సంక్రాంతి పండుగ..
రైతన్నలకు సిరుల కానుకలు
అందించే శుభ పండుగ!
ఇండ్ల ముందు మెరిసే
రంగురంగుల రంగవల్లికలు..
హరిదాసుల సంకీర్తనల పరవశాలు..
పసిపాపాయిల కేరింతల ఉత్సవాలు..
కొత్త అల్లుళ్ళ రాకతో
మురిసే తెలుగు లోగిళ్ళు..
కుర్రాళ్ళంతా ఒక్క చోట చేరి
ఆడే పతంగాల విన్యాసాల వేడుకలు..
కోడిపందాలతో
కొత్త పంటల పాయసాల పాల పొంగులతో
నింగినంటే కోలాహలాల సంబరాలు..
పట్టణ ప్రజానికం సైతం స్వంత ఊళ్ళకు
మమకారంగా పయనమై కదులుతుంటే..
పాడిపంటలకు పుట్టిళ్ళైన గ్రామసీమలు
ఆనందాలకు నిలయాలు!
ధాన్యరాశుల రాకతో
లక్ష్మీదేవి క్షేత్రాలై వర్ధిల్లుతూ
..అలరారే పల్లెటూర్లు
దేశ అభ్యున్నతికి పట్టుగొమ్మలు!
గొర్రెపాటి శ్రీను అనే కలం పేరుతో ప్రసిద్ధులైన రచయిత జి.నాగ మోహన్ కుమార్ శర్మ డిప్లమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ (బి.టెక్) చదివారు. వీరి తల్లిదండ్రులు శాంతకుమారి, కీ.శే.బ్రమరాచార్యులు.
ఓ ప్రైవేటు సంస్థలో డిప్యూటీ మేనేజర్గా పని చేస్తున్న రచయిత హైదరాబాద్ బాలనగర్ వాస్తవ్యులు.
‘వెన్నెల కిరణాలు’ (కవితాసంపుటి-2019), ‘ప్రియ సమీరాలు’ (కథాసంపుటి-2021) వెలువరించారు. త్వరలో ‘ప్రణయ దృశ్యకావ్యం’ అనే కవితాసంపుటి రాబోతోంది.