[రమాకాంత్ రథ్ ఒడియాలో వ్రాసిన ‘గాంధీ ఓ అరజొణొకొ’ అనే కవితని అనువదించి అందిస్తున్నారు డా. తుర్లపాటి రాజేశ్వరి.]
~
తుపాకి తూటాకు బలి అయ్యాక
గాంధీ మత్తునిద్రలోకి జారిపోయాడు
మెలకువ వచ్చాక తెలిసింది.
తననెవరో తుపాకితో కాల్చేశారు!
అవును.. అతడు..
అతడిని ముందెక్కడో చూశాడు
ఎక్కడా? సబర్మతిలో రాట్నం వడుకుతున్నప్పుడా?
ఉప్పు సత్యాగ్రహ ఉద్యమంలోనా?
తను వెళ్లాడు.. బంధించారు.. జైలులో ఉంచారు
లేదు.. లేదు కలకత్తా.. నవాఖలిలో
తిరుగుతున్న వేళ
అతడు కూడా తనతో పాటు ఉన్నాడా?
ఎక్కడ.. ఎక్కడ చూశాడు అతణ్ణి?
గాంధీ అతడికి దగ్గరగా వెళ్ళాడు
ఇన్నాళ్లు నాతో ఉన్నావ్
నేనేం చేశానని..
నన్ను తూటాతో కాల్చి చంపావ్?
అతడన్నాడు
మిమ్మల్ని చంపక ముందు
నన్ను నేను చంపేసుకున్నాను.
మీరు మరణించక ముందే నేను మరణించాను..
కాబట్టే
మిమ్మల్ని చంపగలిగాను
యవనిక జారింది కిందకి
తర్వాత
గాంధీ ముందు నడుస్తుంటే
ఆ మరొకడు ఆయన వెనకే.. అడుగులో అడుగేస్తూ..
ఇద్దరూ ఎక్కడికి వెళ్లి ఉంటారు?
ఏమిటీ.. ఆ రోజు
మనం చూసిందంతా నిజం కాదా?
వారికి అదే సత్యమా ?
మరి ఆ రోజు ప్రార్థనా సభకు?
ఒడియా మూలం: రమాకాంత్ రథ్
తెలుగు అనువాదం: డా. తుర్లపాటి రాజేశ్వరి
డా. తుర్లపాటి రాజేశ్వరి కవయిత్రి, కథా రచయిత్రి, అనువాదకురాలు. కథ, నవల, కవిత్వం, అనువాదం, రూపకం, వ్యాసం, విమర్శ – వివిధ ప్రక్రియలలో రచనలు వెలువరించారు. 23 పుస్తకాలు ప్రచురించారు. అనువాద రంగంలో కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత.
పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయ పురస్కారం, ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం వారి ‘తెలుగు వికాసం పురస్కారం’, కృష్ణాజిల్లా రచయితల సంఘం వారి గుత్తికొండ సుబ్బారావు పురస్కారం, విశాఖ రచయితల సంఘం, భారతనిధి ఫౌండేషన్ వారి బలివాడ కాంతారావు పురస్కారం, చలసాని వసుమతీ మాధవ పురస్కారం మొదలైన పలు ప్రతిష్ఠాత్మక పురస్కారాలు, సన్మానాలు అందుకున్నారు.
