దేవతలందరినీ మనస్ఫూర్తిగా, చిత్తశుద్ధితో పూజించిన తరువాత అందంగా అలంకరించుకుని, కడుపు నిండా భోజనం చేసి, ఆనందంగా, మంగళప్రదమైన వాయిద్యాల మోతల నడుమ విత్తనం నాటాలి.
విత్తనాన్ని నీటిలో తడిపి, బంగారంతో కలిపి, మంగళవాయిద్యాల నడుమ శుభసమయంలో నాటాలి.
ముందు భూమిని పవిత్రంగా భావించి, పూజించి భూమిని దున్నాలి. భూమి మధ్యలో మిత్రులు, భార్య, సేవకులందరితోను కలసి కూర్చుని ఆహారాన్ని ఆనందంగా స్వీకరించాలి. హృదయాన్ని సమ్మోహనపరిచే సంగీత వాయిద్యాల మేళనంతో ఆనందంగా పాటలు పాడాలి. నృత్యాలు చేయాలి.
ఈ ఫాల్గుణ మాసం శుక్లపక్షం పదకొండవ రోజున మహిళలు చంద్రుడిని పూజించాలి. బ్రహ్మ ఇచ్చిన వరం ఆధారంగా మహిళలు చంద్రుడిని పూజించాలి. నీటి జంతువుల మాంసం, పలు ఆహార పదార్థాలు, పూల మాలలు, సుగంధ ద్రవ్యాలు, కుంకుమతో చంద్రుడిని అర్చించాలి. పన్నెండవ రోజున స్త్రీ పురుషులు చంద్రుడిని పూజించాలి. ఇంటి ముఖ ద్వారం నుంచి చంద్రుడి విగ్రహాన్ని ఇంటి బయటకు తీసుకువెళ్ళి కిటికీలోంచి ఇంటిలోకి తీసుకురావాలి. ఇంట్లో ఉచితానసంపై చంద్రదేవుడిని ప్రతిష్ఠించాలి.
పధ్నాలుగవ రోజున శంకరుడిని పూజించాలి. ఆ రాత్రి పెద్దగా పండుగ చేసుకోవాలి. ఆ రోజు నికుంభుడు తన సహచరులతో శంకరుడిని పూజిస్తాడు. రాత్రంతా జాగారం చేస్తు శంకరుడిని పూజిస్తూండాలి.
పిశాచాల రాజు నికుంభుడిని కూడా పూజించాలి. చక్కని ఆహార పదార్థాలను వారికి అర్పించాలి. మాంసాహారం చెట్ల నీడలో, పశుశాలలో, నాలుగు రోడ్ల కూడళ్ళలో, నదుల ఒడ్డులలో, ఖాళీగా ఉన్న ఇళ్ళల్లో, కొండల శిఖరాలపై, శ్మశానాలలో ఉంచాలి. వాటిని పిశాచాలు భుజిస్తాయి. ఆ రాత్రి ప్రతి ఒక్కరూ తమ పిల్లలను జాగ్రత్తగా కాపాడుకోవాలి.
ఆ రాత్రి పురుషులు బ్రహ్మచర్యం పాటిస్తూ నాట్యగత్తెల సాంగత్యంలో ఆడుతూ, పాదుతూ నృత్యాలు చేస్తూ గడపాలి. కృష్ణపక్షం పదిహేనవ రోజున శ్రాద్ధకర్మలు నిర్వహించి కుక్కలకు ఆహారాన్ని అర్పించాలి.
చైత్రమాసం మొదటి రోజున బ్రహ్మను పూజించాలి. పలురకాల పుష్పాలతో, సుగంధ ద్రవ్యాలతో, వస్త్రాలు, ఆభరణాలు అర్పిస్తూ అగ్నిని పూజించాలి. బ్రాహ్మణులను సంతృప్తి పరచాలి.
అదే రోజు ధనవంతులు ఆయురారోగ్య ఐశ్వర్యాలు కాంక్షిస్తూ మహాశాంతి పూజను జరపాలి. అదే రోజు కాలాన్ని పూజించాలి.
బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులను పూజించాలి. గ్రహశాంతులు చేయాలి. సకల నక్షత్రాలను, గ్రహాలను పూజించాలి. సంవత్సరాలను, కాలాన్ని, కల్పాన్ని, పధ్నాలుగు మనువులను, భూత భవిష్యత్కాలాలలోని మనువులను పూజించాలి. ఆ మనువుల పేర్లు చెప్తా విను:
స్వయం భువ మనవు, స్వారోచిష మనువు, ఉత్తమ, తామస, రైవత, చక్షుస, వైవస్వత, అర్క సావర్ణి, బ్రహ్మ సావర్ణి, భద్రేశ, దక్ష సావర్ణి, రౌచ్య, భౌత్య.
దేవతల పధ్నాలుగు ప్రభువులు: విహాధుక, విపశ్చిత్త, శుచిత్తి, నిధి, విభు, మనోజవ, తేజస్వి, వాది, అద్భుత, శాంతి, కృష – రుతుధిమ, శుచి, శుక్ల వంటి వారిని పూజించాలి. తరువాత యుగాలను పూజించాలి. అయిదు సంవత్సరాలు, రెండు ఆయనాలు, ఆరు ఋతువులు, పన్నెండు నెలలను పూజించాలి. చరణాలు, ముహూర్తాలు, రాశులను పూజించాలి. మారీచి, అత్రి, అంగీర, పౌలస్త్య, పులాహ, క్రతు, భృగు, సనత్కుమార, సనక, సనందన, ధర్మ, వశిష్ఠ, సత్య, కామ, అర్థి, హుతాశన, వసులు, రుద్రులను పూజించాలి. లోకాలోక పర్వతాలపై నున్న పాలకులు, సుధామ, శంఖపాద, కేతుమాన, హిరణ్యరోమ వంటి వారందరినీ పూజించాలి.
శుక్రుడిని పూజించాలి. దక్ష పుత్రికలు సతి, ఖ్యాతి, స్మృతి, స్వాహా, అనసూయ, స్పధ, ప్రీతి, క్షమ, సంభూతి, సన్నతి, అరుంధతి, కీర్తి, లక్ష్మి, ధృతి, మేధ, మేస్త్రి, శ్రద్ధ, క్రియ, మతి, బుద్ధి, లజ్జ, వసు, శాంతి, పుస్తి, సిద్ధి, రతి, అరుంధతి, వసుధసి, లంబ, భామ, మరుత్వతి, సంకల్ప, ముహూర్త, సాధ్య, విశ్వ, అదితి, దితి, కొల, దనయూ, సింహిక, ముని, కద్ర, క్రోధ, ఇళా, పావమినత, సురభి, ఖుస, భృశస్వ, సుప్రభ, జయలను పూజించాలి. బాహుపుత్రను అతని ఇద్దరి భార్యలతో సహా పూజించాలి. అరిష్టకేతుని అతని నలుగు భార్యలతో పూజించాలి. రిద్ధి, వృద్ధు, నిశ్ర, ధనేశ, నాద కుబేరలను పూజించాలి. ధనాన్ని, శంఖ, పద్మ, ఛత్రవాళి, సరస్వతిలను అర్చించాలి.
(ఇంకా ఉంది)
కస్తూరి మురళీకృష్ణ ప్రసిద్ధ తెలుగు రచయిత. విస్తృతమైన రచనా సంవిధానాల్లో, విస్తారమైన సాహిత్యాన్ని అందిస్తున్నారు. కథ, నవల, వ్యాసాలు మొదలైన ప్రక్రియల్లో, చారిత్రిక కల్పన, కాల్పనిక, సాహిత్యవిమర్శ, వైజ్ఞానిక, వ్యక్తిత్వ వికాస, హారర్, క్రైమ్ తదితర పలు విభాగాలలో రచనలు చేస్తున్నారు. కాల్పనిక, కాల్పనికేతర విభాగాల్లో ఆయన రచించిన రచనలకు పాఠకుల ఆదరణ లభిస్తోంది.
కథాసంపుటాలు: 4 x 5, ఆ అరగంట చాలు, భారతీయ ప్రేమ కథామాలిక, ఉజ్జ్వల భారత మహోజ్జ్వల గాథలు, సైన్స్ ఫిక్షన్ కథలు, జాతక కథలు, థ్రిల్లింగ్ చిల్లింగ్ కథలు, ప్రపంచ ప్రేమ కథామాలిక,
నవలలు: ముస్సోలిని, పునఃసృష్టికి పురిటి నొప్పులు, సౌశీల్య ద్రౌపది, రోషనార, శ్రీకృష్ణదేవరాయలు, అసిధార, అంతర్మథనం, మర్మయోగం, అంతర్యాగం, ఆపరేషన్ బద్ర్, జగమే మారినదీ..,
అనువాద రచనలు: కల్హణ కశ్మీర రాజతరంగిణి కథలు, జోనరాజ రాజతరంగిణి, నీలమత పురాణం, నిజాం పాలన చివరి రోజులు,
వ్యాస సంపుటాలు: తీవ్రవాదం, శైశవ గీతి, అక్షరాంజలి, మనం మరువకూడని మహాయుద్ధం 1857, ప్రాచీన విజ్ఞానం, భారతీయ తత్త్వచింతన, భారతీయ వ్యక్తిత్వ వికాసం, రియల్ స్టోరీస్, క్రైమ్ స్టోరీస్-1, మన ప్రధానమంత్రులు, మన తెలుగు ముఖ్యమంత్రులు,
బయోగ్రఫీలు: మైకేల్ జాన్సన్, సంగీత సరస్వతి లతామంగేష్కర్,
సినిమా పుస్తకాలు: పాడుతా తీయగా, కమర్షియల్ క్లాసిక్స్, నవల నుంచి సినిమాకు,
సంపాదకత్వం/సంకలనాలు: తెలుగు కథల్లో గాంధీ మహాత్ముడు, కులం కథ, రైలు కథలు, క్రీడా కథ, దేశభక్తి కథలు, రామకథాసుధ
పురస్కారాలు/బహుమతులు: 1995లో ఆంధ్రప్రభ ‘దీపావళి’ నవలల పోటీలో ‘అంతర్యాగం‘ నవలకు ద్వితీయ బహుమతి. 1999 లో ఆంధ్రభూమి సస్పెన్స్ నవలల పోటీలో ‘ఆపరేషన్ బద్ర్ ‘ నవలకు ప్రత్యేక బహుమతి లభించాయి. 2017 సంవత్సరానికి తెలుగు విశ్వవిద్యాలయం వారి కీర్తి పురస్కారం గ్రహీత.
~
కల్హణ కశ్మీర రాజతరంగిణి కథలు కన్నడంలోకి; థ్రిల్లింగ్ చిల్లింగ్ కథలు ఒడియాలోకి, మరాఠీలోకి అనువాదమయ్యాయి. ‘పాడుగా తీయగా’ హిందీలోకి అనువాదమవుతోంది.

