Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

తెలుగుజాతికి ‘భూషణాలు’-25

[1954-2024 మధ్య ఏడు దశాబ్దాలలో ఉభయ తెలుగు రాష్ట్రాలకు చెందిన భారత రత్న, పద్మ విభూషణ్, పద్మ భూషణ్, పద్మశ్రీ – పురస్కార గ్రహీతల జీవనరేఖలను అందిస్తున్నారు డా. రేవూరు అనంతపద్మనాభరావు.]

~

క్రికెట్ దిగ్గజం సి.కె. నాయుడు (31 అక్టోబరు 1895 – 14 నవంబరు 1967):

సి.కె. నాయుడుగా ప్రసిద్ధికెక్కిన కొఠారి కనకయ్య నాయుడు భారత టెస్ట్ క్రికెట్ జట్టు తొలి కెప్టన్. 1955లో పద్మ భూషణ్ అందుకున్న ఘనుడు. భారత క్రికెట్ చరిత్రలో 1916-36 మధ్య రెండు దశాబ్దులు నాయుడు యుగం. కుడి చేతివాటంతో బ్యాటింగు చేయడం ఆయన ప్రత్యేకత. నాయుడు పూర్వీకులు మచిలీపట్టణానికి చెందినవారు. ఆయన తాతగారు నారాయణ స్వామికి రెండు తరాల ముందే వీరి కుటుంబం హైదరాబాదుకు తరలిపోయింది. నారాయణస్వామి తాత నిజాం నవాబు వద్ద దుబాసీ. నాయుడు తండ్రి సూర్య ప్రకాశరావు హోల్కర్ సంస్థానంలో న్యాయమూర్తిగా నాగపూరులో ఉండగా సి.కె.నాయుడు జన్మించారు.

పాఠశాల రోజులనుండి క్రికెట్ ఆటలో ప్రతిభ చూపారు. 1916లో హిందూ జట్టులో చేరి యూరోపియన్ జట్టుతో పోరాడారు. 9వ ఆటగాడిగా బ్యాటింగుకు దిగి మూడు బంతులు అడ్డుకొని, నాలుగు బంతిని ‘సిక్సర్’ కొట్టారు. ఆరు దశాబ్దుల పాటు ఫస్ట్ క్లాక్ క్రికెట్ ఆడిన కొద్దిమంది క్రీడాకారులలో ఆయన ఒకరు. 1956-57లో రంజీ ట్రోఫీలో తన 62వ ఏట చివరిసారిగా ఆగారు. ఆ మ్యాచ్లో 52 పరుగులు చేశారు. రిటైరయినా కొన్నాళ్లు సెలక్టరుగా, ఆకాశవాణి వ్యాఖ్యాతగా కొనసాగారు.

48 ఎనిమిదేళ్ల సుదీర్ఘ ఫస్ట్ క్లాస్ కెరీర్‌లో నాయుడు అనేక టోర్నమెంట్లలో ఆడారు. మొత్తం 344 మ్యాచ్లు ఆడి 11825 పరుగులు తీసి చరిత్ర సృష్టించారు. 411 వికెట్లు తీసుకున్నారు. సగానికిపైగా నలభైఏళ్లు దాటిన తర్వాత ఆడిన మ్యాచ్‌లే. ఏడు అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడి 350 పరుగులు తీసి, తొమ్మది వికెట్లు తీసుకొన్నారు. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 50 ఏళ్ల వయను దాటాక కూడా డబుల్ సెంచరీ చేశారు. క్రికెటర్ ఆఫ్ ది ఇయర్‍గా 1933లో ‘విజ్డెన్’ పత్రిక ఎంపిక చేసింది.

“నేను హోల్కర్ సంస్థాన పాలకుడిలైతే కావచ్చు కానీ, ఔట్ డోర్ గేమ్స్‌లో రారాజు మాత్రం సి.కె. నే” అని హోల్కర్ మహారాజా యశ్వంత్ ప్రశంసించారు. నాయుడు కుమార్తె చంద్ర నాయడు – ‘A Daughter Remembers’ అనే గ్రంథం వ్రాసింది,

సారాంశం (ఫస్ట్ క్లాస్ మ్యాచ్‍ల గణాంకాలు):

వాతావరణ శాస్త్రవేత పి. కోటీశ్వరం (25- మార్చి 1915 – 11 జనవరి 1997):

వాతావరణ శాస్త్రవేత్తగా అంతర్జాతీయ ఖ్యాతి గడించిన పంచేటి కోటీశ్వరానికి 1975లో పద్మ భూషణ్ లభించింది. కోటీశ్వరం నెల్లూరులో జన్మించారు. 1931లో ఆయన ఇంటర్మీడియట్ పరీక్షలలో ఆంధ్ర ప్రదేశ్‍లో మొదటి స్థానం సాధించారు. ఫలితంగా ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి సర్. ఆర్. వెంకట రామన్ గోల్డ్ మెడల్ లభించింది. మదరాసు ప్రెసిడెన్సీ కాలేజి నుండి 1939లో బి.యస్.సి డిగ్రీ చేశారు. మదరాసు విశ్వవిద్యాలయంలో వి. రామకృష్ణారావు పర్యవేక్షణలో పరిశోధన ‘రామన్ ఎఫెక్ట్’ మీద చేసి డి.యన్.సి సంపాదించారు.

1940లో తొలిసారిగా ఇండియన్ మెటీయొరాలజీ సర్వీసులో సహాయ వాతావరణ శాస్త్రవేత్తగా సెలక్ట్ అయి అదే విభాగానికి డైరక్టర్ జనరల్ హోదాకు చేరుకున్నారు. ఇరాన్ ప్రభుత్వంలో వరల్డ్ హెల్త్ ఆర్గనైజరు నిపుణునిగా, వాతావరణ విభాగ సలహాదారుగా (1975-78) వ్యవహరించారు. ఆంధ్ర యానివర్శిటీలో మెటియొరాలజీ అండ్ ఓషనోగ్రఫీ శాఖలో గౌరవ ప్రొఫసర్‌గా 1972-82 మధ్య ఉన్నారు. వాతావరణశాస్త్ర రంగ పరిశోధనలకై అమెరికా (చికాగో), మయామీ దేశాలకు విజిటింగ్ ప్రొఫెసర్‌గా వెళ్ళారు, అంతేకాదు, ప్రపంచ వాతావరణ సంస్థ గౌరవ సభ్యులు. వరల్డ్ మెటియోరోలాజికల్ ఆర్గనైజేషన్ ఉపాధ్యక్షులు. అసోసియేషన్ ఆఫ్ హైడ్రాలజిస్ట్స్ ఆఫ్ ఇండియా ఉపాధ్యక్షులు; ఇండియన్ నేషనల్ సైన్స్ అకాడమీ ఫెలోగా 1974లో ఎంపికయ్యారు.

1970-73 మధ్య ఆయన మార్గదర్శకత్వంలో తూర్పుకోస్తా తీరం వెంబడి తుఫాను హెచ్చరికల రాడార్ సిస్టం నెలకొల్పబడింది. వాతావరణ శాఖ వారి సేవలను ఆధునికం చేసిన ఘనత ఆయనది. ఋతుపవనాలు, అల్పపీడనాలు, తుఫానులు, వాతావరణ మార్పులు, వరదలు మొదలైన అంశాలమీద ఆయన చేసిన పరిశోధనలు అంతర్జాతీయ ఖ్యాతి గడించాయి. శాటిలైట్లు లేని ఆ రోజుల్లో సాంకేతికంగా ఆయన పడ్డ శ్రమ అనిర్వచనీయం.

ప్రముఖ వైద్యులు డా. వి. రామలింగస్వామి (8 ఆగస్టు 1921 – 28 మే 2001)

వులిమిరి రామలింగస్వామి శ్రీకాకుళంలో జన్మించారు. తండ్రి ప్రభుత్వాద్యోగి. రామలింగస్వామి విశాఖపట్టణంలోని ఆంధ్ర మెడికల్ కాలేజీలో యం.బి.బి.యస్. చేశారు. స్కాలర్‍షిప్ లభించి పై చదువులకు ఆక్స్‌ఫర్డ్ వెళ్లారు. ఆయన పాథాలజీ నిపుణులు. పోషకాహారంపై ఆయన చేసిన తొట్టతొలి పరిశోధనల ఫలితంగా ఆయన నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్, రష్యన్ అకాడమీ ఆఫ్ మెడికల్ సైన్సెస్, రాయల్ సొసైట్ ఆఫ్ లండన్ సంస్థలకు ఎన్నికయ్యారు. ఆయన డిల్లీలోని ఆల్ ఇండియా మెడికల్ ఇనిస్టిట్యూట్ డైరక్టరుగా 1969-79 మధ్య దశాబ్దకాలం పని చేశారు.

ఆ తర్వాత ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రిసెర్చి, ఢిల్లీ సంస్ధకు డైరక్టర్ జనరల్ అయ్యారు. ఆ సంస్థ భవనానికి ఆయన పేరే పెట్టారు. ప్రపంచ ఆరోగ్య సంస్థకు ప్రత్యేక సలహాదారు. నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇమ్యునాలజీ సంస్థకు అధిపతి. 1990-93 మధ్య జెనీవా లోని అంతర్జాతీయ ఆరోగ్య పరిశోధనా వృద్ధి సంస్థ ఆధిపత్యం లభించింది. 1992లో రోములో జరిగిన న్యూట్రిషన్ అంతర్జాతీయ సదస్సుకు అగ్రాసనాధిపతి. 1999లో కెనడాలోని IDRC (పరిశోధనా సంస్థ) బోర్డు గవర్నరుగా నియమితులయ్యారు.

1986 రాయల్ సొసైట్ ఆఫ్ లండన్ వారి ఫెలోషిప్ తో బాటు పలు అంతర్జాతీయ సంస్థల పురస్కారాలు లభించాయి. 1969లో పద్మశ్రీ, ఆ తరువాత పద్మ భూషణ్, పద్మ విభూషణ్ అందుకున్నారు. తరువాత కాలంలో AIMS డైరక్టర్‌గా పనిచేసిన డా. పి. వేణుగోపాల్ 1998లో పద్మ భూషణ్ పురస్కారం పొందారు.

సమీక్ష:

1954 నుండి 1990 వరకు జరిగిన ‘పద్మ’ పురస్కారాల ప్రదానాన్ని గమనిస్తే సాహిత్య కళా రాజకీయ రంగాలకు చెందిన ప్రముఖులకు ‘పద్మ శ్రీ’ ప్రదానం జరిగింది. 90వ దశకంలో ద్వితీయ స్థాయి పురస్కారం పద్మ భూషణ్, ఆపైన అత్యున్నత పద్మ విభూషణ్ పురస్కారం ప్రకటించసాగారు. కేంద్ర హోం మంత్రిత్వశాఖపై ఒత్తిళ్లు, సిసారసులు మొదలయ్యారు. సినీరంగ ప్రముఖులు అదొక హోదాగా భావించి ప్రయత్నాలు చేసిన సందర్భాలు కనిపిస్తాయి. సివిల్ సర్వీస్ అధికారులను గుర్తించడం మొదలుపెట్టారు. పద్మ శ్రీలు తమ పేరుకు ముందు బిరుదంగా ప్రచారం చేసుకోరాదనే ఆదేశాలు కూడా హోం శాఖ జారీ చేసింది.

1990వ దశకం:

1991 నుండి 2000 వరకు పరిశీలిస్తే తెలుగువారికి లభించిన పద్మ విభూషన్, పద్మ భూషణ్ గణాంకాలు ఇలా వున్నాయి. ఆరు మందికి పద్మ విభూషణ్ లభించింది. వీరిలో సంగీతంలో ఒక్క డా. బాల మురళీకృష్ణ తప్పించి మిగతా వారిలో ముగ్గురు రాజకీయ స్వాతంత్రోద్యమ నాయకులు- ఎన్.జి. రంగా, కాళోజీ, రావి నారాయణరెడ్డి. సర్వేపల్లి గోపాల్, యం. నరసింహం ఈ దశాబ్దిలో పొందారు. పద్మ భూషణ్ విషయానికి వస్తే పది మందికి తెలుగువారికి లభించింది. వారిలో సినీరంగానికి చెందిన కొంగర జగ్గయ్య, డా. సి. నారాయణరెడ్డి, నృత్య విభాగానికి చెందిన వెంపటి చిన సత్యం, రాజారెడ్డి, రాధారెడ్డి దంపతులు, వైద్య నిపుణులుగా పి. వేణు గోపాల్, శాస్త్రరంగానికి చెందిన ఆర్. యన్. అగర్వాల్, సాహితీవేత్త బోయి భీమన్న, రాజకీయవేత్త వావిలాల గోపాలకృష్ణయ్య వున్నారు. వైద్యరంగ ప్రముఖులు అపోలో ప్రతాప్ సి. రెడ్డికి పద్మ భూషణ్ 1991 లోనూ, పద్మ విభూషణ్ 2010 లోనూ లభించాయి.

1954 నుండి 2000 వరకు తెలుగువారికి నలుగురికే భారతరత్న పురస్కారం లభించింది. వీరిలో సర్వేపల్లి రాధాకృష్ణన్, జాకీర్ హుస్సేన్, వి. వి. గిరి – ముగ్గురూ రాష్ట్రపతులుగా వ్యవహరించారు. తొలి గవర్నరు జనరల్ రాజాజీకి ప్రకటించారు. సాంకేతిక రంగంలో విశిష్ట ప్రతిభ కనబరచిన మోక్షగుండం విశ్వేశ్వరయ్యకు లభించింది. 2014లో ఎన్నికలకు ముందు పి.వి.నరసింహారావుకు మోడీ ప్రభుత్వం భారతరత్న ప్రకటించి తెలుగువారి హర్షామోదాలు పొందింది. ఎన్.టి.రామారావుకు ప్రకటించాలనే ప్రతిపాదనకు ఆమోదం లభించలేదు.

Images Credit: Internet

(మళ్ళీ కలుద్దాం)

Exit mobile version