నువ్వు పుస్తక పరీమళమై వ్యాపిస్తావు!
రాశి ఫలాలు, వంటలూ వార్పులు, ఆరోగ్య సూత్రాలూ
పెద్ద బాలశిక్షలై సంచరిస్తుంటావు!
కొండపల్లివో, గొల్లపూడివో, గ్రంధివో
పుస్తక బేహారివై ప్రయాణీకుల మధ్య
పఠనాసక్తిని రగిలిస్తావు!
కొందరికి కాలక్షేపానివై
మరి కొందరికి జ్ఞాననేత్రమై కన్పిస్తావు!
కళ్ళున్న కబోదుల్ని కదిలిస్తావు!
చెయ్యెత్తి యాచించకుండా అభిమానధనుడవై
నీ కాళ్ళ మీద నీవు అందనంత ఎత్తులో నిలుస్తావు!
సకల భోగభాగ్యాలూ అనుభవిస్తున్నా
సమస్త అంగాలు సక్రమంగా పనిచేస్తున్నా
భూములను భోంచేస్తూ రైతుల ప్రాణాలను హరిస్తూ
నిమ్మకు నీరెత్తని నికృష్టుల కంటే –
నువ్వు ఉత్కృష్టంగా కనిపిస్తావు!
నీ ఆత్మ విశ్వాసం ముందు
నా సానుభూతి నీరుగారిపోతుంది!
అప్రయత్నంగా నా చేయి పర్సును తాకుతుంది!
నీ చెంతనున్న పుస్తకం నన్ను చేరి
నా మస్తకానికి హాయినిస్తుంది!
(శాతవాహన రైలులో పుస్తకాలమ్మే అంధ యువకుడు వెంకన్న కోసం)

సాదనాల వేంకట స్వామి నాయుడు ప్రముఖ సినీ గేయ కవి, నటుడు, గాయకుడు, పత్రికా సంపాదకుడు. ఉత్తమ ఉపాధ్యాయుడు, వ్యాఖ్యాత, డబ్బింగ్ కళాకారుడు.
- ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి 2011లో బంగారు ‘నంది’ని బహుమతిగా అందుకున్నారు.
- భారత ప్రభుత్వ పర్యావరణ అటవీ మంత్రిత్వశాఖ నుంచి వచన కవితకు జాతీయస్థాయి బహుమతిని 1994లో స్వీకరించారు.
- తెలుగు విశ్వవిద్యాలయం నుంచి ‘కృష్ణాపత్రిక సాహిత్య సేవ’ లఘు సిద్ధాంత వ్యాసానికి బంగారు పతకాన్ని 1991లో అందుకున్నారు.
- ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి 2011లో ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం పొందారు.
- 1989లో జీసీస్ క్లబ్ ‘అవుట్స్టాండింగ్ యంగ్ పర్సన్ అవార్డు’, 1990లో ‘రోటరీ లిటరరీ అవార్డు’ లను పొందారు.
- దృశ్య కవితా సంపుటికి రెండు రాష్ట్రస్థాయి పురస్కారాలను అందుకున్నారు.
- ఆకాశవాణి ‘సుగమ్ సంగీత్’ జాతీయ కార్యక్రమంలో రెండు సార్లు సాదనాల రాసిన లలిత గీతాలు దేశంలోని అన్ని ఆకాశవాణి కేంద్రాల నుంచి ప్రసారమయ్యాయి.
- దక్షిణమధ్య రైల్వే నుంచి ఉత్తమ ఉద్యోగిగా సీనియర్ డి.పి.వో, డి.ఆర్.ఎం, సి.పి.వోల నుంచి పలుమార్లు అవార్డులను అందుకున్నారు.
- నాయుడు బావ పాటలు ‘గేయసంపుటి’ ‘పూలాచావ్లా’ పేరుతో ఒరియాలో సంపుటిగా ప్రచురింతమయ్యింది. ఆంగ్లభాషలోకి అనువదింపబడింది.
- తెలుగులో నాలుగు గ్రంథాలను ప్రచురించారు.
- రేడియో, టీ.వి, సినిమా, ఆడియో కేసట్లకు అనేక గీతాలు రాశారు.