181
నక్షత్రాల నిశ్శబ్దానికి
పగలు బంగరు వీణ అర్పిస్తుంది
జీవితాంతం శృతి చేసుకుందుకు
182
పండితుడికి తెలుసు ఎలా బోధించడమో
ఎలా కొట్టాలో అవివేకికి
183
శాశ్వత వలయాల నాట్య హృదయంలో
మధ్యభాగం నిశ్చలనం నిశ్శబ్దం
184
మరొకని దీపపు నూనెని
తన సొంత దీపంతో పోల్చుకున్నాక
న్యాయవాది తాను నిష్పాక్షికమని భావిస్తాడు
185
తనమీద గడ్డి పువ్వు అసూయ చూసి
రాజు హారంలోని
బందీ పువ్వు క్రూరంగా నవ్వుకుంటుంది
186
కొండ మీద మంచు ఖజానా
తన మీదే వేసుకొన్న భారం
దాని ప్రవాహ ధారలు ప్రపంచమంతా మోస్తుంది
187
దాని పూల స్వేచ్ఛ కోసం
అడవి ప్రార్థన విను
188
నీ ప్రేమ నన్ను చూడనీ
దగ్గరతనపు అవరోధాల నుంచి కూడా
189
సృష్టిలో శ్రమ స్ఫూర్తి ఉంది
ఆట స్ఫూర్తిని కొనసాగించి సహాయపడటానికి
190
యంత్రవాద్య భారం మోయటాన్ని
సంగీతం కోసమని కాకుండా
దాని సామాను ఖరీదుతో చూడటం
బధిరజీవిత విషాదం
191
విశ్వాసం వెలుగును అనుభవించే ఒక పక్షి
వేకువ ఇంకా చీకటిగానే ఉన్నా పాడుతుంటుంది
192
కొత్త ఉదయం పండగ కోసం
నా పగలు ఖాళీ కప్పుని, నీకు రాత్రి తెస్తాను
నీ చల్లని చీకటితో కడగటానికి
193
దాని ఆకుల గలగలలతో, కొండ మీద దేవదారువృక్షం
తుఫానుతో తాను జరిపిన పోరాట జ్ఞాపకాన్ని
శాంతి శ్లోకంగా గొంతు సవరించుకుంటుంది
194
నేను తిరగబడినపుడు దేవుడు
తాను పోరాడి నన్ను గౌరవించాడు
నేను బలహీపడినపుడు నన్ను అలక్ష్యం చేసాడు
195
తెడ్డుతో సముద్రాన్ని ఒంపిందే
తన సొంత కొలను
అనుకుంటాడు దురభిమాని
(మళ్ళీ వచ్చే వారం)

శ్రీ యల్లపు ముకుంద రామారావు 9 నవంబరు 1944 నాడు పశ్చిమ బెంగాల్ ఖరగ్పూర్లో జన్మించారు. విద్యార్హతలు M.Sc, D.I.I.T, P.G.D.C.S.
కవిగా, అనువాద కవిగా, రచయితగా ప్రసిద్ధులైన ముకుంద రామారావు – వలసపోయిన మందహాసం (1995), మరో మజిలీకి ముందు (2000), ఎవరున్నా లేకున్నా (2004), నాకు తెలియని నేనెవరో (2008), నిశ్శబ్దం నీడల్లో (2009), విడనిముడి (అన్ని సంకలనాల్లోని ఆత్మీయ అనుబంధాల కవిత్వం) – (2013), ఆకాశయానం (2014), రాత్రి నదిలో ఒంటరిగా (2017) అనే స్వీయ కవితా సంపుటాలను వెలువరించారు.
అదే ఆకాశం – అనేక దేశాల అనువాద కవిత్వం (2010), శతాబ్దాల సూఫీ కవిత్వం (2011), 1901 నుండి నోబెల్ కవిత్వం (కవుల కవిత్వ – జీవిత విశేషాలు) – పాలపిట్ట వ్యాసాలు – (2013), 1901 నుండి సాహిత్యంలో నోబెల్ మహిళలు – సోపతి వ్యాసాలు – (2015), అదే గాలి (ప్రపంచ దేశాల కవిత్వం – నేపధ్యం) – మిసిమి వ్యాసాలు – (2016), భరతవర్షం – సీతాకాంత మహాపాత్ర ఒరియా కావ్యానికి తెలుగు అనువాదం. – (2017), చర్యాపదాలు (అనేక భాషల ప్రధమ కావ్యం – పదవ శతాబ్దపు మహాయాన బౌద్ధుల నిర్వాణ గీతాలు) – (2019), అదే నేల (భారతీయ కవిత్వం – నేపధ్యం) – (2019), అదే కాంతి (మధ్యయుగంలో భక్తి కవిత్వం, సామాజిక నేపథ్యం) – (2022) – వీరి స్వీయ అనువాద రచనలు.
వీరి రచనలు అనేకం – పలు భారతీయ భాషలలోకి, ఆంగ్లంలోకి అనువాదమయ్యాయి.
దేశదేశాల కప్పల కథలు – (2010), నిన్ను నువ్వు చూసుకునే అద్దం (సూఫీ, జెన్ ఇతర నీతి కథలు) – (2015), వ్యక్తిత్వ వికాసం – ఆనంద మార్గాలు (వ్యాసాలు) – (2018), అనువాదం – అనుభవాలు (మహాంద్ర భారతి ప్రచురణ) – (2019) – వీరి కథలు, ఇతర రచనలు.
తెలుగు విశ్వవిద్యాలయం కీర్తి పురస్కారం, తాపీ ధర్మారావు పురస్కారం వంటి ఉత్కృష్ట పురస్కారాలెన్నింటినో పొందారు.