[“కొన్ని అనుభవాలు, కొందరి జీవితాలకు జ్ఞాన మార్గాలు కావచ్చు. జీవనశైలిని సరిదిద్దుకునే వినూత్న పోకడలు కావచ్చు. అందుకే, అందరి అనుభవాల జ్ఞాపకాలూ, అందరికి అవసరమే..!!” అంటూ తమ జ్ఞాపకాల పందిరి క్రింద విహరింపజేస్తున్నారు డా. కె. ఎల్. వి. ప్రసాద్.]


చాలా ఏళ్ళ తర్వాత సుల్తాన్ బజార్కు..
ఒకప్పుడు హైదరాబాద్ లోని సుల్తాన్ బజార్ ఒక ప్రత్యేకతను సంతరించుకుని ఉండేది. ఒక్క హైదరాబాద్కే కాదు, హైదరాబాద్ – సికిందరాబాద్ జంటనగరాలకు సుల్తాన్ బజార్ ఒక దర్శనీయ ప్రదేశంగా ఉండేది. అప్పట్లో కోఠీ, సుల్తాన్ బజార్, అబిడ్స్ వంటి ప్రదేశాలు ముఖ్య వ్యాపార కేంద్రాలుగా ఉండేవి. ఈ మూడు ప్రదేశాలూ ఒకదానిని ఒకటి ఆనుకుని ఉండడం కూడా మరొక ప్రత్యేకత. ఇప్పుడు ప్రతి చోట ఫ్లైఓవర్లు వచ్చి అంతా మూసుకు పోయినట్టు అయింది కానీ అప్పుడు ఉదయం నుండి రాత్రి వరకూ జనంతో క్రిక్కిరిసి ఉండేది. కారణం అన్నింటికీ ముఖ్య కూడలిగా ఉండేది. అందరికీ అందుబాటులో వుండే చిన్న చిన్న వ్యాపారాలు, కూరగాయల అంగడి అన్ని వర్గాల ప్రజలకూ అందుబాటులో ఉండే విధంగా ఉండడం, కొనుగోలుదారులే కాక, సరదాగా జనాన్ని చూడడానికి వచ్చే కుర్రకారుతో సుల్తాన్ బజార్ కళకళ లాడుతుండేది. తర్వాత కోఠి నుండి జంటనగరాలలోని ప్రతి ప్రాంతానికీ బస్సు సౌకర్యం ఉండేది. డబుల్ డెక్కర్ బస్సులు (మేడ బస్సులు), ట్రైలర్ బస్సులు ఇక్కడినుండి ప్రారంభం అయ్యేవి. ప్రత్యేకమైన రూపంలో ఆంధ్రాబ్యాంక్ (ఇప్పుడు యూనియన్ బ్యాంకు) భవనం, బ్యాంకు ప్రధాన కార్యాలయం అక్కడే ఒక చూడదగ్గ భవనంలా కనిపించేది. సాహిత్యకారులకు మాత్రం ఇష్టమైన గ్రంథాలయం/సమావేశ మందిరం సుల్తాన్ బజార్ లోనే ఇప్పటికీ వుంది.


లేఖిని ఆహ్వానం
అది ఒకప్పుడు, ‘శ్రీ కృష్ణ దేవరాయాంధ్ర భాషా నిలయం’ గా పిలవబడేది. ఇప్పుడది ‘శ్రీ కృష్ణ దేవరాయ భాషా నిలయం’గా పిలవబడుతున్నది. బహుపురాతన ప్రభుత్వేతర గ్రంథాలయాలలో ఇది ఒకటని చెబుతారు. ఈ గ్రంథాలయం సెప్టెంబర్ ఒకటి,1901 నాడు ప్రారంభించినట్లు చరిత్ర చెబుతున్నది. తెలంగాణలో మొదటి పురాతన గ్రంథాలయంగా దీనిని చెబుతారు.


నాన్నలేని కొడుకు నవల
నేను 1967 ప్రాంతం నుండి హైదరాబాద్తో సంబంధాలు కలిగి ఉండడం వల్ల, ఈ శ్రీ కృష్ణ దేవరాయ భాషా నిలయం గురించి నాకు తెలుసును.
అప్పట్లో పెద్ద పెద్ద సాహిత్య సాంస్కృతిక కార్యక్రమాలు, ముఖ్యంగా ప్రభుత్వ కార్యక్రమాలు రవీంద్రభారతిలో జరిగేవి. ఇక చిన్న చిన్న సాహిత్య కార్యక్రమాలైనా నాణ్యమైన కార్యక్రమాలు ఈ గ్రంథాలయంలో జరిగేవి. అలాంటి కార్యక్రమాలలో నాటి ‘యువభారతి’ పేరుతో జరిగిన కార్యక్రమాలు చెప్పుకోదగ్గవి. మహా గొప్ప సాహితీవేత్తలను నేను అక్కడే చూసాను. మంచి మంచి సాహిత్య ఉపన్యాసాలు, అవధానాలు, కవి సమ్మేళనాలు అక్కడ చూచాను, విన్నాను. శ్రీ దివాకర్ల వెంకటావధాని, శ్రీ జి, వి. సుబ్రహ్మణ్యం, శ్రీ సి.నా.రె, శ్రీ బిరుదురాజు రామరాజు, శ్రీమతి యశోధరా రెడ్డి, శ్రీ శీలా వీర్రాజు, దేవులపల్లి రామానుజరావు గారు, శ్రీ సుధామ వంటి సాహితీ పెద్దలను, కానేటి మధుసూదన్, శ్రీ ఎస్. వి. ఎల్. ఎన్. శర్మ వంటి కార్యకర్తలను నేను అక్కడ చూచాను.


నవలా రచయిత్రి శ్రీమతి అత్తలూరి విజయలక్ష్మి గారు
యువ భారతి లోగోను స్వర్గీయ శీలా వీర్రాజు గారు వేసినట్టు గుర్తు. ఎందుచేతనంటే ఆయన అక్షరాలను సులభంగా గుర్తు పట్టవచ్చును. యువభారతి వారు అప్పట్లో ఉషస్సు.. అనే కవితా సంకలనం ప్రచురించినట్టు గుర్తు (ఇంకా అనేక సాహితీ గ్రంథాలు ప్రచురించారు). అందులో ఎక్కువ యువకవులకు కవయిత్రులు ప్రాధాన్యం ఇచ్చారు. ఇది నాకు బాగా గుర్తుండి పోవడానికి ప్రధాన కారణం మా చిన్నన్నయ్య డా మధుసూదన్ కానేటి (ఆకాశవాణి విశాఖపట్నం) కవిత కూడా ఆ కవితా సంకలనంలో వుంది.


సమావేశంలో వేదిక
అయితే అప్పుడు ఈ గ్రంథాలయంలో సమావేశ మందిరం అంత సౌకర్యంగా ఉండేది కాదు. రోడ్డుకు కాస్త ఎత్తుగా వుండి మెట్లు ఉండేవి. హాలు మామూలుగా ఉండేది. ఒక ప్రక్క గ్రంధాలయమూ ఉండేది. నా చదువు పూర్తి అయి ఉద్యోగంలో చేరిన తర్వాత, నాకు సుల్తాన్ బజార్ గాని, శ్రీ కృష్ణ దేవరాయ భాషా నిలయం గాని చూడవలసిన అవసరం రాలేదు. ఎందుకంటే నా ఉద్యోగ పర్వం అంతా, వరంగల్ – కరీంనగర్ జిల్లాలలోనే ముగిసిపోయింది.
ఈ నేపథ్యంలో, మొన్నీమధ్య అంటే 1980 తర్వాత మళ్ళీ ఇప్పుడు సుల్తాన్ బజార్ను, అక్కడ వున్న శ్రీకృష్ణ దేవరాయ భాషా నిలయాన్ని చూసే అవకాశం కలిగింది. ఈ సదవకాశం కలిగించిన వారు, హైదరాబాద్, చెందిన ‘లేఖిని రచయిత్రుల వేదిక’. ముఖ్యంగా ప్రముఖ కథా రచయిత్రి శ్రీమతి అత్తలూరి విజయలక్ష్మి గారి ద్వారా జరిగింది. అది పూర్తిగా స్త్రీమూర్తుల వేదిక. మరి నన్ను ఎందుకు పిలిచారో ముందు అర్థం కాలేదు.
అలా 16-08-2023 సాయంత్రం సుల్తాన్ బజార్ లోని శ్రీ కృష్ణ దేవరాయ భాషా నిలయానికి వెళ్లాను. ఒకప్పుడు నేను చూసిన భాషా నిలయం ఇప్పుడు పూర్తిగా మారిపోయింది. మొదటి అంతస్తులో చిన్న ఏసీ – సమావేశమందిరం కట్టారు. చిన్న చిన్న సమావేశాలకు అది చాలా అనువుగా వుంది. ఇంతకీ అక్కడ కార్యక్రమం ఏమిటంటే, శ్రీమతి అత్తలూరి విజయలక్ష్మిగారు, సంచిక – అంతర్జాల వారపత్రికలో రాసిన చిరు సీరియల్ నవల పుస్తక రూపంలో రావడంతో, ఈ వేదిక ఆధ్వర్యంలో కొందరు సాహితీ మిత్రులతో చర్చా సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. ఆ నవల పేరు ‘నాన్నలేని కొడుకు’. నవల టైటిల్ వింతగా అనిపించింది.


ఉపన్యసిస్తున్న రచయిత
కార్యక్రమం 5 గంటలకే ప్రారంభం కావలసి వున్నా రావలసిన వారు సకాలంలో రాకపోవడంతో కాస్త ఆలస్యంగానే సభ ప్రారంభమయింది. ముప్పై మంది వరకూ సభ్యులు వచ్చారు. అందులో మగప్రాణిని నేను ఒక్కడినే! అదృష్టవశాత్తు అక్కడ నా చిరకాల మిత్రమణి శ్రీమతి ఝాన్సీ కొప్పిశెట్టి, సాహితీ పెద్దలు శ్రీమతి శీలా సుభద్రాదేవి, శ్రీమతి అల్లూరి గౌరీలక్ష్మి గార్లు సమావేశంలో ఉండడంతో నాకు కొంత ఉపశమనం లభించినట్లయింది. ఈలోగా నిర్వాహకులు ఏమనుకున్నారో ఏమోగానీ, సంచిక పత్రిక పక్షాన నన్ను కూడా వేదిక మీదికి పిలవడం వల్ల అక్కడ నేను అనుకోని అతిథినయ్యాను. వేదిక మీద కూడా కొంత ఇబ్బందికి లోను కాక తప్పలేదు. అక్కడ ఒక్క విజయలక్ష్మి గారు మాత్రమే నాకు పరిచయం.
నవల గురించి వివిధ రచయిత్రులు తమ సూచనలను, స్పందనను వినిపించారు. కొందరు నవల నిడివిని పెంచమన్నారు. కొందరు కొన్ని పాత్రల స్వభావాన్ని పెంచమన్నారు. ఇలా తమ తమ అభిప్రాయాలను స్వేచ్ఛగా వెల్లడించారు. నాకు ఇటువంటి సమావేశం కూడా కొత్త. అందుకే వేదిక మీద వుండి, శ్రద్ధ గల శ్రోతనయ్యాను. చివరగా విన్న విషయాలు క్రోడీకరించి నేను కూడా రెండు నిముషాలు మాట్లాడాను. నిజానికి అది ఒక సాహిత్య కార్యక్రమంలా కాకుండా, ఒక ఆత్మీయ సమ్మేళనంలా ఆనందంగా ముగిసింది.


లేఖిని సభ్యులతో రచయిత
ఈ విధంగా కొన్ని సంవత్సరాల తర్వాత, సుల్తాన్ బజార్ను, శ్రీ కృష్ణ దేవరాయ భాషా నిలయాన్నీ చూసే అవకాశం కలిగింది. అనుకోని విధంగా ఈ అవకాశం కలిగించిన, లేఖిని రచయిత్రుల వేదికకు, ముఖ్యంగా ప్రముఖ రచయిత్రి శ్రీమతి అత్తలూరి విజయలక్మి గారికి కృతజ్ఞతలు చెప్పకుండా ఉండలేను. సాహిత్య పరంగా ఇది నాకు ప్రత్యేక అనుభవం.
విద్యార్థి దశలో సాయంత్రం పూట సుల్తాన్ బజార్లో, మిత్రులతో సరదా షికార్లు మరచిపోదామన్నా మరచిపోయేవి కాదు, ఆ.. రోజులే వేరు కదా!
(మళ్ళీ కలుద్దాం)

వృత్తిరీత్యా వైద్యులు, ప్రవృత్తి రీత్యా రచయిత అయిన డా. కె.ఎల్.వి. ప్రసాద్ పుట్టింది, పెరిగింది తూర్పు గోదావరి జిల్లా దిండి గ్రామం. హైస్కూలు విద్య పాక్షికంగా అప్పటి తాలూకా కేంద్రం రాజోలులో. తదుపరి విద్య నాగార్జున సాగర్ (హిల్ కాలనీ), హైద్రాబాదులలో. వారి అన్నయ్య కె.కె.మీనన్ స్వయంగా నవలా/కథా రచయిత కావడం వల్ల, చిన్న వయస్సులోనే పెద్ద పెద్ద రచయితల సాహిత్యం చదువుకున్నారు. ఇంటర్మీడియట్ నుండే కవితలు రాయడం మొదలుపెట్టారు. 1975 నుండి వ్యాసాలు రాస్తున్నారు. 1983 నుండి కథలు రాస్తున్నారు. ఉద్యోగ రీత్యా హన్మకొండలో స్థిరపడ్డారు. వరంగల్ “సహృదయ సాహిత్య సాంస్కృతిక సంస్థ”కు వరుసగా 15 సంవత్సరాలు అధ్యక్షుడిగా ఉన్నారు. 2011లో కరీంనగర్ జిల్లా ఆసుపత్రిలో సివిల్ సర్జన్గా రిటైర్ అయ్యారు. “కె ఎల్వీ కథలు”, “అస్త్రం”, “హగ్ మీ క్విక్”, “విషాద మహనీయం” (స్మృతి గాథ) వంటి పుస్తకాలను వెలువరించారు.
21 Comments
డా కె.ఎల్.వి.ప్రసాద్
సంచిక సంపాదకవర్గానికి ఇతర సాంకేతిక నిపుణుల కు హృదయపూర్వక ధన్యవాదాలు.
—–డా కె.ఎల్.వి.ప్రసాద్.
sagar
సాహిత్య సమావేశాలలో పాల్గొనడం మీకున్న ఇష్టమైన కార్యక్రమాలలో ఒకటని నాకు తెలుసు సర్. అందునా అలాంటి పురాతన మందిరంలో మీ పాతఙ్ఞాపకాల దొంతర కనులముందున్నట్లు మీకు అలాంటి అవకాశం రావడం, అదికూడ మహిళలు మాత్రమే పాల్గొన్న సమావేశంలో ఉపన్యసించాల్సిఉన్నా అది మీకు గొప్ప గౌరవమని నాకు అనిపిస్తుంది. మీకు శుభాకాంక్షలు మరియు ధన్యవాదములు సర్ .
డా కె.ఎల్.వి.ప్రసాద్
సాగర్
కృత జ్ఞత లు.
Shyamkumar Chagal
డాక్టర్ కి ఎల్వి ప్రసాద్ అభిరుచికి తగినట్టుగా ఇష్టమైన ప్రదేశాలకు ఆహ్వానం దొరకడం అదృష్టం అనే భావించాలి. అందరూ స్త్రీ మూర్తుల మధ్య గౌరవమైన స్థానం లభించడం చాలా మంచి విషయం.
నేను చిన్నప్పటినుంచి సుల్తాన్ బజార్ ప్రాంతాల్లో తిరుగాడాను కానీ శ్రీకృష్ణదేవరాయ భాషా నిలయాన్ని చూడడం జరగలేదు.
డా కె.ఎల్.వి.ప్రసాద్
ధన్యవాదాలు శ్యామ్ కుమార్.
Rajendra Prasad
ప్రాచీన వైభవాలు . ముఖ్యంగా గ్రంధాలయాలు ఇప్పటి డిజిటల్ యుగంలో ప్రాధాన్యతను కోల్పోతున్నాయి
డా కె.ఎల్.వి.ప్రసాద్
….అని పూర్తిగా చెప్పలేము
ప్రసాద్ గారూ….ఇక్కడ బిల్డింగు పాతది
హంగులన్నీ ఆధునికమే!
డా కె.ఎల్.వి.ప్రసాద్
శుభోదయం శుభాకాంక్షలు
ఎందరో మహానుభావులు
అందరూ మహిళలే
తమ తమ రచనలు
పంచుతూ ఉంటారు
అందరి ఆదరణ అందుకునే
అదృష్టం ఒకరికి
అందరూ ఇష్టపడే
ఆయన కేల్వి
ఈ నాటి రచయితలకు
ఆదర్శం ఆత్మ బంధువు
అభినందనలు ఆశీర్వచనాలు
—-డాక్టర్ నాగులు
అమెరికా.
డా కె.ఎల్.వి.ప్రసాద్
ధన్యవాదాలు సర్ మీకు
డా కె.ఎల్.వి.ప్రసాద్
రచయిత్రుల సరసన సత్కవీంద్రులు కొలువుదీరిన వేళ కొత్త అనుభవం మనతో పంచుకోవడం ముదావహం.
జయహో! వైద్యవర్య!
—ప్రొ.జనార్డనరావు
కాజీపేట.
Jhansi koppisetty
మీ ఈ జ్ఞాపకాల పందిరిలో నేనూ భాగస్వామ్యం వహించినందుకు ఆనందంగా వుంది… నాకూ ఈ కృష్ణ దేవరాయ భవనాన్ని సందర్శించడం తొలి అనుభవమే…It was a good memory indeed
డా కె.ఎల్.వి.ప్రసాద్
మీ స్పందనకు
హృదయ పూర్వక కృతజ్ఞతలు .
డా కె.ఎల్.వి.ప్రసాద్
హైదరాబాద్ గత చరిత్రకు తీపి గుర్తులుగా మిగిలిపోయిన వ్యాపార కూడళ్ళు ,వైద్య, విజ్ఞాన , కళావేదికల సమాహారాన్ని గుర్తుచేస్తూ డాక్టర్ కే ఎల్ వి గారు ఈ వారం శీర్షికలో పాఠకులను గత స్మృతుల లోతుల్లోకి తీసుకెళ్లారు . ప్రజల అభిరుచులు మారటం , జనాభా పెరుగుదల ,ఆధునీకరణ, ఆకాశ హర్మ్యాల నిర్మాణాల వలన,కళాత్మకంగా నిర్మించిన భవనాల ఉనికి మరుగున పడిపోయాయి. నేటి ప్రభుత్వాలకు ,చారిత్రక కట్టడాల ప్రాముఖ్యతను , వాటి గుర్తులను భావితరాలకు అందించాలనే సత్సంకల్పము కలగడం హర్షనీయం!
—-బి.రామకృష్ణ రెడ్డి
సికిందరాబాద్.
డా కె.ఎల్.వి.ప్రసాద్
ధన్య వాదాలండీ
రెడ్డిగారు.
పుట్టి నాగలక్ష్మి
నాకు శ్రీకృష్ణదేవరాయ భాషా నిలయం చూసే అదృష్టం ఇంతవరకూ కలగలేదు.అయితే ఆ మార్కెట్ ప్రదేశాలన్నీ చూశాను.. ఒకనాటి వాటి వైభవాన్ని కళ్ళకి కట్టించారు మీ వ్యాసంలో.. అందరు సోదరీ రచయిత్రుల మధ్యలో మీరు అతిథి గా ఉండడం నవలా రచయిత్రి మీకు ఇచ్చిన గౌరవం అని చెప్పాలి.’ నాన్నలేని కొడుకు’వంటి వైవిధ్యభరిత నవల విశ్లేషణ కార్యక్రమంలో పాల్గొని మీ జ్ఞాపకాల పందిరి లో నిక్షిప్తం చేసి అందించినందుకు మీకు ధన్యవాదాలు. అత్తలూరి విజయలక్ష్మి గారు నన్నూ రమ్మని ఆహ్వానించారు గాని.. దూరాభారం వల్ల రాలేక పోయాను..
డా కె.ఎల్.వి.ప్రసాద్
మీ సహృదయ స్పందనకు ధన్యవాదాలు మేడం.
sunianu6688@gmail.com
ముందుగా రచయత Dr KLV prasad గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. మీ రచనలు ముఖ్యంగా ఈ “జ్ఞాపకాల పందిరి ” శీర్షిక ద్వారా ఎన్నో విషయాలు పట్ల మాకు అవగాహన కలిగిస్తున్నారు అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. మహిళల వేదిక పై మీరు కూడా భాగస్వాములు అవడం మాకు ఆనందం కలిగింది. సుల్తాన్ బజార్, శ్రీకృష్ణ దేవరాయలు గ్రంధాలయం గురించి అవగాహన లేని మా లాంటి వారికి మీ” జ్ఞాపకాలు పందిరి ” ఒక విలువైన గ్రంధాలయం లాంటింది అని నా అభిప్రాయం.



డా కె.ఎల్.వి.ప్రసాద్
అమ్మ మీ స్పందనకు ధన్యవాదాలు.
డా కె.ఎల్.వి.ప్రసాద్
Sultan Bazar,Abids,Koti,
Srikrishna Grandhalayam,maakunu Aa pradeshalanni gurthu chesaru.Appudappudu nenu ala naduchukuntu tiruguthanu paatha gnapakalanni nemaru vesukuntu.Sabhalo kontha ibbandi padivuntaru
—prof.Ravikumar
Hanmakonda.
డా కె.ఎల్.వి.ప్రసాద్
Thank you brother.
Jogeswararao Pallempaati
మీరు వెళ్లిన ఏరియా బొగ్గుల కుంట గా తెలుసు, డాక్టర్ గారూ! నేను ఓ సారి సమావేశానికి వెళ్ళాను!