(‘బిల్కిస్ బానో’ సుప్రీంకోర్టులో విజయం సాధించిన సందర్భంగా ఈ కవిత అందిస్తున్నారు శ్రీ విడదల సాంబశివరావు.)


ఆమె గెలిచింది!
న్యాయం బ్రతికింది!!
రెండు దశాబ్దాల పోరాటం
విజయ తీరాలను చేరింది!
ఈ దేశంలోని వామపక్ష లౌకిక
మానవ సమూహాలు..
పండగ చేసుకుంటున్నాయి!
కానీ.. ఆమె మాత్రం దుఃఖ సముద్రాన్ని..
కడుపులో దాచుకున్న సాగర మాతలా
తొణకని నిండు కుండలా
గాజు కళ్ళను శూన్యం వైపు సారించి..
ఎండి బీటలు వారిన పెదాలపై
నిర్లిప్తతతో కూడిన చిరునవ్వును ప్రదర్శిస్తూ..
అంతరంగంలోని భావోద్వేగాలను
బైటకు రాకుండా బలంగా నిరోధిస్తోంది!
ఆమె మది లోయలతో
సమాధానం లేని ప్రశ్నలెన్నో
శ్మశానంలో సమాధులయ్యాయి!
ఏడున్నర దశాబ్దాల స్వతంత్ర భారతం
ఆధునికతను అందిపుచ్చుకున్నది!
భారత జాతీయ పతాకం
విను వీధులలో విహారిస్తూ
గ్రహాంతర యానానికి
పయనమై పోయింది!
అయినా.. ఈ లౌకిక రాజ్యంలో
ఛాందస భావనా వీచికలు
మనుషుల మధ్య దూరాన్ని పెంచుతూ
మానవ సంబంధాలను విచ్ఛిన్నం చేస్తోన్న వేళ..
ఈ పవిత్ర భూమిపై ‘లౌకికం’ పదం
నేతి బీరకాయ చందమైంది!
పోరుబాటలో గెలుపు తీరాలు చేరినా..
మతం ముసుగులో
ముష్కరులు చేసిన గాయం మానిపోయినా..
గుండె గాయం మాత్రం అలాగే వుంది!
రక్తం పంచుకు పుట్టిన బిడ్డ..
సప్త వర్ణాలను పోలిన
రక్త సంబంధాల ఆత్మబంధువులు..
రక్కసి మూకల దారుణ మారణకాండకు
బలియైన చేదు నిజాన్ని మరచిపోలేక
నిరంతర వేదనతో
అలమటిస్తోన్న మనసు..
ఈ గెలుపును మాత్రం
ఓటమి గానే పరిగణిస్తోంది!

శ్రీ విడదల సాంబశివరావు గారు 22 జనవరి 1952 న గుంటూరు జిల్లా, చిలకలూరిపేట పురపాలక సంఘం పరిధిలో ఉన్న పురుషోత్తమపట్నం గ్రామంలో ఓ మధ్య తరగతి ‘రైతు’ కుటుంబంలో జన్మించారు. శ్రీమతి సీతమ్మ, రాములు వీరి తల్లిదండ్రులు. స్వగ్రామంలో ప్రాథమిక విద్య, చిలకలూరిపేటలో ప్రాథమికోన్నత విద్య, తెనాలిలో బి.ఎస్.సి. పూర్తి చేశారు.
బాల్యం నుంచి నటనపై అభిరుచి ఉంది. అనేక నాటికలలోనూ, నాటకాలలోనూ నటించి ప్రశంసలందుకొన్నారు. వివిధ సంస్థల నుండి పతకాలు పొందారు. రాష్ట్రస్థాయిలో ఉత్తమ నటుడిగా బహుమతులు పొందారు. వీరు రచించిన ‘పుణ్యభూమి నా దేశం’ (నాటకం), ‘తలారి తీర్పు’ (నాటిక) ప్రసిద్ధమయ్యాయి. టివి ధారావాహికల్లోనూ, కొన్ని సినిమాల్లోనూ ముఖ్య పాత్రలు పోషించారు.
సాంబశివరావు గారు వెయ్యికి పైగా కవితలు రాశారు. వాస్తవిక జీవితాలని చిత్రిస్తూ అనేక కథలు రాశారు. కవితలు, నాటకాలు, కథలు కలిపి 14 పుస్తకాలు ప్రచురించారు. పలు పత్రికలలో ఫీచర్లు నిర్వహిస్తున్నారు.
నాటకరంగలోనూ, రచన రంగంలోనూ ఉత్తమ పురస్కారాలు అందుకొన్నారు. నీహారిక పౌండేషన్ అనే సంస్థని స్థాపించి సమాజ సేవ చేస్తున్నారు.