[మణి గారు రచించిన ‘మెరిసిన ముత్యం’ అనే కవితని పాఠకులకి అందిస్తున్నాము.]
ఆరాధనా సంభావన కోసం,
ముత్యాలు చేరేసి,
ముంగిలిలో ముగ్గులు వేయాలని,
దీపాలు వెలిగించి సందడి చేయాలని!
అంతరాల లోతుల్లో,
చిక్కని చక్కని రంగుల,
మేలిమి ముత్యాలు కోసం మునకలు వేస్తాను!
ముత్యపు చిప్పల, కఠోర నిశ్శబ్దం!
ఎంత ప్రయత్నించినా పహరా విడవదు!
ముత్యాల పలుకులు, చిలకల్లా తొంగి చూసి
మళ్ళీ లోపలకి జారుకుంటాయి!
లోతులకి వెళ్ళే కొలదీ,
వీడని నిశీధి నిశ్శబ్దం!
బయటపడని ముత్యాలు!!
తప్పిపోతానేమో అని,
తల మునకలు అవుతూ నేను!!
ఊపిరి ఆడని బాధ,
అమృత బిందువులై ,
రసమయం చేసింది!!!
‘నేను’, వ్యర్థమై, రాలిపోయింది!!!
జాలు వారిన నిశ్శబ్దం లోంచి,
ముత్యం ఒకటి, మెరిసింది!
దీపమై వెలిగింది!
నా పేరు సూర్య మణి భూషణ్. స్వంత వూరు అమలాపురం. నేను స్టేట్ బేంక్ ఆఫ్ ఇండియాలో ఛీఫ్ మేనేజర్ చేసి రిటైర్ అయ్యాను. చిన్నప్పటి నుండి పుస్తకాలు చదవడం; కవితలు కథలు రాయడం నాకు అలవాటు. కానీ, వృత్తి రీత్యా, బిజీగా వుండడంతో.. నా రచనా వ్యాసంగం కొనసాగించడానికి సమయం దొరికేది కాదు.
రిటైర్ అయ్యాక, తీరిక దొరకడంతో, ఏదో ఒకటి రాస్తూ, ఇప్పుడు, నన్ను నేను పేంపర్ చేసుకుంటున్నాను.
ఈ మధ్య, వెబ్ మేగజైన్స్ వచ్చాక కథలు, కవితలు, మేగజైన్స్కి పంపడం సులభమయింది. నా కథలు, కవితలు వెలుగు చూడగలగడానికి అది ఒక కారణం. సంచిక టీమ్ కొత్త రచయితలని ప్రోత్సహించే విధంగా వుండడం వల్ల, నా కవితలు, కథలు సంచికకి పంపుతూ, సంచికకి దగ్గర అయ్యాను.
ఇంకా, గోతెలుగులో కూడా, కొన్ని కథలు చోటు చేసుకున్నాయి. ఆ విధంగా, నేనూ రచయితల జాబితాలో చేరాను.
