ఇటీవల పరమపదించిన పాత్రికేయ దిగ్గజం “డా. జి.యస్. వరదాచారి” గారికి శ్రద్ధాంజలి కవిత అందిస్తున్నారు “పద్య కళాప్రవీణ”, “కవి దిగ్గజ” డా. ఆచార్య ఫణీంద్ర.
~
శ్రీ “గోవర్ధన” వంశ రత్నమయి, సచ్ఛీలంబె తత్త్వంబు గాన్ –
సాగించెన్ తన జీవితమ్ము శుచిగా, సత్పాత్రికేయుండునై!
భూగోళంబున ఎక్కడేమయిన తా నుద్బోధకంబౌ గతిన్
యాగంబట్టుల నిర్వహించె రచనా వ్యాసంగమున్ సర్వదా!
నాటి నిజాము కాలమున, నవ్య పథంబున తెల్గు పత్రికా
వాటిని ఉద్భవించె – మన భాష మహోన్నతి, సత్య సంధతన్
దీటుగ గుండె నిల్పుకొని దీక్షను బూనుచు పాత్రికేయుడై –
మేటిగ అంచెలంచెలుగ మించుచు శ్రీ “వరదాహ్వయుం” డహో!


“ఆంధ్ర జనత”, పిదప “ఆంధ్ర భూమి” యనెడు
పత్రికల ఘనముగ ప్రతిభ తోడ
తీర్చిదిద్దినట్టి ధీశాలి! “ఈనాడు”
పత్రిక “సహ బాధ్య వరుడు” నయ్యె!
“సుందర వరదాచారి”యె
ఎందరికో స్ఫూర్తి నిచ్చె – ఈ భువి వార్తల్
తొందరగా, అందముగా
పందిరి అల్లినటు వ్రాయ పత్రికలందున్!
ప్రేమగ పాత్రికేయులను బిల్చుచు, ధైర్యము గూర్చు! వారి సం
క్షేమము కోసమై సతము చింతన జేయు! విశిష్ట నాయక
త్వామల దీక్షతో నిలిచి హక్కుల సాధన లక్ష్య సిద్ధికై
ధీమతియౌచు సల్పు కృషి! ధీరుడు, దక్షుడు నాయకుండుగాన్!
తెలుగు విశ్వవిద్యాలయ దీప్తి పెంచ,
“పత్రికా రచన”ను పట్టభద్ర విద్య –
మొదటి గురువయి ఏర్పర్చి, ముప్పదేండ్లు
పాఠములను బోధించిన పండితుండు!
పాత్రికేయ సంఘాలకు పరమ గురుడు;
పెక్కు “సర్కారు కమిటీల” వెలయు వేత్త;
బహుళ సత్కార, బిరుదాల ప్రాప్త ఘనుడు
అమర పురి కేగె నిపుడు! శ్రద్ధాంజ లిదియె! #
Photo Courtesy: Internet

డా. ఆచార్య ఫణీంద్ర తెలుగు కవి, సాహిత్య విమర్శకుడు, పరిశోధకుడు. వృత్తిరీత్యా శాస్త్రవేత్త. మెకానికల్ ఇంజనీరింగ్ లో పట్టభద్రుడు. తెలుగులో డాక్టరేట్ డిగ్రీని ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి “19వ శతాబ్దంలో తెలుగు కవిత్వం” అనే విషయంపై సిద్ధాంత వ్యాసాన్ని సమర్పించి సాధించారు. ముకుంద శతకం, పద్య ప్రసూనాలు, ముద్దుగుమ్మ, మాస్కో స్మృతులు, వరాహ శతకం, తెలంగాణ మహోదయం వంటి పద్యకవితా గ్రంథాలను రచించి మంచి పద్యకవిగా గుర్తింపు పొందారు. తెలుగు సాహిత్యంలో “మాస్కో స్మృతులు” పేరిట ‘తొలి సమగ్ర విదేశ యాత్రా పద్య కావ్యా’న్ని రచించారు. తెలుగు వచన కవిత్వ సాహిత్యంలో “ఏక వాక్య కవితల” ప్రక్రియకు ఆద్యులు. ఆయన రచించిన తొలి ఏక వాక్య కవితల గ్రంథం “Single Sentence Delights” పేరిట ఆంగ్లంలోకి అనువదించబడింది.
ఆయన అనేక అవార్డులు, గౌరవాలను ప్రభుత్వం, ఇతర సాంస్కృతిక సంస్థల నుండి పొందారు. ప్రధానంగా – ‘వానమామలై వరదాచార్య’ స్మారక పురస్కారం, ‘దివాకర్ల వేంకటావధాని’ స్మారక పురస్కారం, ‘పైడిపాటి సుబ్బరామశాస్త్రి’ స్మారక పురస్కారం, ‘ఆచార్య తిరుమల’ స్మారక పురస్కారం, ‘బోయినపల్లి వేంకట రామారావు’ స్మారక పురస్కారం, “రంజని – విశ్వనాథ” పురస్కారం, ‘సిలికానాంధ్ర’ గేయ కవితా పురస్కారం, మూడు సార్లు విజయవాడ ‘ఎక్స్ రే’ పురస్కారాలు, ‘కమలాకర ఛారిటబుల్ ట్రస్ట్’ నుండి “వైజ్ఞానిక రత్న” పురస్కారం, పలుమార్లు రాష్ట్ర ప్రభుత్వ ‘ఉగాది’ సత్కారాలు పేర్కొనదగినవి. ఆయన 2012లో తిరుపతిలో జరిగిన ప్రపంచ తెలుగు మహాసభలలోనూ, 2014 లో అమెరికాలో, అట్లాంటాలో జరిగిన “నాటా” తెలుగు సభలలోనూ గౌరవింపబడ్డారు. ఆయన హైదరాబాదులో వి.ఎల్.ఎస్. లిటెరరీ అండ్ సైంటిఫిక్ ఫౌండేషన్ నుండి “పద్య కళా ప్రవీణ” బిరుదుని పొందారు. తూర్పుగోదావరి జిల్లా, ఏలూరు లోని నవ్య సాహిత్య మండలి నుండి “కవి దిగ్గజ” బిరుదుని పొందారు. హైదరాబాదులోని నవ్య సాహితీ సమితి నుండి “ఏకవాక్య కవితా పితామహ” పురస్కారాన్ని పొందారు. ఆయన ప్రస్తుతం “యువభారతి” సాహిత్య సంస్థకు అధ్యక్షులుగా, “నవ్య సాహితీ సమితి”కి అధ్యక్షులుగానూ, “నండూరి రామకృష్ణమాచార్య సాహిత్య పీఠం” కు ప్రధాన కార్యదర్శిగానూ ఉన్నారు. ఆయన ఆంధ్ర పద్య కవితా సదస్సు యొక్క పత్రిక “సాహితీ కౌముది” కి పదేళ్ళపాటు సహసంపాదకులుగా వ్యవహరించారు. ఆయనకు 2013 సంవత్సరానికి గాను తెలుగు విశ్వవిద్యాలయం వారు ‘పద్య కవిత్వం’లో “కీర్తి పురస్కారం” ప్రదానం చేసారు. 2017 లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన “ప్రపంచ తెలుగు మహాసభల”లో డా. ఆచార్య ఫణీంద్ర “పద్య కవి సమ్మేళన” అధ్యక్షులుగా వ్యవహరించి సత్కరించబడ్డారు.