[శ్రీ గొర్రెపాటి శ్రీను రచించిన ‘జీవిత గమనంలో..’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]
ఒక్కో మెట్టు ఎక్కుతూ
ఉన్నత స్థాయికి చేరాలని ప్రయత్నిస్తుంటావు!
ఆశలెన్నో హృదయాన నింపుకుని
నయనాల ముందు కదలాడుతున్న
ఆశయ శిఖరాన్ని ఎక్కాలని శ్రమిస్తుంటావు!
పోటీ ప్రపంచం విసురుతున్న సవాళ్లు అనేకం!
జీవన పోరాటంలో ఎదురయ్యే
పెను ప్రమాదాలు అసంఖ్యాకం!
నిన్ను నీ అభ్యున్నతిని కాంక్షిస్తూ
ఉత్తమ సలహాలు ఇచ్చే వాళ్ళు ఉంటారు..
నువ్వు ఓటమిపాలై ఇక్కట్లకు గురైతే
చూడాలనుకునేవాళ్ళు సైతం ఉంటారు..!
ఈ సమాజం మంచి చెడుల సంగమం..
మంచిని స్వీకరించాలి
చెడుని త్యజించాలి..!
అప్పుడే నువ్వు నువ్వుగా
ఎదగగలుగుతావు!
జీవిత గమనంలో
అపజయాలు, కష్టాలు, నష్టాలు,
అక్కడక్కడా కన్నీళ్లను తెప్పించే పరిస్థితులు ఎదురైనా..
నీపై నీకున్న నమ్మకం,
నీ సంక్షేమన్ని కోరుకునేవాళ్ళ హితవచనాలు..
నిన్నేన్నడూ వీడని నీ ఆత్మస్థైర్యమే..
ఊపిరిగా మారగా..
విజయశిఖరాల అన్వేషణలో
అంతిమ విజయం నీదవ్వాలి!
రాజీలేని పోరాటానికి
చిరునామాగా మారి విజేత నువ్వవ్వాలి!
ఇదే నిజ జీవన విజయ సూత్రం!
గొర్రెపాటి శ్రీను అనే కలం పేరుతో ప్రసిద్ధులైన రచయిత జి.నాగ మోహన్ కుమార్ శర్మ డిప్లమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ (బి.టెక్) చదివారు. వీరి తల్లిదండ్రులు శాంతకుమారి, కీ.శే.బ్రమరాచార్యులు.
ఓ ప్రైవేటు సంస్థలో మేనేజర్గా పని చేస్తున్న రచయిత హైదరాబాద్ బాలనగర్ వాస్తవ్యులు.
‘వెన్నెల కిరణాలు’ (కవితాసంపుటి-2019), ‘ప్రియ సమీరాలు’ (కథాసంపుటి-2021) వెలువరించారు. త్వరలో ‘ప్రణయ దృశ్యకావ్యం’ అనే కవితాసంపుటి రాబోతోంది.
