగా ఎందుకు మారుతున్నాయి?

ఖురాన్
ప్రేమను పలికింది.

గీత
ధర్మాన్ని నేర్పింది.

బైబిల్
క్షమను బోధించింది.

గురుగ్రంథ్
సేవను చూపించింది.

పుస్తకాలు
మనిషిని దేవుని దగ్గరకు తీసుకెళ్లాయి.

రాజకీయాలు
దేవుణ్ణి
మనిషి కిందకు దించాయి.

దేవాలయం
ఎప్పుడూ యుద్ధం ప్రకటించలేదు.

మసీదు
ఎప్పుడూ ద్వేషాన్ని కోరలేదు.

చర్చి
ఎప్పుడూ రక్తాన్ని అడగలేదు.

దేవుడు
ఒకే ఆకాశాన్ని ఇచ్చాడు.

మనిషి
అందులో
వేల గోడలు కట్టుకున్నాడు.

నేను భారతమాతను..
నా గుండెలో
వేల దేవాలయాలున్నాయి.

నా రక్తనాళాల్లో
ఒకే మానవత్వం ప్రవహిస్తోంది.

మీరు దేవుణ్ణి వెతికారు.
దొరికిందేమిటి?

ఒక గోడ.
ఒక అనుమానం.
ఒక ద్వేషం.

దేవుడు చిరునవ్వు నవ్వాడు..
“నన్ను వెతకడం ఆపు..
నీ పక్కనున్న మనిషిని ప్రేమించు.”

“దేవుడిని చేరే దారి ఒక్కటే..
అది మనిషి హృదయం గుండా వెళ్తుంది.”

“గుడి గోడలు కాదు..
మనసు తలుపులు తెరిస్తే దేవుడు కనిపిస్తాడు.”.

(సశేషం)

Exit mobile version