[శ్రీమతి చివుకుల శ్రీలక్ష్మి గారు నిర్వహిస్తున్న ‘వందే గురు పరంపరామ్’ అన్న శీర్షికని ధారావాహికగా అందిస్తున్నాము. ఈ నెల ‘స్కిల్ మేడమ్’ గా పేరుపొందిన స్ఫూర్తిదాయక గురువు శ్రీమతి ఆర్. శ్రీవాణీశర్మగారిని పరిచయం చేస్తున్నారు రచయిత్రి.]
కష్టమే ఎరగనీ జీవితం ఎపుడైనా
కొత్తగా చరితలో పుటలనే చేర్చేనా?
ఉలితో మలచనిదే శిల్పం మొలిచేనా ?
ఊహల మొలవనిదే నిజమై నిలిచేనా?
సాహసమే ఎపుడూ శక్తిగ నింపుకొని..
ఆటూ పోటులలో ముందుకు కదిలేయ్ రా..
హర్డిల్స్ అన్ని దాటేసేయ్..
నీ సత్తా ఏంటో చూపించేసెయ్..
శ్రీమతి ఆర్. శ్రీవాణీశర్మ
~
‘అధిగమిస్తే ప్రతి ఓటమి గెలుపుకి తొలి మెట్టు’
ఈ భూమిపై ప్రతివారిని భగవంతుడు ఒక నిర్దేశించిన లక్ష్యం కొరకే ఊపిరి పోస్తాడు. వాళ్ళ లక్ష్యాలను వాళ్ళు గుర్తించేలాగా వారి జీవితాల్లో సంఘటనలను సృష్టిస్తాడు. భగవంతుని మార్గాలు మానవులకు అంతు పట్టవు. కొంతమందిని భగవంతుడు ఎటువంటి అడ్డంకులు లేకుండా తాను నిర్దేశించిన లక్ష్యం వైపు నడిపిస్తే, మరికొందరిని రకరకాల దారుల్లో మళ్ళించి, తమ తమ గమ్యాలను ఎంచుకునేలాగా చేస్తాడు. అదే కోవలో తాను పొందిన అనేక వైఫల్యాల నుండి, దానివల్ల వచ్చిన నిరాశ నుండి, తన్ను తాను మలుచుకొని, తన చుట్టూ ఉన్నవారికి ప్రేరణగా నిలిచిన ఒక విజేత విజయగాథకు ప్రతి రూపమే – శ్రీవాణీశర్మ. తాను ఎదుర్కొని బయటపడ్డ క్యాన్సర్ తనను ఆరోగ్యవంతురాలిగా నిలపడమేకాక, ఎదుటివారి బాధను తుడిచేలాగా, ఎంతో మంది క్యాన్సర్ బాధితులకు కౌన్సిలింగ్ చేస్తూ, మనోధైర్యాన్నిస్తూ, తన వంతు సేవలను నిరంతరంగా అందిస్తూ ‘స్కిల్ మేడమ్’గా ప్రతిఒక్కరూ ఆప్యాయంగా పిలుచుకునే స్ఫూర్తిదాయక శ్రీవాణీ జీవనయానమే ఈనాటి మన ‘వందే గురు పరంపరామ్’.. గురువు.
ఆర్. శ్రీవాణి శర్మ
కుటుంబ నేపథ్యం:
ఈమె తాతగారు కీ॥శే॥ కల్లుట్ల రామకృష్ణశాస్త్రి, స్వాతంత్ర్యసమరయోధుడు. ఆంధ్ర మద్రాస్ సంయుక్తరాష్ట్రంగా ఉన్నప్పుడు స్వయంగా ‘భారత జ్యోతి’ అనే పత్రిక సంపాదకులుగా, తెలుగు, ఇంగ్లీష్ భాషల్లో నిర్వహించడమే కాక, ‘కృష్ణా’ పత్రికకు రిపోర్టర్గా పని చేసేవారు. ఈయనకు రాజాజీ గారితో సత్సంబంధాలు ఉండేవి. కడప మీదుగా మద్రాస్కు వెళ్తున్నప్పుడు, శాస్త్రిగారు ఆయనకు కడప స్టేషన్లో కాఫీ, ఇడ్లీ సాంబార్ అందించి రాజకీయాలు చర్చించేవారట! గాంధీ గారు కడపకు వచ్చినప్పుడు, మొదటగా ఖద్దరు కట్టిన వారు ఈయనే. బనారస్ హిందూ యూనివర్సిటీ నుండి బి.ఏ. చేసిన తొలి కడప వాసి కూడా ఈయనే అని చెప్తారు. నాయనమ్మ కీ॥శే॥ శ్రీమతి వెంకటసుబ్బమ్మ.. చేతికి ఎముక లేకుండా దానం చేసిన ఇల్లాలు.
కల్లుట్ల రామకృష్ణశాస్త్రి – వెంకట సుబ్బమ్మ దంపతులు
మాతామహులు కీ॥శే॥ కుందవరం వెంకటసుబ్బయ్య, శ్రీమతి రాధమ్మగార్లు. కవి చౌడప్పకు సంబంధించిన 1600 ఎకరాల సుక్షేత్రభూములు. రాజంపేటలోని మన్నూరు అటవీ ప్రాంతంలో వీరికి వంశపారంపర్యంగా సంక్రమించాయి. అటు తర్వాత ప్రభుత్వ జాతీయీకరణలో భాగంగా వారు వాటిని కోల్పోయి, చాలా కొద్ది కాంపెన్సేషన్తో సర్దుకోవాల్సి వచ్చింది.
కీ.శే. కుందవరం వెంకటసుబ్బయ్య, శ్రీమతి రాధమ్మ గార్లు
జననం; బాల్యం:
శ్రీవాణీశర్మ కడప జిల్లా కేంద్రంలోనే పుట్టి పెరిగింది. ముగ్గురు తమ్ముళ్లు, పక్క వాటాలోనే పెదనాన్న కొడుకు అందరితో కలిసి సంతోషంగా పెరిగింది. పెదనాన్నల సంతానం, మేనమామల పిల్లలు అందరూ వీలున్నంత ఎక్కువగా కలుసుకునేవారు. తల్లికి గల భక్తి; తండ్రి తాత్వికత, మానవత్వం, దయ చిన్నప్పటినుండి పిల్లలందరికీ అలవడ్డాయి. తాతగారికి దాదాపు 300 ఎకరాలు పంట భూములు ఉండి, ఆయన అకస్మాత్తుగా 53 ఏళ్లకే చనిపోవడంతో, నోటి మాటతోనే కౌలు చేసుకుంటున్న చాలామంది రైతులు భూములు స్వంతం చేసుకున్నారు. చార్జి తీసుకునేందుకు, ట్రాన్స్ఫర్పై వచ్చిన కలెక్టర్లకు ఆతిథ్యం ఇస్తూ, ఎనిమిది మంది పనివాళ్ళతో, రాజసంగా నడిచిన ఐదుగురు కొడుకులు, ఐదుగురు కూతుళ్లు ఉన్న ఆ ఉమ్మడి కుటుంబం ఆయన మరణంతో చెల్లాచెదురైంది.
తాతగారి కాలంలో ప్రతి సంవత్సరం కడప ఆర్ట్స్ కాలేజీలో 30 మంది విద్యార్థులకు, బట్టలు, పుస్తకాలు కొనిచ్చి, ఫీజులు కట్టేవారట! వీరి నాన్నగారు స్నేహితులను చూసి ‘అయ్యో! వాళ్ళు పాపం నూనెతో పిండి వంటలు చేసుకుంటారట’, అని బాధపడేవారట. కానీ, వీళ్ళ దాకా వచ్చేసరికి ఆర్థికంగా చితికిపోయి, మధ్యతరగతి సంసారాన్ని చూశారు. అయినా, అందరితో కలసి మెలిసి ఆత్మీయంగా ఉండేవారు. డబ్బు ఒక లేమిగా వాళ్ళకి ఎప్పుడూ అనిపించలేదు. సంతోషకరమైన వాతావరణంలో, సరదాగా కబుర్లు చెప్పుకుంటూ, ఈ వీధి నుండి ఆ వీధి వరకు ఉండే ఒక పెద్ద ఇంటిలో (తాతగారు ఉన్న ఇల్లు అదే) కూరగాయలు మొక్కలు పెంచుకుంటూ.. ఆనందంగా గడిపేవారు.
తల్లిదండ్రులు:
తండ్రి: కీ॥శే॥ ద్వారకానాథ్ – సీనియర్ జర్నలిస్ట్, కడప
తల్లి: కీ॥శే॥ శ్రీమతి. విజయభారతి, గేయ రచయిత్రి, గాయకురాలు
తల్లిదండ్రులు
ఒక మంచి సాహితీవేత్తగా రూపుదిద్దుకున్న వైనం:
సాహితీ పరిమళాలు గుబాళించే కుటుంబంలో జన్మించిన శ్రీవాణికి చిన్ననాడే సాహితీప్రియత్వం అలవడింది. తండ్రి వి.ఆర్.ద్వారకానాథ్, ‘భారత జ్యోతి’ అనే స్వంత పత్రికకు సంపాదకత్వం వహించడమే కాక, ఆంధ్రపత్రిక, ఆంధ్రభూమి, డెక్కన్ క్రానికల్ పత్రికలకు పాత్రికేయులుగా దీర్ఘకాలం పాటు పనిచేశారు. తల్లి శ్రీమతి విజయభారతి కుందవరం చౌడప్ప వంశస్థురాలు. ఆమె పెద్దగా చదువుకోకపోయినా చిన్నతనం నుండి భగవత్ ప్రసాదంగా సాహిత్యం అలవడింది. ఆమె పద్యాలు, పాటలు వ్రాస్తూ, స్వయంగా బాణీ కట్టి పాడుతూ ఉండేవారు. ఇటు తల్లి పాటలను, ఫెయిర్ చేసి వ్రాయడం, తండ్రి డిక్టేట్ చేస్తూ ఉంటే పత్రికా వార్తలు కానీ, సంపాదకీయాలు కానీ, తెలుగు, ఇంగ్లీషు భాషల్లో వ్రాయడం ఆమెలోని భాషా నైపుణ్యాలకు మెరుగుపెట్టాయి.
శ్రీవాణి L.K.G.నుండే స్కూల్లో వివిధ సందర్భాల్లో ప్రసంగాలు ఇవ్వడం, వక్తృత్వపోటీలలో పాల్గొంటూ, జిల్లా, రాష్ట్రస్థాయిలలో బహుమతులు గెల్చుకోవడం జరిగింది. వీటన్నిటి వెనుక తన బాబాయి కీ॥శే॥ కృష్ణ భగవాన్ గారి ప్రోత్సాహం, తర్ఫీదు ఉన్నాయని శ్రీవాణి చెప్పారు.
శ్రీవాణి బాల్యం విద్యాభ్యాసమంతా కడపలోనే జరిగింది. చిన్నప్పటినుండి ఐదవ తరగతి వరకు ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చదువుకున్నారు. అటు తర్వాత, ఇంగ్లీష్ మీడియం దగ్గరలో లేకపోవడంతో, కడపలోని సి.ఎస్.ఐ. ప్రభుత్వపాఠశాలలో చేరారు.
శ్రీవాణి ఎనిమిదవ తరగతి చదువుతున్న రోజుల్లోనే ఆంగ్లంలో ‘మై టీచర్’, ‘ద రిపబ్లిక్ డే’ అనే కవితలు రచించారు. తర్వాత బాలికల జూనియర్ కళాశాలలో, S.K.R. & S.K.R. మహిళా కళాశాలలో విద్యాభ్యాసం పూర్తి చేశారు. డిగ్రీ చదువుతున్న సమయంలో తెలుగులో కూడా రచనలు ప్రారంభించారు. తెలుగులో ఆమె వ్రాసిన తొలి పాట ‘తిరుమల రాయని గడప-దేవుని గడప’ అనే భక్తిగీతం.
శ్రీవాణి విద్యార్హతలు:
డిగ్రీ తర్వాత, ప్రభుత్వపాలన శాస్త్రంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి, శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం నుండి గోల్డ్ మెడల్ సాధించారు.
- ఎం.ఎ. – (పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్) – స్వర్ణ పతకం – Ph.D. (శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం)
- ఎం.ఎ. – రాజకీయ శాస్త్రం (ఉస్మానియా యూనివర్సిటీ)
- ఎం.ఎ. – ఆంగ్ల సాహిత్యం( శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ)
గురువుల గురించి అడగగా ఇలా అన్నారు.
‘నా గురువులందరూ కూడా నాపై ప్రభావం చూపిన వారే. స్వామి వివేకానంద వారి బోధనలు స్కూలు వయసు నుండి కూడా నన్ను ఎంతో ఆకట్టుకున్నాయి. ఆ కొటేషన్లను మననం చేస్తూ, నన్ను నేను ప్రోత్సహించుకుంటూ, వాటిని అమలు చేయడానికి ప్రయత్నించేదాన్ని’
స్నేహితులు:
తనకు బాగా సన్నిహితులైన ఇద్దరు స్నేహితులు దురదృష్టవశాత్తు, అకాల మరణం పొందారు. ఇప్పుడు తనకున్న ప్రాణస్నేహితులు శ్రీవాణీ అర్జున్, జ్వాలా అనురాధ. తన సాహితీప్రయాణంలో తల్లిదండ్రులు, ముగ్గురు తమ్ముళ్ళు, అక్కయ్యలు, అన్నలు,స్నేహితులు..అందరూ ప్రోత్సాహం ఇచ్చినవాళ్లే, ఆస్వాదించినవాళ్లే.
ఆమె ముగ్గురు సోదరులలో చిన్నవాడైన సాయి శ్రీకాంత్ నేపథ్య గాయకుడు, సంగీత దర్శకుడే కాక, పాటల రచయిత.
సోదరులు శ్రీకాంత్, శ్రీకర్, శ్రీరాం.. (కుడి నుండి ఎడమకు)
వారి సతీమణులు అనురాధ, ఉషా కుమారి, స్వప్న(ఎడమ నుండి కుడికి)
అత్త మామలు:
అత్త మామలు కీ.శే. ఆర్. సి. సుబ్బారాయుడు గారు, శ్రీమతి హైమవతమ్మ
భర్త:
డాక్టర్ ఆర్.ఎన్. శర్మ – MA History, M, Phil., Ph.D.; M.A., Telugu, అధ్యాపకులు, రచయిత, చరిత్రకారుడు.
డాక్టర్. ఆర్.ఎన్.శర్మగారితో ఈమె వివాహం ప్రొద్దుటూరులోని జరిగింది. ఆయన చరిత్రలో ఎం.ఏ; ఎం.ఫిల్; పి.హెచ్.డి.చేసి, తెలుగులో కూడా పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు.
శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీలో ‘థామస్ మన్రో’ పై ఈయన వ్రాసిన పరిశోధనాగ్రంథాన్ని, అదే విశ్వవిద్యాలయం వారు ప్రచురించారు. చరిత్ర మీద ఎంతో మక్కువతో శర్మగారు 50 కి పైగా పరిశోధన పత్రాలు సమర్పించారు. తెలుగుభాష చరిత్రపై, ఈశ్వరునిపై, ఇతర సామాజిక అంశాలపై ఈయన ఇప్పటికి ఐదు పుస్తకాలు వ్రాశారు.
వీరి ఏకైక కుమారుడు ఆర్.సి.ఎస్.సిద్ధార్థ్, ఎం.ఎస్., సైంటిస్ట్ NREL, USA. పెట్రోలియం ఇంజనీరింగ్లో గోల్డ్ మెడల్ సాధించి, విజ్ఞాన్ యూనివర్సిటీ నుండి బెస్ట్ అవుట్ గోయింగ్ స్టూడెంట్గా మరొక గోల్డ్ మెడల్ సాధించాడు. అమెరికాలో జియో ఇన్ఫర్మేటిక్ సిస్టమ్స్ అండ్ కార్టోగ్రఫీలో మాస్టర్స్ డిగ్రీ చేసి, యు.ఎస్. డిపార్ట్మెంట్ ఆఫ్ ఎనర్జీ ఒక విభాగమైన NREL లో సైంటిస్ట్ గా ఉద్యోగం సాధించాడు.
అమెరికాలో కూడా మన జాతీయస్థాయి పోటీలలో పాల్గొని ఎన్నో అవార్డులు సాధించాడు. శ్రీవాణి శిక్షణలో మెరుగుదిద్దుకున్న ఉత్తమ విద్యార్థులలో సిద్ధార్థ కూడా ఒకడు. ఎప్పుడూ పాజిటివ్ ఎనర్జీతో నిండి, తన చుట్టూ ఉన్నవారికి వీలైనంత సహాయ సహకారాలు అందిస్తూ, ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న మిత్రులకు, జూనియర్లకు తగిన కౌన్సిలింగ్ చేస్తూ, వారు ఉన్నత శిఖరాలు అందుకోవడానికి నిరంతరం కృషి చేస్తూ ఉంటాడు. కుటుంబమంతా కూడా సామాజిక కార్యకలాపాల్లో మనస్ఫూర్తిగా పాల్గొంటారు.
శ్రీవాణి, డా. శర్మ, సైంటిస్ట్ సిద్ధార్ధ్
2026 డిశంబరు – జనవరిలో అమెరికా తమ కుమారుని దగ్గరకు వెళ్ళి వచ్చిన ఆనందాన్ని పంచుకుంటూ.. “అక్కడ అందమైన ప్రకృతి దృశ్యాలకు, ప్రశాంతతకు ఆలవాలమైన, అద్భుతమైన నేషనల్ పార్కులు, బీచ్ లూ, చూడడమే కాక, వారి సంస్కృతి పట్ల కూడా మంచి అవగాహన కలిగింది. విదేశీ విమాన ప్రయాణంతో పాటు, పసిఫిక్ మహాసముద్రం పై ఓడలో ప్రయాణించి ఆల్కట్రాస్ అనే ఒక దీవిని కూడా చూశారు. ఇటు గగనయానం, సముద్రయానం, రెండూ- జీవితంలో మర్చిపోలేని అనుభూతులను మిగిల్చాయి.” అంటారామె.
జనవరి 2026 అమెరికాలో
పడిలేచిన కెరటం:
శ్రీవాణి సివిల్ సర్వీసెస్ లక్ష్యంగా రెండేళ్లపాటు తీవ్రమైన పట్టుదలతో కృషి చేశారు. మొదటి ప్రయత్నంలోనే ప్రిలిమినరీ క్లియర్ చేయగలనని ఎంతో ఆత్మవిశ్వాసంతో ఉన్నారు. కానీ, ఫలితాలు వచ్చాక, జనరల్ స్టడీస్ లో క్వాలిఫై అయ్యి, తను ఎంచుకున్న పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ లో కటింగ్ మార్కుల కన్నా రెండు మార్కులు (మరొక్క బిట్ కరెక్ట్ అయ్యుంటే వచ్చి ఉండేవి) రావడంతో, అతి కొద్దిలో మెయిన్స్ రాసే అవకాశాన్ని కోల్పోయారు.
మొదటిసారి సాధించలేకపోతే ఇంక ఎప్పటికీ ప్రయత్నమే చేయననే మొండి పట్టుదల వల్ల, ఎక్కడా వైఫల్యం ఎదురుచూడని మితిమీరిన ఆత్మవిశ్వాసం వల్ల ప్రయత్నాలను అపేశారు. తరువాత గ్రూప్ వన్-ఎ, గ్రూప్ టు-బి కలిపి పెట్టిన ఏ.పి.పి.ఎస్సి. పరీక్షలో ప్రిలిమినరీ క్లియర్ చేసి, మెయిన్స్ కు అర్హత సాధించారు. మెయిన్స్ కోసం ఆమె ఎంచుకున్న సబ్జెక్టులు పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ మరియు సోషియాలజీ. అయితే, ఆ హాల్ టికెట్ పొలిటికల్ సైన్స్ అండ్ సైకాలజీ ఆప్షన్స్ గా రావడంతో అక్కడ కూడా నిరాశ ఎదురయింది.
తర్వాత, టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ లో అసిస్టెంట్ ప్రొబేషనరీ ఆఫీసర్ ఉద్యోగం కోసం ఒక వ్యాసాన్ని వ్రాసి దరఖాస్తు చేయగా, సౌత్ ఇండియా మొత్తానికి శ్రీవాణి గారి ఒకే ఒక్క అప్లికేషనే ఇంటర్వ్యూకు అర్హత సాధించింది.
అయితే, దురదృష్టవశాత్తు, ఇంటర్వ్యూ తేదీ కన్నా ఒక్కరోజు ముందే టెలిగ్రాఫిక్ ఇన్ఫర్మేషన్ రావడంతో, ముంబైకి విమానయానం చేసే ఆర్థికస్థాయి కానీ, అవకాశం కానీ లేకపోవడంతో, అది కూడా విఫలమైంది. కడప ఆల్ ఇండియా రేడియో స్టేషన్లో నాలుగేళ్ల పాటు క్యాజువల్ అనౌన్సర్గా పనిచేస్తూ, అక్కడే అనౌన్సర్ ఉద్యోగాలకు దరఖాస్తు చేయగా.. ఇంటర్వ్యూలో ఎంపికైనప్పటికీ, కొన్ని రాజకీయ కారణాల వల్ల ఫైనల్ సెలక్షన్ లిస్ట్ తారుమారైంది.. 21 సంవత్సరాల వయసులో. ఉన్నతమైన ఆశయాలు ఉండి కూడా.. ఇన్ని వరస వైఫల్యాలతో నిరాశ చెంది.. ఒకలాంటి డిప్రెషన్ కు గురయ్యారు.. తీవ్రమైన మనోవేదన చెందారు. మళ్లీ ప్రయత్నం చేయమన్న ఎవరి సలహాలు కూడా తీసుకోలేని విధంగా మనసు ‘న’కారాత్మకంగా మారిపోయింది. అందులో నుండి బయటపడడానికి, విధి తనపై విసిరే ప్రతి రాయినీ ఒడుపుగా అందుకుంటూ తన జీవిత సౌధానికి పునాది రాళ్ళుగా పేర్చుకుంటున్న శ్రీవాణి తనను తాను మోటివేట్ చేసుకోవడానికి, స్ఫూర్తినిచ్చే ఎన్నో ప్రపంచ స్థాయి ఉత్తమ వ్యక్తిత్వ వికాస గ్రంథాలను చదివారు. హెలెన్ కెల్లర్, స్టీవెన్ హాకిన్స్, నిక్.. వంటి స్ఫూర్తిదాతల బయోగ్రఫీలు చదివారు. మైండ్ పవర్, పవర్ ఆఫ్ సబ్కాన్షియస్ మైండ్ వంటి వాటిపై మంచి అవగాహన పెంచుకున్నారు.
గేయం:
ఆడిన ఆటే ఆడాలి – ఓడిన చోటే గెలవాలి
ఓడిన చోటే గెలవాలి – ఓటమినే ఓడించాలి..
పరుగు పందాన తడబడిపోతే, అడుగులు మళ్లీ చక్కబెట్టుకుని..
గెలుపను గమ్యం చేరాలంతే ఏక దీక్షగా ముందుకు సాగి //ఆడిన //
శిఖరం నుండి జారుతు ఉంటే, ఒక్కో రాయిని ఊత పట్టుకొని..
శిఖరాగ్రాన్ని చేరాలంతే, ఏక దీక్షగా ముందుకు సాగి //ఆడిన //
చీకటి రక్కసి మింగేస్తుంటే, మిణుగురు పురుగుల జాడ పట్టుకొని..
వెలుగు బాటను చేరాలంతే ఏక దీక్షగా ముందుకు సాగి //ఆడిన //
మహారణ్యమే మాయమ్మయినా కొత్త విత్తులను చేత పట్టుకొని..
కొత్త ఆశలకు ఊపిరి పోస్తూ ఏక దీక్షగా ముందుకు సాగి //ఆడిన //
అలవై గగనం చేరకపోతే , ఆవిరి మేఘపు జాడ పట్టుకొని..
గగనపు అంచులు తాకాలంతే ఏక దీక్షగా ముందుకు సాగి //ఆడిన //
విశ్వపు అంచులు చేరాలంటే, విరిగిన రెక్కలు కూడ గట్టుకొని..
ఊపిరి శక్తిగ ఆశ నింపుకుని ఏక దీక్షగా ముందుకు సాగి //ఆడిన //
శోక సంద్రమే నిను ముంచేస్తే, చిన్న తెప్పలా ఆశ హత్తుకొని..
ఆనందపు తీరం చేరాలంతే ఏక దీక్షగా ముందుకు సాగి //ఆడిన //
మృత్యువు రమ్మని పిలుస్తు ఉంటే, కొత్త రూపున మళ్ళీ పుడుతూ..
చావు పైన నువు గెలవాలంతే ఏక దీక్షగా ముందుకు సాగి //ఆడిన //
మేలి మలుపుతిప్పిన వీడియో:
ఎన్నో మోటివేషనల్ వీడియోస్ చూశారు. వాటన్నింటిలోనూ అత్యంత ప్రాణప్రదమైనది, తన ద్వారా వేల మందికి స్ఫూర్తి నింపింది.. ‘ద స్టోరీ ఆఫ్ యాన్ ఈగల్’ అనే మోటివేషనల్ వీడియో.
గురువు నారాయణరావు గారు కూడా ఆమెలో సానుకూల ధోరణిని నింపడంలో ఎంతో ప్రేరణనిచ్చారు. వీటన్నిటి వల్ల పూర్తిగా తనను తాను పాజిటివ్ శక్తితో నింపుకున్నారు.. అప్పటినుండి, తన జీవితగమ్యాన్ని నిర్దేశించుకున్నారు. తన పొరపాటు వల్ల, ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల, పొందిన వైఫల్యాలు ఇతరులు పొందకుండా విద్యార్థులకు ప్రేరణగా నిలవాలని నిశ్చయించుకొని, అధ్యాపక వృత్తిని చేపట్టారు.. శ్రీవాణి తను మోటివేషనల్ స్పీకర్ అవ్వడం వెనుక ఉన్న గతాన్ని గుర్తు చేసుకుంటూ ఆ వివరాలన్నీ తెలియజేశారు.
శ్రీవాణి ఉద్యోగ జీవితం- సాధించిన విజయాలు – ఆమె మాటల్లోనే
ప్రస్తుత హోదా:
డైరెక్టర్ & శిక్షకురాలు: ట్రెండ్జ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లిష్ & సాఫ్ట్ స్కిల్స్
ప్రారంభంలో
- కడపలో ‘ఫ్రెండ్స్ ఆఫ్ నేచర్’ అనే స్కూల్లో కొద్ది రోజులు హెడ్ మిస్ట్రెస్ గా పనిచేశారు. ఆ సందర్భంలో జరిగిన ఒక సంఘటనను ఆమె ఇలా తెలిపారు. ఆ సమయంలో ‘తెలుగు గంగ’ ప్రాజెక్టులో పనిచేసే ఖాన్ అనే యు.డి.సి. తన ఇద్దరు కుమార్తెలను ఆ స్కూల్లోనే చదివించేవారు. వ్యక్తిగత శ్రద్ధపెట్టి, ఇద్దరినీ ఎంతగా చదివించినప్పటికీ, పరీక్ష రాసే సమయంలో వారు మర్చిపోవడం, తక్కువ మార్కులు తెచ్చుకోవడం జరిగేది. ఒకరోజు నేను వారిద్దరిని నా దగ్గరకు పిలిపించి, నాకు చాలా మెమరీ ఉందని, ఆ జ్ఞాపక శక్తినంతా ఒక ప్రార్థన ద్వారా వాళ్లకు ఇచ్చేస్తున్నట్టు ఒక చిన్న నాటకం ఆడాను. అప్పుడు వాళ్లలో ఒకరు రెండవ తరగతి, మరొకరు మూడో తరగతి చదువుతున్నారు. అంత చిన్న పిల్లలకి పాజిటివ్ ఎనర్జీ గురించి అంతకంటే ఏ విధంగా చెప్పాలో నాకు అర్థం కాలేదు. కానీ, ఆ తర్వాత వాళ్లు జీవితంలో ఎక్కడా తిరిగి చూడలేదు. కొన్నేళ్ల తర్వాత వాళ్ల నాన్ననన్ను కలిసి, ఆ పిల్లలిద్దరూ మంచి మెరిట్ తో చాలా బాగా రాణిస్తున్నారని చెప్పినప్పుడు నాకు చెప్పలేనంత ఆనందం కలిగింది. ఒక చిన్న పాజిటివ్ మాట, ఒక విశ్వాసం, ఒకరి జీవితంలో అంత గొప్ప మార్పు తీసుకొస్తుందని ప్రయోగాత్మకంగా చేసి చూపారు, అప్పటినుండి.. ఇప్పటి వరకు.. ఆస్ఫూర్తితోనే.. మోటివేషనల్ స్పీచెస్,.. కౌన్సిలింగ్ చేస్తూ, వందలాది మంది విద్యార్థులకు, మనోధైర్యాన్నిస్తూ.. వాళ్ల వాళ్ల కెరియర్ లో.. ఉన్నత శిఖరాలకు చేరుకోవడానికి ఒక నిచ్చెనలాగా సహాయ పడగలుగుతున్నారు.
“ఈ వృత్తిలో నాకు ఎంతో ఆనందం ఉంది. నా జన్మ సార్థకమైందని అనిపిస్తుంది”.. ఎంతో ఆర్ద్రతతో, ఆనందంతో శ్రీవాణి చెప్పిన మాటలివి.
తన పిల్లలలాగా విద్యార్ధులకు చేయూతను అందించిన వారిలో కొన్ని ఆణిముత్యాలు
- ఈమె శిక్షణలో అనిల్ కుమార్ అనే హోమియో డాక్టర్, U.P.S.C. వ్రాసి, I.R.S. కు అర్హత సాధించారు. శివ శంకర్ అనే అబ్బాయి I.A.S. అకాడమీ స్థాపించాడు. ప్రసాద్ అనే తిరుపతికి చెందిన ఒక అభ్యర్థి గ్రూప్ వన్ లో విజయం సాధించాడు.
- తాను చేసిన కౌన్సిలింగ్ వల్ల ఒక అమ్మాయి, ఒక అబ్బాయి; పెళ్లయి తాగుడు వ్యసనానికి బానిసైన ఒక వ్యక్తి; దివ్యాంగుడైన తమ్ముడిమీద ఎక్కువ ప్రేమ చూపిస్తున్నారు అన్న అపోహతో, తల్లిదండ్రుల మీద విసిగిపోయి-ఆత్మహత్య చేసుకోవాలనుకున్న వీరందరూ, వారి మనసులు మార్చుకొని, జీవితాలను సరైన గమ్యంలోకి నడిపించుకోగలిగారు.
- డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్న ఇద్దరు బ్రైట్ స్టూడెంట్స్ పెద్దలకు చెప్పకుండా వెళ్లిపోయి పెళ్లి చేసుకోవాలనుకున్నప్పుడు, ఈమె చేసిన కౌన్సిలింగ్ వల్ల దాని వాయిదా వేసుకున్నారు. తర్వాత కొంతకాలానికి ఒకరు బ్యాంకులో అసిస్టెంట్ ప్రొబేషనరీ ఆఫీసర్ ఉద్యోగాన్ని సాధించగా, ఆ అబ్బాయి నేవీలో ఉద్యోగాన్ని పొందాడు.
- మానసిక ఆరోగ్యం సరిగా లేని ఒక డిగ్రీ అబ్బాయికి, వాళ్ల తల్లిదండ్రులకు కూడా కలిపి కౌన్సిలింగ్ చేసి, ఆ అబ్బాయి జీవితాన్ని బాగు చేయగలిగారు. ఈమె విద్యార్థులు చాలామంది పూర్తి పాజిటివ్ దృక్పథంలో జీవితాన్ని గడుపుతూ, ఉన్నతమైన ఉద్యోగాలను సాధించి, తమ చుట్టూ ఉన్న వారిని కూడా ప్రోత్సహిస్తూ.. ఈవిడ బాటలోనే నడుస్తున్నారు.
- కమ్యూనికేషన్ స్కిల్స్ లో ఈమె దగ్గర శిక్షణ పొందిన విద్యార్థులలో కొంతమంది పెద్ద పెద్ద MNCలలోను, యు.ఎస్.ఏ, కెనడా, యూ.కే., ఇటలీ, దుబాయ్, యుగాండాలలో కూడా పనిచేస్తున్నారని ఆమె ఎంతో ఉప్పొంగిపోతూ చెప్పారు.
- కేరళ వరదల బారిన పడినప్పుడు ప్రొద్దుటూరు మై స్పేస్ తైక్వాండో అకాడమీ; ట్రెండ్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లీష్, సాఫ్ట్ స్కిల్స్ డైరెక్టర్ గా శ్రీ వాణి శర్మ ఆధ్వర్యంలో వరద బాధితులకు 4 టన్నుల నిత్యావసర సరుకులను సేకరించారు. ఇక్కడి నుండి లారీలో ఆహార పదార్ధాలు కడప తీసుకెళ్ళి అక్కడనుండి ట్రైన్ లో పంపించారు. ఇచ్చుటలో ఉన్న ఆనందాన్ని విద్యార్ధి దశ నుండే వారికి అలవాటు చేయాలని భావించారామె.
కేరళ వరద బాధితుల సహాయం కోసం నేను సైతం అంటూ..
విద్యారంగంలో 30 సంవత్సరాలకు పైగా అధ్యాపక వృత్తిలో రాణించడమే కాక, మోటివేషనల్ స్పీకర్ గానూ, సాహితీ పరంగానూ, సామాజిక సేవా పరంగానూ, పాటల రచయిత్రిగానూ, ఆధ్యాత్మికకోణంలోనూ సేవలందిస్తున్న శ్రీవాణీశర్మలాంటివాళ్లు, సామాజిక మాధ్యమాల్లో ఎక్కువగా కనపడకుండా తెర మరుగున ఉన్నా, వారి సేవలు అందవలసిన వారికి అందుతూనే ఉన్నాయి. ఈమె మోటివేషనల్ స్పీకర్ గా కడప, కర్నూల్, ప్రొద్దుటూరు, జమ్మలమడుగు, బద్వేల్, హైదరాబాదులలోని కళాశాలలో తన ప్రసంగాలు ఇచ్చారు. టీచర్ ట్రైనింగ్ సెషన్లలో భాగం పంచుకున్నారు. పేరెంట్ క్లబ్బులలో సభ్యులుగా ఉంటూ. ఎన్నో సెషన్స్ తీసుకుంటూ అందరికీ ప్రేరణ నిస్తున్నారు.
శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం నుండి పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో ఎం.ఏ గోల్డెమెడల్ సాధించారు. డా॥ ఆర్.ఎన్.శర్మతో వివాహమయ్యాక శ్రీవాణి రాజనీతి శాస్త్రం, ఆంగ్లంలో ఎం.ఏ చేశారు. అమె రచనాసక్తిని పరిశీలించిన భర్త ఆర్ఎన్.శర్మ ఆమెను ఎంతగానో ప్రోత్సహించారు. ఆమె శతకాలు, హిందీ నుంచి అనువాద గీతాలు, పేరడీ పాటలు, జానపద బాణీలో గేయాలు, భక్తిగీతాలు, దేశభక్తి గీతాలు, గజళ్ళు రచించారు. ఈమె రచించిన ‘గాయత్రీ దండకం’ లాంటి వందలాది పాటలు యూట్యూబ్లో లభ్యమవుతున్నాయి. పలు యూట్యూబ్ చానళ్ళకు శ్రీవాణీశర్మ భక్తి గీతాలను అందిస్తున్నారు.
మనోబలంతో ఏ సమస్యనయినా జయించవచ్చును అనే దానికి ప్రత్యక్ష ఉదాహరణగా నిలుస్తారు.
ఈమె జీవితంలో మరొక పెద్ద ఘటన, ఈమె క్యాన్సర్ బారిన పడడం. అంత పెద్ద సమస్యను కూడా చిరునవ్వుతో ఎదుర్కొని ఆరోగ్యంగా బయటపడ్డారు. ఈ ఆపరేషన్ జరిగి ఇప్పటికి 14 సంవత్సరాలు అయింది. కొన్ని కారణాల వల్ల ఈమెకు యూట్రెస్ కూడా తొలగించాల్సి వచ్చింది.
వైద్య పరంగా చాలా కాలం పాటు తన సోదరుడు హోమియో ప్రొఫెసర్ (పెదనాన్న కొడుకు) కృష్ణకుమార్ తనకు తోడుగా ఉన్నారు. అటు తర్వాత డాక్టర్ ఆదిలక్ష్మి, Dr. JVRK ప్రసాద్ దంపతులు.. ప్రొద్దుటూరులోని డాక్టర్ స్వాతి, డాక్టర్ విశ్వనాథ రెడ్డి గార్లు ఈమెకు ఎప్పుడు అవసరమైతే అప్పుడు వైద్య సహాయాన్ని అందిస్తున్నారు. తను ఇంత ఆరోగ్యంగా, ఆనందంగా జీవితాన్ని గడపడంలో, తన మనోధైర్యానికి ఎంత పాత్ర ఉందో ఈ వైద్యులు, కుటుంబ సభ్యుల పాత్ర కూడా అంతే ఉందని, నన్ను నిస్వార్ధంగా ప్రేమించే వేలాదిమంది విద్యార్ధులు, వెన్నంటి ప్రోత్సహిస్తూ నాతోపాటు నడుస్తున్న వారందరి అభిమానమే నాకు బలం, చేయూత అంటూ అందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు.
ఈమె శ్రీవారు శర్మగారు క్యాన్సర్ నుండి కోలుకున్నప్పటి నుండి ఒక స్నేహితుడిలాగా ఆమెకు తోడుగా వుంటూ, ఎంతో సున్నితంగా ఆత్మీయంగా చూసుకుంటున్నారు. ఆమె కుమారుడు, ఆరోగ్ సమస్య వచ్చినప్పుడు, కూతురు లేని లోటును తీరుస్తూ (అప్పుడు సిద్ధార్థ్ ఎనిమిదో తరగతి చదువుతున్నాడు), ఆమెకు అన్ని సపర్యలు చేస్తూ, అపురూపంగా చూసుకున్నాడు.
మూడేళ్ల క్రితం శ్రీవాణి ‘ట్రై జమ్నల్ న్యూరాల్జియా’ అనే చాలా ఇబ్బందికరమైన సమస్యను ఎదుర్కొని న్యూరో సర్జరీ చేసుకోవాల్సి వచ్చింది. ఇవి ఏవి కూడా ఆమెను జీవితంలో ఇసుమంతైనా కృంగదీయలేకపోయాయి. అదే మనోధైర్యంతో ఆమె వృత్తిని, ప్రవృత్తిని నిరాటంకంగా కొనసాగిస్తూ, సమాజానికీ, విద్యార్థులకూ సేవలను అందిస్తూనే ఉన్నారు. క్యాన్సర్ నుండి బయటపడ్డ రెండవ సంవత్సరం నుండి క్యాన్సర్ బాధితులకు ధైర్యాన్నిస్తూ, వాళ్ళ ఇండ్లకు వెళ్లి కౌన్సిలింగ్ చేసి, కుటుంబాలకు ధైర్యంచెప్పి ఎంతో ఊరటను కలిగిస్తున్నారు. ఆమె భర్త తోడుగా పక్కఊర్లకు కూడా తీసుకువెళ్లి, ఆమెకు పూర్తి తోడ్పాటును అందిస్తున్నారు. ఈమె పలుచోట్ల క్యాన్సర్ అవగాహనా సదస్సులను కూడా నిర్వహించారు.
ప్రొద్దుటూరు నివాసి అయిన శర్మగారితో వివాహం జరిగిన తర్వాత, ఆమె ప్రొద్దుటూరులో పలు కళాశాలల్లో పని చేసారు.
Trendz Institute of Communication & Soft Skills అనే స్పోకెన్ ఇంగ్లీష్ సంస్థను, 2000వ సంవత్సరంలో ప్రారంభించి, గత 25 ఏళ్లుగా గ్రామీణ విద్యార్థులకు నిరంతరంగా సేవలు అందిస్తున్నారు.
పేదవారికి కేవలం మెటీరియల్ ఖర్చు మాత్రమే తీసుకొని, కొంతమందికి సగం ఫీజు మాత్రమే తీసుకొని ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ లో శిక్షణ ఇస్తున్నారు. ఇంగ్లీషు, వ్యక్తిత్వవికాసం సహాయంతో విద్యార్థులలో ఆత్మవిశ్వాసాన్ని పెంచి, వారి ప్రగతికి బాటలువేస్తూ తాను ఎంతో సంతృప్తిని పొందుతున్నానని.. జీవితానికి సార్థకత చేకూరిందని ఆమె అంటారు.
సంస్థలో వచ్చిన ఆదాయంలో 50 శాతాన్ని క్యాన్సర్ పేషంట్ల సహాయార్థం వాడుతున్నారు.
ప్రస్తుతం ‘తేజ్ జ్ఞాన్ ఫౌండేషన్’ అనే ఆధ్యాత్మికసంస్థలో సభ్యురాలిగా చేరి, తేజ్ గురు సర్ శ్రీ గారి బోధనలతో ప్రభావితమై, సంస్థకు కూడా పలు సేవలను అందిస్తున్నారు.
ప్రముఖుల ప్రశంసలు
గ్రామీణ స్థాయి తెలుగు విద్యార్థులకు స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్సెస్ ను మరింత విస్తృతంగా వారి దగ్గరికి తీసుకువెళ్లాలని, ఆరోగ్య సంబంధమైన కౌన్సిలింగ్ సేవలను ఇంకా ఎక్కువ మందికి చేర్చాలనీ, తాను ఆధ్యాత్మిక శిక్షణ ద్వారా పొందుతున్న ఆనందాన్ని వేల వేల మందికి చేర్చాలని ఆమె ఆకాంక్ష.
తాను ఇచ్చే పలు ప్రసంగాలలో తాను నమ్మిన ముఖ్యమైన, బలమైన సూత్రాలు.
- Every problem is an opportunity. సరైన కోణంలో చూడగలిగితే సమస్య అవకాశం లాగా కనిపిస్తుంది. మన దృష్టి కోణాన్ని మార్చుకుంటే, సమస్యలో దాగి ఉన్న అవకాశం బయట పడుతుంది.. సఫలతకు దారితీస్తుంది.
- గుర్రాన్ని నీళ్ల దగ్గరికి తీసుకెళ్లగలం కానీ, నీళ్లు తాగించలేము.. అన్నది తప్పు. ఎందుకంటే గుర్రాన్ని దప్పిక పుట్టేవరకు పరిగెత్తించగలిగితే, నీరు అదే వెతుక్కొని తాగుతుంది. అసలైన ఉపాధ్యాయుడు చేయగలిగిన పని అదే!
- ఉపాధ్యాయులు బడిలో తల్లిదండ్రులైతే, తల్లిదండ్రులు ఇంటిలోని ఉపాధ్యాయులు.
- మేము చెబితే మా పిల్లలు వినట్లేదు’ అని ఎక్కువ మంది తల్లిదండ్రులు ఫిర్యాదు చేస్తూ ఉంటారు. నిజమే, చెబితే ఎవరూ వినరు! మనము చేస్తే, వాళ్లు చూసి నేర్చుకుంటారు. కాబట్టి ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, సరియైన రోల్ మోడల్స్ లాగా ఉంటే.. పిల్లలు ఉత్తమ విలువలతో ఎదుగుతారు.
- శారీరకవైకల్యాలు మనుషులను బలహీనపరచలేవు. మనసుకు వైకల్యాలు రాకుండా కాపాడుకోండి. అప్పుడు విఫలత మీ దరికి కూడా చేరదు.
- Be a child when you learn. ఏ కొత్త అంశాన్ని అయినా మీరు నేర్చుకుంటున్నప్పుడు, పసిబిడ్డ లాంటి మనస్తత్వాన్ని కలిగి ఉండండి. ఎటువంటి పరిధులు నిర్మించుకోకుండా, ఇతరులను పట్టించుకోకుండా, ఆ విషయాలు నేర్చుకోండి.
- ‘The worst man gives the best advice.’ ఏదైనా విషయంలో సక్సెస్ పొందిన వారి సలహా ఎంత మంచిదో, విఫలం పొందిన వారి సలహా అంతకన్నా ఉత్తమమైన. ఒకటి పనిని ఎలా చేయాలో నేర్పితే, మరొకటి ఎలా చేయకూడదో నేర్పుతుంది.
- కాలాన్ని, వనరులను సద్వినియోగం చేసుకోవడమే – సీక్రెట్ ఆఫ్ సక్సెస్.
- భయానికి మించిన శత్రువు లేదు, ధైర్యానికి మించిన మిత్రుడు లేడు. మనోధైర్యం ఉంటే క్యాన్సర్ లాంటి ప్రాణాంతక వ్యాధులు కూడా ఎవరిని ఏమీ చేయలేవు. లేనిపోని అపోహలతో భయపడితే.. అసిడిటీ కూడా ప్రాణాంతం కాగలదు.
- కష్టం అన్నది భావనలో మాత్రమే ఉంటుంది. భావన మారిస్తే.. కష్టం తీరే దారులు కనపడతాయి.
- Mind set అంటే.. స్థిరపడిపోయిన దృష్టి కోణం కాదు. మీరు ఎలా కావాలనుకుంటే అలా Mindని set చేసుకోవచ్చని అర్థం.
- 40 ఏళ్లు రాగానే.. ఇంక బీపీ, షుగరు.. వచ్చేస్తాయని.. తామే నిర్ధారించుకొని.. అనారోగ్యాలకు తివాచీ పరిచి.. సింహాసనాలు వేసి కూర్చోబెడితే.. తప్పు ఎవరిది? ఆ ఆలోచన ఏదో.. తమ సంపూర్ణమైన ఆరోగ్యంతో ఉన్నామని.. తమ జోలికి ఎలాంటి వ్యాధులు రావని విశ్వాసాన్ని ప్రకటించవచ్చు కదా!! లక్ష్యము-గమనము లక్ష్యాలను నిర్దేశించుకుంటే చాలదు. చేరే గమనాన్ని కూడా, చేరుకున్న గమ్యాలను కూడా పరిశీలించుకోవాలి.
- గ్రామీణ యువత ఉద్యోగావకాశాల పెంపుకై ఇంగ్లీష్ కమ్యూనికేషన్స్ స్కిల్స్ బోధన మరియు వారికి శిక్షణ ఇచ్చి, వారి ఉపాధి అవకాశాలను పెంపొందించడం, ద్వారా 12,000 మందికి పైగా గ్రామీణ యువత శిక్షణ పొంది దేశ విదేశాల్లో ఉద్యోగాలలో స్థిరపడ్డారు.
- సుమన్ టీవీ ద్వారా స్పోకెన్ ఇంగ్లీష్, సామాజిక అంశాలపై ఇంటర్వ్యూలు.
- స్ఫూర్తిదాయక ఉపన్యాసాలు ఇవ్వడం: (హైదరాబాద్, కర్నూల్, తిరుపతి, కడప, బద్వేల్, ప్రొద్దుటూరులలో వందకు పైగా మోటివేషనల్ ప్రోగ్రాములు) – ఉపన్యాసకురాలిగా ఎంతోమంది విద్యార్థులకు ప్రేరణగా నిలవడం
- పాజిటివ్ పేరెంటింగ్ పై సదస్సులు మరియు టీచర్స్ ట్రైనింగ్
- క్యాన్సర్ మరియు ఎయిడ్స్పై అవగాహన శిబిరాలు నిర్వహించడం – క్యాన్సర్ బాధితులకు చేయూత, స్ఫూర్తి
- మాతృభాషకు సేవ చేయడం – తెలుగులో పాటలు, పద్యాలు & గజల్స్ రచన, హిందీ, ఇంగ్లీష్ భాషల్లోని పుస్తకాలను తెలుగులోకి అనువదించడం ద్వారా అనువాద సేవలు అందించి, తద్వారా కూడా మాతృభాషను సుసంపన్నం చేయడం.
- సామాజిక కార్యకలాపాలు: నవ్యాంధ్ర రచయిత్రుల సంఘంలో సంయుక్త కార్యదర్శిగా, రాష్ట్ర తెలుగు కళా వేదికలో సభ్యురాలుగా, వివేకానంద కేంద్ర, కన్యాకుమారిలో సభ్యురాలుగా
- సుమన్ టీవీ, మల్లెమాల ఎంటర్టైన్మెంట్స్, డాల్బీ డ్రమ్స్, సనాతన, పూజా సమయం, బిగ్ టీవీ, హిట్ టీవీ యూట్యూబ్ చానెళ్ళలో రికార్డ్ అయిన 300 పైగా భక్తి గీతాలు.
కడప ఉత్సవాల సంబరాల కోసం రాసిన గీతం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకమైంది.
పల్లవి:
కడపోత్సవాల సంబరాల కాంతి ధామమీ కడప
గరుడోత్సవాల స్వామి నెలకొన్న ఈ గడప
ఇది బంగరు కడప- ఘన వైభవాల గడప
గర్వంగా కదలిరండి కడపోత్సవాలకు
ఘనమైన కడప చరిత చాటు ఉత్సవాలకు
కదలిరండి, కలసి రండి, కలసి కదలిరండి- కడప ఘనత చాటండి..
చరణం:
తాళ్లపాక అన్నమయ్య పద కవితలకి ఇది గడప
కాలజ్ఞానం పలికిన పోతులూరిదీ గడప
భక్తకవి పోతనకు, ప్రజాకవి వేమనకు
అల్లసానికీ మొల్లకు ఆలవాలమీ గడప
ఇది బంగరు కడప, కవి గాయకులకు గడప
ఇలా ఈ పాట కడప చరిత్రను, ఆనవాళ్లను, సంస్కృతిని, సహజ వనరులను, జానపదకళలను.. అన్నిటినీ ప్రతిబింబిస్తూ 8 చరణాలుగా సాగుతుంది. అయితే కడప ఉత్సవాల ముగింపు సంబరాల్లో, కడప కళాక్షేత్రంలో గాయక బృందంలో ఆమె కూడా ఉన్నారు. అప్పుడు ఒక అపూర్వమైన సంఘటన జరిగింది. అప్పటివరకు కడపలో పనిచేసిన 9 మంది కలెక్టర్లు మొదటి వరుసలో కూర్చుని ఉన్నారు.. వారందరూ లేచి నిలబడి ‘ఇది బంగరు కడప, ఘన వైభవాల గడప’ అంటూ మూడు మార్లు కోరస్ పాడడం జీవితంలో ఎప్పుడూ మరిచిపోలేని సజీవమైన అనుభూతి.’అంటారామె .
అలాగే 2006లో మరో గీతానికి ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖర్ రెడ్డిగారి నుండి ‘ఉత్తమ గేయ రచయిత్రి’గా అవార్డులు అందుకున్నారు. అటు తరువాత ఆమెను పలు అవార్డులు వరించాయి.
ఆమె జిల్లా, రాష్ట్ర, జాతీయస్థాయి పోటీలలో ఎన్నో బహుమతులు, ప్రముఖ సంస్థల నుంచి ‘ఉగాది పురస్కారం’, ‘సాహితీ రత్న’, ‘సాహిత్య వతంశి’ బిరుదులను పొందారు.
J Mag National level magazine, Woman’s Day, Special Number.
రచనలు – 500 పైగా కవితలు, మరియు 500 పైగా పాటలు
- సిరివెన్నెల సీతారామశాస్త్రిగారిపై ‘సిరివెన్నెల పాట నా మాట’ శీర్షికన సంచిక డైనమిక్ వెబ్ మ్యాగజైన్లో నూరు వారాల పాటు వ్యాసాలను అందించడం. సాధారణ పదాలు వాడుతూ, అసాధారణ భావాలు పలికించడం ఎంతమందికి సాధ్యం? భాషకు అందని భావం, భాషలో ఒదగలేని భావం..సిరివెన్నెల సీతారామశాస్త్రిగారి సాహిత్యాన్ని మనసారా ఆస్వాదించడం, కవితా శిల్పానికి, శిల్పికీ శిరస్సు వంచి పాదాభివందనం చేయడమే ఆరాధన! ఆ సాహితీ తపస్వి, సుమధుర భాషాఝరి, తెలుగువారిగా జన్మించటం మనందరి భాగ్యం. ‘ఓ హేమంతమా? నీలో వసంత మాసపు సరిగమలెక్కడ? అని ప్రశ్నించి, అయ్యో! వసంత గీతాలు లేవని దిగులు పడకు! నీదైన సంగీతం నీకు ఉంది, అని ఓదారుస్తాడు.. సిరివెన్నెల. కలం కదిలితే పాజిటివ్ విస్ఫోటం జరిగినట్టే.. సిరా చుక్క ఒలికితే చైతన్యపు ఉప్పెన కట్టలు తెంచుకున్నట్టే. మన దరికే తరలివచ్చిన సాహితీ వసంతం.. మన సిరివెన్నెల!
- ‘సిరివెన్నెలకో నూలుపోగు’ తొలి సంపుటిలో ఒక వ్యాసం.
- ‘సిరివెన్నెలకో నూలుపోగు’ రెండవ సంపుటిలో ఒక వ్యాసం.
- శ్రీవాణీశర్మ రచించిన ‘అయ్యో కలియుగం’ అనే వ్యంగ్య శతకం పుస్తకంగా వచ్చింది.
- అలాగే ఆమె రచించిన గజళ్ళ సంపుటి ‘మనసు రాగాలు’, (ప్రచురణలో)
- తల్లితో కలసి రచించిన ‘కడప నగర వేల్పులు’ (భక్తి గీతాలు) పుస్తకాలుగా వచ్చాయి.
- మెరుగు రాజేంద్రప్రసాద్ (తెలంగాణ) భగవద్గీత శ్లోకార్థాలు ప్రతిబింబిస్తూ చిత్రాలు వేయగా, తెలుగు ఇంగ్లీషులలో ఆమె వ్యాఖ్యానాలు వ్రాశారు.
- ‘ఓ కోదండ రామయ్యా!!’ ఒంటిమిట్ట కోదండ రామయ్యపై భక్తి గీతాలు.
- భగవద్గీత శ్లోకాలను చిత్రాల రూపంలో ప్రదర్శించిన ‘చిత్ర గీత’కు తెలుగు, ఇంగ్లీష్ భాషల్లో వ్యాఖ్యానం.
- చివుకుల శ్రీలక్ష్మిగారి సంపాదకత్వంలో వచ్చిన ‘ఆది నుంచి అనంతం దాకా’ అనే పుస్తకంలో “భగవద్దత్త మేధోమథన లిఖితాలిఖిత అపురూప గ్రంథకర్తల భారతదేశ ఔన్నత్యపు గురుతులే సనాతన వాజ్ఞ్మయకోశాలు-” అంటూ కవితాత్మకంగా వ్రాసి అందించారు ఆ పుస్తకానికి వండర్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు తిరుపతిలో లభించింది.
- చివుకుల శ్రీలక్ష్మిగారి సంపాదకత్వంలోనే వచ్చిన ‘శ్రీరామచంద్రప్రశస్తి’ పుస్తకంలో ‘రామాయణం – భారతీయుల ఆత్మ’ అనే వ్యాసం.. మరిన్ని..
అనువాదాలు:
- డేల్ కార్నెగీ రచించిన ‘హౌ టు ఎంజాయ్ యువర్ లైఫ్ అండ్ యువర్ జాబ్’
- అమీష్ రచించిన ‘శివ ట్రియాలజీ నుంచి ‘నాగాస్’
- ఆంగ్లంలోని కౌటిల్యుని అర్థశాస్త్రాన్ని తెలుగులోకి అనువాదం
- తేజ్ జ్ఞాన్ ఫౌండేషన్ కు సంబంధించిన హిందీ గ్రంథాలు తెలుగులోకి అనువాదం.
అవార్డులు మరియు పురస్కారాలు:
- 2002లో ఉత్తమ సాహిత్య పురస్కారం కడపోత్సవాల (కడప ద్విశతాబ్ది ఉత్సవాలు) సందర్భంగా ఈమె వ్రాసిన ‘కడపోత్సవ గేయం’ జిల్లాస్థాయి ఉత్తమ గేయంగా ఎంపికకాగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గారి చేతుల మీదుగా, 2002
- ఉత్తమ సాహిత్య పురస్కారం (థీమ్ సాంగ్ & స్వాగత గీతం) – మాజీ ముఖ్యమంత్రి దివంగత డాక్టర్ వై.ఎస్. రాజశేఖర రెడ్డిగారి నుండి – 2006
- ఉత్తమ సాహిత్య పురస్కారం (తెలుగు భాష గొప్పదనం) – సంస్కార్ అవార్డ్స్ – హైదరాబాద్ – 2010
- పురస్కారం “హెరిటేజ్ సాంగ్” యూత్ ఫెస్టివల్ – 2012
- విశిష్ట మహిళా అవార్డ్ – మీతో సాంస్కృతిక సంస్థ, హైదరాబాద్ – 2014
- ‘సాహిత్య రత్న’ అవార్డ్- గానకోకిల కళా పరిషత్, జగిత్యాల – 2016
- ‘తెలుగు దీప్తి’పురస్కారం – తెలుగు కళా వేదిక – 2018
- తెలుగు కవితోత్సవం అవార్డ్ – సాంస్కృతిక వ్యవహారాల శాఖ, ఆంధ్రప్రదేశ్ – 2018 అనేక ఉగాది పురస్కారాలు మరియు గౌరవాలు.
~
శ్రీవాణి నిత్యమూ తనలో తను పాడుకునే స్వీయ రచన ఇలా సాగుతుంది.
పల్లవి:
బాల్యమే గురువుగా నేర్పినా తొలి పాఠమూ
తడబడే అడుగుతో మొదలయే పోరాటమూ
పరిగెత్తు ప్రాయమే, హద్దంటు లేనిదై..
ఊరించు ఆశగా.. సాగేనే..
ప్రతి ఒక్క అనుభవం, ఓ కొత్త ఊపిరై..
పోరాడి గెలవడం నేర్పేనే..
“Every day’s mine, I’ll make a great Sunshine,
Every game I win, ‘N keep the life on spin.”.
శ్రీమతి ఆర్. శ్రీవాణి శర్మ
మొబైల్: +91 9441324587
ఈ మెయిల్: sreevanitrendz@gmail.com
శ్రీమతి చివుకుల శ్రీలక్ష్మి కథ రచయిత్రి. చక్కని కవయిత్రి. విజయనగరం గురించి పరిశోధించి ‘విజయనగర వైభవానికి దిక్సూచి’ అనే 1100 పేజీల పుస్తకం వ్రాశారు. దేశవ్యాప్తంగా గల 116 మంది కవులతో ‘ఆది నుండి అనంతం దాకా…’ అనే వచన కవితల సంకలనం, ‘లేతమనసులు’ కథాసంపుటి వెలువరించారు.
