[శ్రీమతి వి. నాగజ్యోతి రచించిన ‘సమాంతరాలు’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]


ఒకరి మనసొకరు తెలుసుకోరు
అహంభావాన్ని వదలరు
త్యాగానికి సర్దుబాటుకు
సరైన భేదం తెలుసుకోక
తమ జీవిత త్యాగం
విఫలమైందని వాపోతారు
మా గురించి తెలియకనే
ఉపమానంగా మమ్ము చూపుతారు
ఒకే ధ్యేయంగా ప్రయాణిస్తూ
ఎందరినో గమ్యానికి చేరుస్తూ
మధ్య మధ్య మేమొకరికొకరం
చేరువౌతూ మళ్ళీ దూరమౌతూ
వేరొకరి తోడుతో
నిరంతరం సమాంతరంగా
ప్రయాణం సాగిస్తే,
ఏ కోణంలో చూస్తారో మరి
ఆ భగ్న ప్రేమికులు,
ఆ కవి వరేణ్యులు,
కళ్ళ ముందు కనిపించినా కాంచని
మహానుభావులెందరో
వారి కలం మమ్మేనాడు కలపలే
అయినా మా జంట
పిన్నలకూ పెద్దలకూ కన్నుల పంటే
మమ్ము చూడగానే వారి కళ్ళలో
ఆనందం పెల్లుబుకుతుంది.
మాపై నడిచే భారమైన బండిపై
ఎందరెందర్నో మోస్తూ
తమ తమ వాళ్ళతో కలిపితే
వారు మాకిచ్చిన బిరుదు
ఎన్నటికీ కలవని రైలు పట్టాలమని.

శ్రీమతి వరికేటి నాగజ్యోతి ఆంధ్రప్రదేశ్లోని రాజమండ్రిలో జన్మించారు. పదవ తరగతి వరకే చదువుకున్న నాగజ్యోతి గారు దక్షిణ భారత హిందీ పరీక్షలలో భాషాప్రవీణ, హిందీ టైపింగ్ పరీక్షలు లోయర్, హైయ్యర్ పాసయ్యారు. వివాహానంతరం ఢిల్లీకి వచ్చి గృహస్థురాలి బాధ్యత స్వీకరించారు. సాహిత్యాభిలాషి. వీరు రాసిన కథలు, కవితలు, పద్యాలు పలు అంతర్జాల పత్రికలలో ప్రచురించబడ్డాయి.
పుస్తక సమీక్షలు కూడా చేస్తూ వుంటారు. ఇన్నేళ్ళ తరువాత కోవిడ్ కాలంలో శ్రీ పూసపాటి గురువుగారు, శ్రీమాన్ నల్లాన్ చక్రవర్తి గురువుగారి ద్వారా పద్య రచన, ప్రాథమిక వ్యాకరణం నేర్చుకున్నారు. శ్రీమాన్ నల్లాన్ చక్రవర్తి గురువుగారి సహకారంతో – ఆప్త మిత్రులు శ్రీ ధరణిగారు, సన్నిహితులు, తమ శ్రీవారి ప్రోత్సాహం వలన ‘చిట్టి తల్లి’ పద్య శతకం రాసారు.
గత పదిహేను సంవత్సరాలుగా ఉత్తర్ ప్రదేశ్ ఘజియాబాద్ నివాసి.