వినాయకస్త గంగేయౌ విశ్వతో వర్ధనద్రుమః।
త్వదృష్ట్యా సర్వకల్యాణీం సిద్ధి మాప్నాతి కశ్మీరః॥
గోనందుడి కోరికను మన్నించి బృషదశ్వుడు కాశ్మీరంలోని పవిత్ర స్థలాలు, వాటి పవిత్రత, ప్రత్యేకతలు వివరించటం ఆరంభించాడు.
వర్ధనద్రుమ వద్ద వినాయక దర్శనం విజయాన్నిస్తుంది. శుభాన్నిస్తుంది. ఒక క్రోసు దూరంలో అన్ని కోరికలు తీర్చే వినాయకుడి మరో రూపం ఉంది. ఇక్కడ దర్శనం తరువాత చేపట్టిన ప్రతి కార్యం ఫలవంతం అవుతుంది.
కాశ్మీరంలో గణేశుడు పలు రూపాలలో కొలువై ఉన్నాడు.
భూర్జర స్వామి, హిడింబేశ, లోభార, శ్రీ వినాయక, ఉతక్కేశ, గుహవాసి, భీమేశ, సౌముఖ, భద్రేశ్వర, మహాస్వ, మహాసన, గణేషణ, పొలస్త, గిరివాసి, జయేశ్వర, మహాశ్వరుల దర్శన ఫలం వినాయక దర్శనంతో ఫలిస్తుంది. వీరిలో ఏ ఒక్కరిని దర్శించుకున్నా అందరనీ దర్శించున్న ఫలం లభిస్తుంది. కార్యసిద్ధి లభిస్తుంది. పుణ్యం లభిస్తుంది.
శచీముదం దగ్గర ఉన్న పౌలస్త్యుడిని, పాత్రకూడంలో స్నానం చేసి దర్శించిన వారికి కౌమరలోకం లభిస్తుంది.
మలీవనం (మాల్సవనం) దగ్గరి గౌతమీశుడు, విశ్రామిత్రేశ్వరుడు, సోనాసికం వద్ద వసిష్ఠేశ్వరుడు, ముఖరేశం వద్ద సురేశ్వరుడు, స్కందేశ్వరుడు, విశాభేషం దర్శనం వల్ల గోదాన ఫలం లభిస్తుంది. శత అశ్వమేధ యాగాలు చేసిన పుణ్యం శక్రదర్శనం వల్ల లభిస్తుంది. పౌలస్త్యుడు భరద్వాజుడు, కశ్యపుడు, కచ్యుడు, అగస్త్యుడు, వశిష్ఠుడు వంటి వారు ప్రతిష్ఠించిన విగ్రహాలు దర్శనం వల్ల వంద గోవులను దానం చేసిన ఫలం వస్తుంది. అంగీరసుడు నిర్మించిన అన్ని విగ్రహాల దర్శనం వల్ల స్వర్గం ప్రాప్తిస్తుంది.
తైజస సరస్సులో స్నానం చేసి యుముడిని దర్శించుకున్న వారికి గోదానం, తిలల దానం ఫలం ప్రాప్తిస్తుంది.
పుష్కరతీర్థంలో స్నానం చేసి సూర్యసుతుడిని దర్శచుకున్న వారికి సర్వ విపత్తు నాశనం జరుగుతుంది, స్వర్గ లోకం ప్రాప్తిస్తుంది.
యముడు, సుతంతేశ, వషిష్ఠ, ప్రవిష్ట యముడు దర్శనంతో అన్ని పాపాలు నశిస్తాయి.
ఈ శక్తిమయులయిన దైవదర్శనం నక్షత్ర ఖచిత రాత్రి పూట చేసుకోవాలి.
విరూపాక్షుడి దర్శనం వల్ల రాక్షసభయం నశిస్తుంది.
వరుణుడి, బలి ప్రతిష్ఠించిన దేవతా విగ్రహాల దర్శనంతో పాపాలు పటాపంచలు అవటంతో పాటు వరుణ లోకం ప్రాప్తిస్తుంది.
మానస సరోవరం ఉత్తర తీరాన ఉన్న మహా పద్మ సరస్సులో స్నానం చేసి పౌలస్త్య నిర్మిత మందర దర్శనంతోటే రోగ విముక్తి లభిచటంతో పాటు గోదాన ఫలం లభిస్తుంది.
అగస్త ప్రతిష్ఠ కపోతశ్వర, స్రేతర, గౌతమస్వామి, శార్నఖ వంటి వాటి దర్శనంతో సకల ధనప్రాప్తి సంభవిస్తుంది.
సుచంద్రరాజు ప్రతిష్ఠించిన శశాంక విగ్రహ దర్శనంతో చంద్రలోకం సంప్రాప్తిస్తుంది.
మణిభద్రుడి దర్శనంతో ధనలాభం సంభవిస్తుంది.
పర్వతంపై అగస్త్యుడు ప్రతిష్ఠించిన వామదేవుడి దర్శనంతో ఆనందం లభిస్తుంది, అందం ఇనుమడిస్తుంది.
కేశవ సహిత దేవీ విగ్రహాన్ని పులస్త్యుడు ప్రతిష్ఠించాడు. ఈ విగ్రహ దర్శనంతో పాపాలు నశిస్తాయి. అత్యత్తమ జ్ఞానం ప్రాప్తిస్తుంది.
కాశ్మిరలోని విశోకుడి దర్శనంతో విష్ణులోకంలో గౌరవం లభిస్తుంది.
భీమ దేవత దర్శనంతో ధన లాభం కలుగుతుంది. కపింజలి, సురేశ్వరి, భద్రేశ్వరి, గౌతమేసి, కాళాశాల, ఉద్యోగశ్రీ, గవాక్షి, చండిక, దుర్గ. గౌరి, సువిజయ, శకుని, బ్రహ్మచారిణి, భద్రేశ్వరి వంటి దైవాల దర్శనంతో కొన్ని కోరికలు సిద్ధిస్తాయి.
హరుడి తొడపై కుర్చున్న చక్రస్వామి దేవత విగ్రహాన్ని దర్శించుకున్న వారి పాపాలు నశించటమే కాక వారికి రుద్రలోకం ప్రాప్తిస్తుంది.
(ఇంకా ఉంది)
కస్తూరి మురళీకృష్ణ ప్రసిద్ధ తెలుగు రచయిత. విస్తృతమైన రచనా సంవిధానాల్లో, విస్తారమైన సాహిత్యాన్ని అందిస్తున్నారు. కథ, నవల, వ్యాసాలు మొదలైన ప్రక్రియల్లో, చారిత్రిక కల్పన, కాల్పనిక, సాహిత్యవిమర్శ, వైజ్ఞానిక, వ్యక్తిత్వ వికాస, హారర్, క్రైమ్ తదితర పలు విభాగాలలో రచనలు చేస్తున్నారు. కాల్పనిక, కాల్పనికేతర విభాగాల్లో ఆయన రచించిన రచనలకు పాఠకుల ఆదరణ లభిస్తోంది.
కథాసంపుటాలు: 4 x 5, ఆ అరగంట చాలు, భారతీయ ప్రేమ కథామాలిక, ఉజ్జ్వల భారత మహోజ్జ్వల గాథలు, సైన్స్ ఫిక్షన్ కథలు, జాతక కథలు, థ్రిల్లింగ్ చిల్లింగ్ కథలు, ప్రపంచ ప్రేమ కథామాలిక,
నవలలు: ముస్సోలిని, పునఃసృష్టికి పురిటి నొప్పులు, సౌశీల్య ద్రౌపది, రోషనార, శ్రీకృష్ణదేవరాయలు, అసిధార, అంతర్మథనం, మర్మయోగం, అంతర్యాగం, ఆపరేషన్ బద్ర్, జగమే మారినదీ..,
అనువాద రచనలు: కల్హణ కశ్మీర రాజతరంగిణి కథలు, జోనరాజ రాజతరంగిణి, నీలమత పురాణం, నిజాం పాలన చివరి రోజులు,
వ్యాస సంపుటాలు: తీవ్రవాదం, శైశవ గీతి, అక్షరాంజలి, మనం మరువకూడని మహాయుద్ధం 1857, ప్రాచీన విజ్ఞానం, భారతీయ తత్త్వచింతన, భారతీయ వ్యక్తిత్వ వికాసం, రియల్ స్టోరీస్, క్రైమ్ స్టోరీస్-1, మన ప్రధానమంత్రులు, మన తెలుగు ముఖ్యమంత్రులు,
బయోగ్రఫీలు: మైకేల్ జాన్సన్, సంగీత సరస్వతి లతామంగేష్కర్,
సినిమా పుస్తకాలు: పాడుతా తీయగా, కమర్షియల్ క్లాసిక్స్, నవల నుంచి సినిమాకు,
సంపాదకత్వం/సంకలనాలు: తెలుగు కథల్లో గాంధీ మహాత్ముడు, కులం కథ, రైలు కథలు, క్రీడా కథ, దేశభక్తి కథలు, రామకథాసుధ
పురస్కారాలు/బహుమతులు: 1995లో ఆంధ్రప్రభ ‘దీపావళి’ నవలల పోటీలో ‘అంతర్యాగం‘ నవలకు ద్వితీయ బహుమతి. 1999 లో ఆంధ్రభూమి సస్పెన్స్ నవలల పోటీలో ‘ఆపరేషన్ బద్ర్ ‘ నవలకు ప్రత్యేక బహుమతి లభించాయి. 2017 సంవత్సరానికి తెలుగు విశ్వవిద్యాలయం వారి కీర్తి పురస్కారం గ్రహీత.
~
కల్హణ కశ్మీర రాజతరంగిణి కథలు కన్నడంలోకి; థ్రిల్లింగ్ చిల్లింగ్ కథలు ఒడియాలోకి, మరాఠీలోకి అనువాదమయ్యాయి. ‘పాడుగా తీయగా’ హిందీలోకి అనువాదమవుతోంది.

