Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

గురువుగారు చెప్పిన చిట్టచివరి పాఠం

[శ్రీ నల్లబాటి రాఘవేంద్రరావు రాసిన ‘గురువుగారు చెప్పిన చిట్టచివరి పాఠం’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]

త్యకీర్తి గొప్ప సాహితీవేత్త. ఎన్నో గ్రంథాలు రాసి ఎన్నో అవార్డులు రివార్డులు సత్కారాలు కూడా పొందిన దిట్ట.

అతను రచించి ప్రచురించిన.. మహోన్నత గ్రంథాలు రమారమి రెండువందల వరకు ఉంటాయి. అవన్నీ అతని ఇంటిలో తన కోసం కేటాయించుకొన్న రెండు గదుల్లో పాతకాలం నాటి టేకు బీరువాల్లో అమర్చుకున్నాడు.. అలాగే తన బిడ్డలు జయేంద్ర.. లలితశ్రీ.. ఇద్దరికీ చెరో గది ప్రత్యేకంగా కేటాయించాడు. అయితే వాళ్లు పెద్దవాళ్లు అయినప్పటికీ తన పుస్తకాలు భద్రపరచుకున్న గదుల్లోకి మాత్రం వెళ్లనివ్వడు.

కుటుంబం కన్నా పుస్తకాలని అంతలా ప్రేమిస్తాడు అతను.

ఇప్పుడు అతను ఓ మహాగ్రంథం వ్రాస్తూ తనకన్నా ఘనాపాటి గ్రంథకర్తల స్ఫూర్తి వాక్యాలు అందులో పొందుపరిచి ఆ గ్రంథాన్ని ముద్రించాలని అనుకున్నాడు. అందుకోసం తనకు దైవసమానులు, గురుతుల్యులు లాంటి చాలా మందిని కలిసి కావలసిన విషయాను సేకరించాడు.

చిట్టచివరగా తను హైస్కూల్‌లో చదువుకునేటప్పటి తన తెలుగుమాస్టారు.. విశిష్ట గ్రంథకర్త అయిన పద్మ ప్రభాకరం గారు ఉంటున్న చెల్లూరు అనే గ్రామం బయలుదేరాడు.

ఆ రోజు.. సాయంకాలం వరకు చాలా కష్టపడి ప్రయాణించి పద్మప్రభాకరo గారు నివసించే ఊరు వెళ్లి ఆయనకు నమస్కరించి విషయం వివరంగా వివరించి ఆయనను ప్రసన్నం చేసుకున్నాడు సత్యకీర్తి.

మాస్టారు పద్మప్రభాకరం గారికి వయస్సు 90 ఏళ్లు పైబడి ఉంటుంది. ఆయన సామాన్యమైన వ్యక్తి కాదు. దేశ విదేశాల్లో సైతం ఆయన సన్మానాలు సత్కారాలు పొందారు.. అన్ని దేశాలలోనూ ఆయనకు అభిమానులు ఉన్నారు. లెక్కకు మించిన బిరుదులు పొందారు. తన శిష్యుడు చెప్పింది విని అతని మీద అభిమానంతో కాదనలేక నీరసంగా అడుగులు వేసుకుంటూ.. లోపలకెళ్లి తను రచించిన.. కట్టలు కట్టబడి ఉన్న పాత కొత్త గ్రంథాలన్నీ జాగ్రత్తగా ఏరిఏరి దుమ్ము దులుపుతూ చివరికి ఓ గ్రంథం చేతులతో పట్టుకుంటూ బయటకు వచ్చారు.

“సత్యకీర్తి.. ఇది నేను రాసిన గ్రంథం నాయనా. ఇది ఎప్పుడో 1990 సంవత్సరంలో ప్రచురింపబడింది. నువ్వు కూడా చాలా గ్రంథాలు రాశావు కదా. నువ్వు సామాన్యుడివి కాదు.. నీ గురించి నాకు తెలుసు.. అయితే నువ్వే నా శిష్యుడు అని మాత్రం ఇంత వరకూ తెలియదు.. నా శిష్యుడు ఇంత గొప్పవాడు అయినందుకు నాకు చాలా గర్వంగా ఉంది నాయనా. చాలా సంతోషం” అంటూ లోపల్నుంచి వచ్చిన మాస్టారు బయట కుర్చీలో కూర్చున్నారు శిష్యుని ఎదురుగా.. చాలా పేజీలు తిరగేసి.. ‘దొరికింది’.. అంటూ ఒకచోట ఆగారు.

“సత్యకీర్తి.. ‘విజ్ఞానసాగరం’ అనే ఈ ఆధ్యాత్మిక గ్రంథములోని ఈ రెండు పేజీల ముఖ్యమైన మేటర్ నీకు ఇస్తాను. అందులో నుంచి నీకు పనికి వచ్చిన వాక్యాలు నువ్వు ఇప్పుడు రాస్తున్న గ్రంథంలో ఎక్కడైనా అన్వయించుకోవడానికి బాగా ఉపయోగపడతాయి. దాంతో నీ గ్రంథానికి బలం వస్తుంది.. నా శిష్యుడైన నీకు సహాయపడ్డ తృప్తి నాకు కలుగుతుంది. నువ్వు వచ్చింది దీని కోసమే కదా.. నేను చదువుతాను నువ్వు రాసుకో నాయనా..” అంటూ చదవడం ఆరంభించారు మాస్టారు.

“చాలా ఆనందం మాస్టారు. ఈ మీ ‘విజ్ఞానసాగరం’ గ్రంథంలో నాకు పనికి వచ్చే ఈ రెండు పేజీలు రోడ్డు అవతలకు వెళ్లి ఫోటోస్టాట్ తీయించుకుని.. 10 నిమిషాలలో మీ గ్రంథం మీకు పట్టుకుని వచ్చి ఇస్తాను. మీకు చదివే శ్రమ ఇవ్వడం నాకు ఇష్టం లేదు.. పైగా నాకు కూడా చాలా లేట్ అవుతుంది. ఆ గ్రంథం ఒకసారి ఇవ్వండి మాస్టారు..” అంటూ వినయంగా అడిగాడు సత్యకీర్తి.

“పుస్తకం బయటకు పట్టుకుని వెళ్తానంటే ఎవరికీ ఇవ్వను నాయనా. నీ సెల్ కెమెరాతో కాపీ వస్తుందేమో.. ప్రయత్నించరాదూ.”

“అలా రాదు మాస్టారు. నాది చిన్న సెల్.. కెమెరాకి అనువైనది కాదు..”

“ఏమీ అనుకోవద్దు నాయనా. ఇదిగో పేపరు పెన్ను. వ్యాసం చదువుతాను రాసుకో..” అంటూ చదవడం ఆరంభించారు పద్మప్రభాకరం మాస్టారు గారు. సత్యకీర్తి చాలాసేపు పూర్తిగా రాసుకున్నాడు

‘వయసు చూస్తే 90 పైపడినట్టు ఉన్నారు. మనిషి మీద నమ్మకం లేని బ్రతుకు ఎందుకు..?’ అంటూ మాస్టారుని ఒక పక్క మనసులో చీదరించుకుంటూ మరోపక్క పుస్తకాల పట్ల ఆయన వాత్సల్యానికి పొగడకుండా ఉండలేకపోయాడు సత్యకీర్తి.

అంతా బాగానే ఉంది కానీ.. మాస్టారు తన ప్రచురింపబడిన పుస్తకాలను బీరువాల్లో.. అలమరలలో చక్కగా పేర్చలేకపోయారు కట్టలుకట్టి.. పోగులుగా పడేశారు. కొన్నిబూజులు పట్టి ఉన్నాయి.. మరికొన్ని అట్టలు ఊడిపోయి చిందర వందరగా ఉన్నాయి. కావలసిన పుస్తకం వెంటనే తీసుకునేటట్లు ఇండెక్స్ అమరిక లేదు. ఇన్ని వందలాది మహత్తరమైన గ్రంథాల పట్ల ఎందుకు మాస్టారు సరైన శ్రద్ధ తీసుకోలేకపోయారు..!? వయసు భారమా..? అయ్యుండొచ్చు.. పోనీ ఆయన కుటుంబ సభ్యులు..? ఏమో..? ఎవరి కుటుంబ విధానాలు ఎలాంటివో..!! కిటికీలోంచి పుస్తకాలు ఉన్న గదులను పరికిస్తూ కించిత్తు బాధ పడ్డాడు సత్యకీర్తి.

“ఈ నా ‘విజ్ఞానసాగరం’ పుస్తకం ఇప్పుడు ఎక్కడ అమ్మటం లేదు.. అని తెలిసింది నాయనా. ఏ కారణం చేతనైనా ఈ పుస్తకం పోతే మళ్లీ నేను కొనుక్కుందాం అన్నా దొరకదు కదా. అందుకనే ఎవరికీ ఇవ్వటం లేదు. మిగిలిన అన్ని పుస్తకాల లోకి ఈ పుస్తకం నా ప్రాణం. మరో విషయం.. నీకు వినిపించిన ఈ రెండుపేజీల ‘దిగువనే’.. ఇదిగో ఈ ఖాళీలో ఈరోజు జరిగింది సింపుల్‌గా రాసి తారీకు కూడా వేసి సంతకం పెట్టుకుంటాను. ఇది నా అలవాటు అన్నమాట..

ఇంకో మాట వయసు పైబడిన వాడిని కదా.. నీ పుస్తకావిష్కరణకు రాలేను. నువ్వు నీ గ్రంథం ప్రింట్ చేశాక వీలుపడితే ఓ పుస్తకం పోస్టులో పంపు.”  అంటూ మాస్టారు పద్మప్రభాకరo గారు.. తన పుస్తకాన్ని లోపలకు తీసుకెళ్ళిపోయి భద్రపరుచుకున్నారు.

సత్యకీర్తి మాస్టారు నుండి సెలవు తీసుకుని ఇంటికి వచ్చాడు. ఆయన నుండి తెచ్చిన కొన్ని వాక్యాలను తన గ్రంథంలో కొన్నిచోట్ల అమర్చి గ్రంథం ప్రచురించి పుస్తకావిష్కరణ కూడా కావించి తెలుగు మాస్టారు కోరినట్టు ఆయనకు కూడా ఒక పుస్తకం బుక్ పోస్టులో పంపడం కూడా జరిగిపోయింది.

మూడు నెలల కాలం గడిచి పోయింది.

ఈ రోజు..

సత్యకీర్తి మళ్లీ తన తెలుగుమాస్టార్ని కలవడానికి చెల్లూరు బయలుదేరాడు.

తను పోస్టులో పంపిన తన గ్రంథం మీద పద్మప్రభాకరం మాస్టారు గారి అభిప్రాయం తెలుసుకోవాలి అన్నది సత్యకీర్తి.. ప్రయాణ ఉద్దేశం.

చెల్లూరు వచ్చి ఊరు బయట టీ బడ్డీ కొట్టు దగ్గర ఆగాడు సత్యకీర్తి.

“ఓ రెండు మసాలా గారెలు ఇవ్వవోయి.” అడిగాడు బడ్డీకొట్టు అతన్ని.

వెంటనే బడ్డీవాలా తన దగ్గరున్న దళసరి బైండ్ పుస్త కంలోంచి ఓ డబల్ పేపర్ కసక్కన లాగి అందులో రెండు మసాలాగారెలు కొంచెం చెట్నీ వేసి సత్యకీర్తికి అందించాడు.

ఆకలి మీద ఉన్న సత్యకీర్తి బడ్డీవాలా అందించిన మసాలాగారెలు తింటూ ఆ గారెలు పెట్టి బడ్డీవాలా ఇచ్చిన.. పేపర్లోని అక్షరాలు స్పష్టంగా కనబడటంతో చదవనారంభించాడు ఆత్రుతగా.

అందుచేత.. ప్రతిమనిషి.. జాగ్రత్తగా విని గుండె పుటల్లో చెక్కుకోవలసిన చివరిమాట ఒకటే..!! మనం ఒక చెట్టు నాటడం ముఖ్యం కాదు!! అలాగని.. దానికి నీళ్లు పోసి.. పెంచి పోషించడం అది కూడా ముఖ్యం కాదు!!

మనకు వీలు కానప్పుడు.. ఆ.. ‘చెట్టు’ పట్ల మనం నెరవేరుస్తున్న.. ‘బాధ్యత’.. ఆపకుండా.. దీక్షతో నిర్వహించే వారసుడిని కానీ వారసురాలిని కానీ ‘నియమించడం’.. అదే అదే అతి ముఖ్యం..!!!

కంటి కన్నా.. ‘కనురెప్ప’ ముఖ్యం.. ఆ కనురెప్పకు కంటిని ‘రక్షించే బాధ్యత’ మనిషి అప్పచెప్పకపోతే.. కన్ను చీకటై పోతుంది..!!”

ఆ వాక్యాలు చదివి ఆశ్చర్యం నుంచి తేరుకోలేక పోయాడు సత్యకీర్తి.

చూస్తే.. బడ్డీవాలా బల్ల మీద తెలుగు మాస్టారి.. ‘విజ్ఞానసాగరం’ గ్రంథం ఉంది..!

ఆ పుస్తకంలో నుంచి చాలా కాగితాలు చింపి అతను మసాలాగారెలు పొట్లాలు కట్టగా కట్టగా.. ఇంకొన్ని.. కాగితాలు మాత్రమే మిగిలిఉన్నాయి.

విచిత్రం ఏమిటంటే.. తను చేతిలో పెట్టుకు తింటున్న.. ‘మసాలాగారెలు’ పేపర్లో బాగా దిగువన మాస్టారు సంతకం కూడా ఉంది. అది.. ఇదివరలో తను మాస్టారుని.. కలిసినప్పుడు.. ఆ రోజు తనతో జరిగిన సంఘటన పేపరు దిగువ ఖాళీలో తారీకుతో సహా సింపుల్‌గా రాసి.. క్రింద పెట్టిన సంతకమే!!!

ఈ రెండు పేజీలలోని వాక్యాలే.. సత్యకీర్తి తన గ్రంథంలో పెట్టుకోవడం కూడా జరిగింది!!!

ఎంత చిత్రం?? మాస్టారి ఇంట్లోని తనకు ఓ ఐదు నిమిషాలు ఇవ్వడానికి నిరాకరించిన ఒరిజినల్ గ్రంథం పేపర్ కటింగ్ లోనే తను మసాలా గారెలు తినటమా?

సత్యకీర్తి.. వెంటనే మసాలా గారెలు కింద పడేసి పరుగులాంటి నడకతో.. మాస్టారు ఇంటికి సమీపించి ఆ ఇల్లు తాళం వేసి ఉండటంతో ఇరుగు పొరుగు వారిని విచారించాడు.

తెలుగు మాస్టారు పద్మప్రభాకరoగారు నెలక్రితం చనిపోయారట!! అతని కొడుకులు.. కోడళ్ళు కూతుళ్ళు.. అల్లుళ్ళు ఇతర దేశాల్లో పెద్దపెద్ద ఉద్యోగాల్లో వెలిగిపోతున్నారట!!!

మాస్టారు భార్య సామాన్య చదువరి. ఆయన కాలం చేయడంతో కర్మకాండలు అయిన వెంటనే ఆ ఇంటిని అమ్మేసి కొడుకులతో పాటు ‘ఆమె’ అమెరికా వెళ్ళిపోతూ తన లగేజీతో పాటు మాస్టారి పుస్తకాలన్నీ మోయలేక.. కొడుకులు కూడా ఆ పుస్తకాలను చీదరించుకుని చిరాకుపడటంతో తూకానికి చిత్తు కాగితాల వాడికి ‘ఆయన మహోన్నత మహోజ్జ్వల గ్రంథాల’న్నీ అమ్మేసిందట!!!!!

అలా వచ్చిపడిందన్నమాట మసాలా గారెల బడ్డీకొట్టు లోకి.. మాస్టారి.. ‘విజ్ఞానసాగరం’ గ్రంథం!

ఈ విషయం గ్రహించిన సత్యకీర్తి మరొక్కక్షణం అక్కడ ఉండలేక వెంటనే తన ఊరు వచ్చి ఇంటికి వెళ్లి గాబరాగా ఆతృతగా తన పిల్లలిద్దర్ని పిలిచాడు..

జయేంద్ర.. లలితశ్రీ.. ఇద్దరూ వచ్చి తండ్రి ఎదురుగా నిలబడ్డారు.

“ఇన్నాళ్లు మీరిద్దరూ నా రూముల్లోకి వస్తుంటే.. ‘వద్దు’ అనేవాడిని. నా గ్రంథాలు.. మీరు చదువుతుంటే.. ‘మీ చదువు ఏదో మీరు చదువుకుంటూ గొప్పవాళ్ళు కండి.. నా పుస్తకాల జోలికి రాకండి’ అంటూ కసురుకునే వాడిని. తప్పుచేశాను.. నాకిప్పుడు జ్ఞానోదయమయింది. గతం గతః.. ఇప్పుడు మీ ఇద్దరికీ చిన్న పరీక్ష పెడుతున్నానర్రా” అన్నాడు.. పిల్లలు ఇద్దరి వైపు చూస్తూ సత్యకీర్తి.

పిల్లలిద్దరికీ విషయం అర్థం కాలేదు.

సత్యకీర్తి తను రాసిన గ్రంథాలు ఉన్న చెరో రూమ్ లోకి ఆ ఇద్దరినీ విడివిడిగా పంపిస్తూ.. ఒక రోజు గడపమన్నాడు.. ఆ సమయంలో తను రచించిన ‘వంద పేజీల’ పుస్తకాలు మాత్రమే చదవడానికి ప్రయత్నించమని అన్నాడు. “ఎవరు ఎక్కువ పుస్తకాలు చదువుతారో దాన్నిబట్టి నేను ఒక నిర్ణయానికి కూడా వస్తాను.” అంటూ చెప్పాడు.

ఈసారీ సత్యకీర్తి మనసు తేలికపడింది. ఎక్కువ పుస్తకాలు చదివిన వారికి పుస్తకాల మీద ప్రీతి ఎక్కువగా ఉన్నట్టు నిర్ణయించి వారికి తన కీర్తి ప్రతిష్ఠలకు సంబంధించిన పుస్తకాల ఆస్తి బాధ్యత అప్పచెప్పాలన్నది అతని ఉద్దేశం.

తను ఇచ్చిన సమయం గడిచాకా.. సత్యకీర్తి వాళ్లు ఉన్న రూముల్లోకి వెళ్ళాడు.

ఇంజనీర్ చదువుతున్న జయేంద్ర వెళ్ళిన రూమ్ లోని పుస్తకాలు.. ఇదివరకటిలా సక్రమంగా కాకుండా చాలా చిందరవందరగా పడిఉన్నాయి.. అతడిని పిలిచి అడగగా.. 3 పుస్తకాలు చదివేసినట్టు గర్వంగా చెప్పుకున్నాడు.. 100 పేజీల పుస్తకాల గురించి వెతకటంతో.. గత్తర అయిన పుస్తకాల్ని మళ్లీ పేర్చడానికి సమయం సరిపోలేదని.. చెప్పాడు తండ్రితో.

ఇక.. కూతురు లలితశ్రీ మెడిసిన్.. ఆమె ఒక పుస్తకం మాత్రమే చదివిందట.. సత్యకీర్తి కోపంగా ఆమె గడిపిన కీర్తి ప్రతిష్ఠలు రూమ్ లోకి వెళ్లి అంతా పరికించాడు

అయితే.. ఆమె చెప్పిన విషయం తెలుసుకొని ఆశ్చర్యపోయాడు.

లలితశ్రీ ముందుగా తనకు తండ్రి ఇచ్చిన రూమ్‌లో.. బీరువాలో.. అలమరలో ఉన్న పుస్తకాలు సక్రమమైన పద్ధతిలో పెట్టింది. దులుపు గుడ్డకర్రతో దుమ్ములన్నీ దులిపి రూమంతా శుభ్రం చేసింది. పుస్తకాలు చెదలు పట్టకుండా ఉపయోగించడానికి తండ్రి కిటికీలో పెట్టిన స్ప్రే కూడా తీసి.. రూమంతా స్ప్రే చేసింది. అంతేనా కొన్ని పుస్తకాలు చిరుగుపడితే కిటికీలో ఉన్న గమ్ము బాటిల్ తీసి అంటించి ఆరబెట్టింది.. ఇవన్నీ చేయడంలో తను కేవలం ఒక పుస్తకం మాత్రమే చదవగలిగాను అని సమయం చాలలేదని తనను క్షమించమని చేతులు కట్టుకు కోరింది తండ్రిని.

దాంతో ఒక నిర్ణయానికి వచ్చిన సత్యకీర్తి కుమార్తె లలితశ్రీని దగ్గరగా తీసుకొని నుదుటిపై ముద్దాడి “అమ్మా.. లలితశ్రీ, మా తెలుగుమాస్టారు చనిపోయి నాకొక ‘జీవిత రహస్యం’ పాఠంలా నేర్పారు. ‘భవిష్యత్ కాలంలో వాళ్లకు’.. అందించడానికి ప్రతి రంగం లోనూ ఎవరికి వారే వాళ్ల ప్రతిభను నిక్షిప్తం చేయవలసిన అవసరం ఉంది.

అంతేకాదు కేవలం ఆస్తులనే కాదు తన కీర్తి ప్రతిష్ఠలను, ప్రతిభను కూడా వెనుక ఉన్నవారు నిలుపగలిగేలా.. రక్షించగలిగేలా ఎవరో ఒకరిని తయారు చేసుకోవడం ప్రతి మేధావి వర్గానికి చాలా ‘ముఖ్యం’.. అన్నది.. ఆయన నేర్పిన పాఠం తల్లి.. కవులకు.. రచయితలకు.. చిత్రకారులకు.. వ్యాపారస్థులకు.. ఇంకా చాలా మందికి.. ఇది వర్తిస్తుంది.

ఇకపోతే నేను పెట్టిన పరీక్షలో నా ‘కీర్తిప్రతిష్ఠల వారసత్వం’ నిలబెట్టే వారసురాలివి.. ‘నువ్వే’ అని.. నీలో క్రమశిక్షణను బట్టి నేను నిర్ణయించుకున్నానమ్మా.

నేను కష్టపడి రచించిన నా గ్రంథాలన్నీ.. నా అనంతరం చెదపట్టకుండా.. అగ్నికి ఆహుతి కాకుండా.. అనామకుల పరం కాకుండా.. తడిచి ముద్దవ్వకుండా.. చివరికి చిత్తుకాగితాల వాడి తూకానికి బలి కాకుండా.. చూడవలసిన రక్షణ బాధ్యత నీకు అప్పచెబుతున్నానమ్మా.”.. అంటూ తన గ్రంథాలున్న రెండు రూమ్‌ల తాళాలగుత్తి కూతురు లలితశ్రీకి అందించాడు ప్రేమతో సత్యకీర్తి.

నిజమే..

మనం ఒక చెట్టు నాటడం ముఖ్యం కాదు!! అలాగని.. దానికి నీళ్లు పోసి.. పెంచి పోషించడం.. అది కూడా ముఖ్యం కాదు!!

మనకు వీలు కానప్పుడు.. ఆ.. ‘చెట్టు’ పట్ల మనం నెరవేరుస్తున్న.. ‘బాధ్యత’.. ఆపకుండా.. దీక్షతో నిర్వహించే వారసుడిని కానీ వారసురాలిని కానీ ‘నియమించడం’ .. అదే అదే అతి ముఖ్యం..!!!

కంటి కన్నా.. ‘కనురెప్ప’ ముఖ్యం.. ఆ కనురెప్పకు కంటిని ‘రక్షించే బాధ్యత’ మనిషి అప్పచెప్పకపోతే.. కన్ను చీకటై పోతుంది..!!”

తన తెలుగు మాస్టారి మహోన్నత గ్రంథంలోని వాక్యాలు మరొక్కసారి గుర్తు చేసుకున్నాడు.. సత్యకీర్తి!

Exit mobile version