[శ్రీ రాచకుళ్ల విశ్వరూప చారి రచించిన ‘తందనాలు’ అనే చిన్న కవితలని పాఠకులకు అందిస్తున్నాము.]
1
భయము చెరచు పనులను
కయ్యముతో విరోధము దాపురించును
వియ్యములో సమ తూకముండాలి
నెయ్యమందు కార్యం సాధించవచ్చు అలవోకగా
2
మోసం చెయ్యకు చెడిపోతావు
వీసం ఎత్తు పని చేయలేక పోయావు
రోసం ఉంటే పనిలో రాణించు
మీసం వున్న వాడివైతే పందెము గెలిచి చూపించు
3
కర్రి వాడవని దిగులు చెందేవెందుకు
కురూపి వాడవని కృంగిపోకు
మొర్రి వున్నదని బాధ చెందకుమా
మిర్రి మిర్రి చూడకు వోదార్చినందుకు
4
జానా బెత్తెడు లేవు అంత రోషమా
కూన వైవుండి అంతేసి మాటలా
కోనసీమ కుర్రాడివై ఉండి
మీన మేషాలు లెక్కించక తొందరగా నిర్ణయించు
5
కర్రలా అంత సన్నగున్నావే
చొరవ తీసుకొని పని ప్రారంభించు
బీరాలు పోక చెప్పినపని చేసేయ్
మరలా మరలా చేయి అలవాటౌతుంది
6
నివా నన్ను కబాడీలో ఓడించేది
చేవ వుంటే బరిలోకి దిగి చూపించు
లవ లేశమైనా గట్టిగా ఆడగలగాలి
కావునే నీవు గెలవ గలిగేది
7
కంటినిండా నిద్ర ఉంటేనే ఆరోగ్యం
ఒంటినిండా దుస్తులు ఉంటేనే అందం
పంటినిండా ఎనామిల్ ఉంటేనే పటుత్వం
నోటినిండా పళ్ళు ఉంటేనే అందము
8
దడ పుట్టించే ప్రశ్న పత్రాలు
కడ దాకా చదివితేనే అర్ధం తెలుస్తుంది
వడి వడిగా వ్రాస్తేనే పూర్తి అవుతుంది
తడబడితే ప్రయోజనం లేదు
9
కోతకొచ్చినూర్చిన పంట వర్షాలపాలై పాడైంది
చెంత నున్న గొడౌన్కి మార్చ లేక పోయా
చింతించి ప్రయోజన మేముంది
చేత పైసా లేకుండా అయింది
10
పొదలోని పులి ఆహరం కోసం గాండ్రించె
రొద చేస్తూ జంతువులన్నీ పారి పోయే
కదన రంగంలోకి దూకిన పులికి
వేదనే మిగిలె చివరికి

శ్రీ రాచకుళ్ల విశ్వరూప చారి (ఆర్.వి. చారి) గారిది తెనాలి. ప్రసుతం హైద్రాబాదులో సెటిల్ అయినారు.
చారి గారు ఈ.ఎస్.ఐ. కార్పొరేషన్లో సూపరింటెండెంట్గా పనిచేసి రిటైర్ అయినారు. వారి మేనమామ గారు కీ.శే. పూసపాటి నాగేశ్వర రావు. అయన వీరబ్రహ్మేంద్ర చరిత్ర పద్య కావ్యం రచించి యున్నారు. కాగా అయన అష్టావధాని కూడా. వారి స్వగ్రామము రావెల్, గుంటూరు జిల్లా. చారి గారికి తమ మామయ్య మాదిరి పద్యాలు వ్రాయాలని కోరిక. కానీ ఛందస్సు తెలిసుండాలిగా. అందుచే వ్రాయలేక పోయారు.
కానీ నానీలు వ్రాయుటకు వారి కుమార్తె శ్రీమతి ప్రత్తిపాటి సుభాషిణి కారణం. ఆమెది బాపట్ల, గుంటూరు జిల్లా. టీచర్గా పని చేస్తున్నారు. వారు ఈ మధ్యనే ఒకానొక సంధర్బములో హైదరాబాద్ వొచ్చి తాను రచించిన ‘నిశ్శబ్ద పర్జన్యాలు’ చారిగారికి ఇచ్చారు. అవి చాలా బాగున్నాయి. అవి చదివిన తరువాత, ఆ స్పూర్తితో, నానీలు వ్రాయాలని కోరికతో చారిగారు నానీలు వ్రాసారు. పద్యాలు వ్రాయాలనే వారి కోరిక ఈ విధంగా తీరుచున్నది.