రుద్రుడు తనని ఆట పట్టిస్తున్నాడని గ్రహించిన విష్ణువు తాను కూడా నవ్వుతూ, “మీరేం కోరినా తీరుస్తాను” అన్నాడు.
రుద్రుడు విష్ణుచక్రాన్ని విష్ణువుకు అందించాడు.
అయితే తనకు విష్ణుచక్రాన్నిస్తూ ఆశీర్వదించిన శంభు, పార్వతుల విగ్రహాలను అలాగే ప్రతిష్ఠించాడు హరి. జలోద్భవుడి తల తెగి పడిన స్థలంలో తన నివాసం ఏర్పర్చుకున్నాడు. దాంతో ఋషులు, మునులు, దేవతలు, నాగులు, గంధర్వులు, అప్సరసలు అందరూ ఆ ప్రాంతానికి వచ్చారు. శివుడి నుండి చక్రాన్ని అందుకుంటున్న విష్ణువు విగ్రహాన్ని చూసి తరించారు. విష్ణువు నివాసాన్ని చూసి ఆనందించారు.
దేవతలు, గంధర్వులు, నాగులు అందరు విష్ణువు ముందు తమ తమ స్థానాలలో ఆశీనులయిన తరువాత రెండు చేతులు జోడించి కశ్యపుడు విష్ణువుని అభ్యర్థించాడు.
“దేవా ఈ దేశం మానవ నివాస యోగ్యంగా చెయ్యి. ఇక్కడ మనుషులు నివసించాలి. ఈ ప్రదేశం అత్యంత పవిత్రం, అతి సుందరంగా నిలవాలి.”
కశ్యపుడి మాటలు విన్న వెంటనే నాగులు తమ నిరసనను తెలిపారు.
“మునివర్యా, మేము మనుషులతో కలిసి జీవించం.”
వారి మాటలకు కశ్యపుడికి కోపం వచ్చింది.
“మీరు నా మాటలు పూర్తిగా వినకుండానే వ్యతిరేకతను వ్యక్తం చేశారు. సరే, మీరు మనుషులతో కలిసి బ్రతకకపోతే పిశాచాలతో కలిసి బ్రతకండి” అన్నాడు కోపంగా.
కశ్యపుడి ఆగ్రహాన్ని గ్రహించిన నీలుడు చేతులు జోడించి అభ్యర్థించాడు.
“మునిశ్రేష్ఠా, వాళ్ళకేమీ తెలియదు. వాళ్ళ మాటల్ని పట్టించుకోకండి” అని బ్రతిమిలాడాడు.
కశ్యపుడు శాంతించాడు.
“ఇసుక సముద్రంలో ఆరు యోజనాల వీచిక ఉంది. ఆ ప్రాంతంలో అతి భయంకరమైన పిశాచాలు దైత్యులతో కలసి బ్రతుకుతాయి. ఈ పిశాచాలను అదుపులో ఉంచేందుకు కుబేరుడు నికుంభ అనే ఉత్తముడిని పిశాచాలకు రాజుగా నియమించాడు. ప్రతి చైత్రమాసంలో ఇతడు పిశాచాలతో యుద్ధానికి వెళ్తాడు. ప్రస్తుతం నికుంభుడి ఆధీనంలో అయిదు కోట్ల పిశాచాలున్నాయి. ఈ అయిదు కోట్ల పిశాచాలతో నికుంభుడు దుష్టభావనలు గల పిశాచాలతో ఆరు నెలలు పోరాడుతాడు. ఈ దుష్ట పిశాచాలు కూడా అయిదు కోట్లు ఉంటాయి. పది కోట్ల పైనున్న పిశాచాలన్నీ ఈ ఆరు నెలల కాలంలో నాశనమవుతాయి. ఆశ్యయుజ మాసంలో నికుంభుడు తన అయిదు కోట్ల అనుచరులతో హిమాలయాలకు వస్తాడు. ఆరు నెలలు ప్రశాంతంగా, సంతోషంగా ఉంటాడు. ఈ రోజును నుంచి ప్రతీ ఆరు నెలలు నికుంభుడు, అతని అయిదు కోట్ల అనుచర పిశాచాలు ఇక్కడే నివాసం ఏర్పాటు చేసుకుంటాయి. అంటే మీరు ఆరు నెలలు మనుషులతో, ఆరు నెలలు పిశాచాలతో సహవాసం చేయాల్సి ఉంటుంది” అన్నాదు కశ్యపుడు.
అంటే కశ్మీరు ఆవిర్భావంతోటే జలోద్భవుడి పాలబడింది.
జలోద్భవ సంహారం తరువాత దేవతలందరూ కశ్మీరును తమ నివాసం చేసుకున్నారు. కాని అంతలోనే నాగుల అహంకారం వల్ల కశ్మీరు ఆరు నెలలు పిశాచాలను భరించాల్సి వచ్చిందన్న మాట.
ఇక్కడ మనం కాస్త ఆగి, ‘నాగులు’ అన్న పదం గురించి కాస్త లోతుగా చర్చించుకోవాల్సి ఉంటుంది.
భారతీయ పురాణాలను పరిశీలిస్తే, ఆధునిక మానవుడి ఊహకు, బుద్ధికి విరుద్ధమయిన అంశాలు కనిపిస్తాయి. అభూతకల్పనలు, కట్టు కథలు అనిపించే అంశాలుగా తోస్తాయి. నాగులు పూజలు చేయడం, భగవంతుని అభ్యర్థించడం, వానరాలు యుద్ధాలు చేయడం, సముద్రాలు దాటి ఆకాశంలో ఎగుర్తూండటం… మనుషులతో సమానంగా పోటీపడడం, రాక్షసులతో తలపడటం, పిశాచాలు, మానవులు, నాగులు కలిసి బ్రతకటం ఇలాంటి విషయాల గురించి చర్చించాల్సి ఉంటుంది.
(సశేషం)
కస్తూరి మురళీకృష్ణ ప్రసిద్ధ తెలుగు రచయిత. విస్తృతమైన రచనా సంవిధానాల్లో, విస్తారమైన సాహిత్యాన్ని అందిస్తున్నారు. కథ, నవల, వ్యాసాలు మొదలైన ప్రక్రియల్లో, చారిత్రిక కల్పన, కాల్పనిక, సాహిత్యవిమర్శ, వైజ్ఞానిక, వ్యక్తిత్వ వికాస, హారర్, క్రైమ్ తదితర పలు విభాగాలలో రచనలు చేస్తున్నారు. కాల్పనిక, కాల్పనికేతర విభాగాల్లో ఆయన రచించిన రచనలకు పాఠకుల ఆదరణ లభిస్తోంది.
కథాసంపుటాలు: 4 x 5, ఆ అరగంట చాలు, భారతీయ ప్రేమ కథామాలిక, ఉజ్జ్వల భారత మహోజ్జ్వల గాథలు, సైన్స్ ఫిక్షన్ కథలు, జాతక కథలు, థ్రిల్లింగ్ చిల్లింగ్ కథలు, ప్రపంచ ప్రేమ కథామాలిక,
నవలలు: ముస్సోలిని, పునఃసృష్టికి పురిటి నొప్పులు, సౌశీల్య ద్రౌపది, రోషనార, శ్రీకృష్ణదేవరాయలు, అసిధార, అంతర్మథనం, మర్మయోగం, అంతర్యాగం, ఆపరేషన్ బద్ర్, జగమే మారినదీ..,
అనువాద రచనలు: కల్హణ కశ్మీర రాజతరంగిణి కథలు, జోనరాజ రాజతరంగిణి, నీలమత పురాణం, నిజాం పాలన చివరి రోజులు,
వ్యాస సంపుటాలు: తీవ్రవాదం, శైశవ గీతి, అక్షరాంజలి, మనం మరువకూడని మహాయుద్ధం 1857, ప్రాచీన విజ్ఞానం, భారతీయ తత్త్వచింతన, భారతీయ వ్యక్తిత్వ వికాసం, రియల్ స్టోరీస్, క్రైమ్ స్టోరీస్-1, మన ప్రధానమంత్రులు, మన తెలుగు ముఖ్యమంత్రులు,
బయోగ్రఫీలు: మైకేల్ జాన్సన్, సంగీత సరస్వతి లతామంగేష్కర్,
సినిమా పుస్తకాలు: పాడుతా తీయగా, కమర్షియల్ క్లాసిక్స్, నవల నుంచి సినిమాకు,
సంపాదకత్వం/సంకలనాలు: తెలుగు కథల్లో గాంధీ మహాత్ముడు, కులం కథ, రైలు కథలు, క్రీడా కథ, దేశభక్తి కథలు, రామకథాసుధ
పురస్కారాలు/బహుమతులు: 1995లో ఆంధ్రప్రభ ‘దీపావళి’ నవలల పోటీలో ‘అంతర్యాగం‘ నవలకు ద్వితీయ బహుమతి. 1999 లో ఆంధ్రభూమి సస్పెన్స్ నవలల పోటీలో ‘ఆపరేషన్ బద్ర్ ‘ నవలకు ప్రత్యేక బహుమతి లభించాయి. 2017 సంవత్సరానికి తెలుగు విశ్వవిద్యాలయం వారి కీర్తి పురస్కారం గ్రహీత.
~
కల్హణ కశ్మీర రాజతరంగిణి కథలు కన్నడంలోకి; థ్రిల్లింగ్ చిల్లింగ్ కథలు ఒడియాలోకి, మరాఠీలోకి అనువాదమయ్యాయి. ‘పాడుగా తీయగా’ హిందీలోకి అనువాదమవుతోంది.

