[తెలుగు సాహిత్యం పట్ల కొన్ని తరాలలో ఆసక్తి రగిలించి, ఆధునిక తరానికి వ్యక్తిత్వ వికాస పాఠాలు చెప్తూ, యువతకు ఉత్తమ సాహిత్యం ద్వారాఉత్తమ వ్యక్తిత్వాన్నివ్వాలని నిరంతరం తపించే యువభారతి సంస్థ స్థాపించి వచ్చే దసరాకు 60 సంవత్సరాలు పూర్తవుతాయి. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని తెలుగు సాహిత్యానికి, సమాజానికి యువభారతి చేసిన సేవను తెలుగు పాఠకులకు పరిచయం చేసే ఉద్దేశంతో ప్రతి ఆదివారం సంచికలో యువభారతి ప్రచురించిన పుస్తకాల పరిచయం వుంటుంది. ఈ శీర్షిక వచ్చే విజయదశమి వరకూ సాగుతుంది.]
కంకంటి కవితా వైభవం
ప్రబంధం అనే మాటకు సంస్కృతంలో కవిత్వం అని అర్థం. కానీ తెలుగులో ఒక విధమైన కావ్య ప్రక్రియను ప్రబంధం అంటాము. ఏకనాయకమై, శృంగారవీరరస ప్రధానమై, కమనీయ వర్ణనాత్మకమై, వర్తిల్లే కావ్యం తెలుగులో ప్రబంధం అనిపించుకుంటుంది. పురాణాలు ఒక్కొక్కటిగా తెలుగులోకి వస్తున్నప్పుడు, శ్రీనాథుడు నైషధాన్ని కవిత్రయం వారు చూపిన మార్గంలో తెనిగించి ఈ ప్రబంధ ప్రక్రియకు నారు పోసినాడు. పెద్దన, తిమ్మన, భట్టుమూర్తి, సూరన – ఈ ప్రబంధ వల్లరికి నీరుపోసి దోహదం చేసి, నిత్య కవితా సౌరభాలను గుబాళించే ప్రబంధాలను అందించారు. రెండు శతాబ్దాలపాటు ఈ ప్రబంధాలు ఒయ్యారాలు ఒలుకుతుంటే, కంకంటి పాపరాజు మళ్ళీ పురాణ రచనకు పూనుకున్నాడు.


ఈ ఉత్తర రామాయణం పురాణమైనా, దీనిలో ప్రబంధం అనడానికి కావలసిన లక్షణాలన్నీ ఉన్నాయి. అలా పురాణ రచనకు ప్రబంధ వర్ణనలను పులిమి, ఆయన ఒక కొత్త పుంతను తొక్కినాడు.17 వ శతాబ్దపు ప్రజా జీవితం లీలగా కనిపిస్తుందీ కావ్యంలో. సుందరమైన పడబంధాలకు, శ్రవణ సుఖదమైన సమాసాలకు, ధారాశుద్ధి కలిగిన పద్యాలకు, ఈ కావ్యం కాణాచి.


కంకంటి పాపరాజు కవితా వైభవాన్ని సరళ సుందర రీతిలో శ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు వివరించిన ఈ పుస్తకాన్ని క్రింద ఇవ్వబడిన link ను క్లిక్ చేసి ఉచితంగానే చదువుకోండి.
లేదా క్రింద ఇవ్వబడిన QR code ను scan చేసినా ఆ పుస్తకాన్ని ఉచితంగా చదువుకోవచ్చు.



శ్రీ పత్రి అశ్వనీ కుమార్ గారి నివాసం నవీ ముంబై, మహారాష్ట్ర.
విద్యాభ్యాసం అంతా విజయవాడ లోనే జరిగింది. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం నుండి MBA పట్టా పుచ్చుకుని, ఉద్యోగార్ధం హైదరాబాద్ వచ్చిన తర్వాత యువభారతి సంస్థతో (1982) నలభై ఏళ్ళ అనుబంధం.
వృత్తిరీత్యా రిలయన్స్ ఇండస్ట్రీస్ లో Finance & Accounts లో Senior Management Team లో పనిచేసి 2016 లో పదవీ విరమణ చేసినా, ప్రవృత్తి మాత్రం – సంగీత సాహిత్యాలే. ప్రస్తుతం ఒక Youtube Channel కి Voice Over artiste గా, స్వరమాధురి సంగీత సంస్థకు అధ్యక్షునిగా వారి విశ్రాంత జీవితాన్ని బిజీ గా, ఆనందంగా గడుపుతున్నారు.