[డా. కె. ఎల్. వి. ప్రసాద్ రచించిన ‘అడ్డుగోడలు’ అనే కవితని పాఠకులకి అందిస్తున్నాము.]


అరవయ్యేళ్లు వెనక్కి తిరిగి
బాల్యాన్నొకసారి
సింహావలోకనం చేసుకుంటే,
మనసు వికలమై..
గుండెబరువెక్కిపోతుంది
గతం ఒక విషాదం అనిపిస్తుంది!
పండుగలు – పబ్బాలు..
ఆ వేడుకలు – ఆనందాలు,
మమ్మల్ని అస్పృశ్యుల్ని చేసి
దూరంగా జరిగిపోయేవి..!
కమ్యూనిజానికి..
నాస్తికవాదం తోడై..
‘దేవుడు’ అనే పదం..
మా అవగాహనా నిఘంటువులో
అసలు చోటుచేసుకోలేదు!
దీపావళి వచ్చిందంటే..
ఆనందానికి బదులు..
నీరసం ముంచుకొచ్చేది!
చుట్టుపక్కల పిల్లలంతా
ఉత్సాహంగా ఉల్లాసంగా
కాకరపువ్వొత్తులు – చిచ్చుబుడ్లు
మతాబాలు – విష్ణు చక్రాలు
సిసింద్రీలు కాలుస్తూ –
టపాకాయలు – లక్ష్మీ బాంబులు
పేలుస్తుంటే.. నాలాంటివాళ్ళు
చిటికెల పోట్లాముతోనే..
సరిపెట్టుకోవాల్సి వచ్చేది!
పండగంటే —
పటాసులు కాల్చుకోవడం
పిండివంటలు తినడమే
అనుకున్న రోజులవి..!
రోజులు మారాయ్..
జీవనపరిస్థితులు మారాయ్,
అయితేనేమి..
పండగ పరిస్థితి యథాతథం!
అప్పుడు నాస్తికత్వానికి –
పేదరికం తోడయింది..!
ఇప్పుడు —
లక్ష్మీ దేవి కటాక్షం వున్నా,
మత మౌఢ్యం మస్తుగా
అడ్డుపడుతోంది..!!

వృత్తిరీత్యా వైద్యులు, ప్రవృత్తి రీత్యా రచయిత అయిన డా. కె.ఎల్.వి. ప్రసాద్ పుట్టింది, పెరిగింది తూర్పు గోదావరి జిల్లా దిండి గ్రామం. హైస్కూలు విద్య పాక్షికంగా అప్పటి తాలూకా కేంద్రం రాజోలులో. తదుపరి విద్య నాగార్జున సాగర్ (హిల్ కాలనీ), హైద్రాబాదులలో. వారి అన్నయ్య కె.కె.మీనన్ స్వయంగా నవలా/కథా రచయిత కావడం వల్ల, చిన్న వయస్సులోనే పెద్ద పెద్ద రచయితల సాహిత్యం చదువుకున్నారు. ఇంటర్మీడియట్ నుండే కవితలు రాయడం మొదలుపెట్టారు. 1975 నుండి వ్యాసాలు రాస్తున్నారు. 1983 నుండి కథలు రాస్తున్నారు. ఉద్యోగ రీత్యా హన్మకొండలో స్థిరపడ్డారు. వరంగల్ “సహృదయ సాహిత్య సాంస్కృతిక సంస్థ”కు వరుసగా 15 సంవత్సరాలు అధ్యక్షుడిగా ఉన్నారు. 2011లో కరీంనగర్ జిల్లా ఆసుపత్రిలో సివిల్ సర్జన్గా రిటైర్ అయ్యారు. “కె ఎల్వీ కథలు”, “అస్త్రం”, “హగ్ మీ క్విక్”, “విషాద మహనీయం” (స్మృతి గాథ) వంటి పుస్తకాలను వెలువరించారు.
1 Comments
డా కె.ఎల్.వి.ప్రసాద్
సంచిక సంపాదకులకు
ఇతర సాంకేతిక నిపుణులకు
హృదయ పూర్వక కృతజ్ఞతలు.
—–డా కె.ఎల్.వి.ప్రసాద్.