[శ్రీమతి శాంతిశ్రీ బెనర్జీ రచించిన ‘తెలుగైన స్వగతం’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]


తెలుగును ప్రేమిస్తాను
జీవన సహచరిగా భావిస్తాను
తేనెలొలుకు తెలుగు మాట్లాడుతాను
కమ్మని తెలుగు పాటలు పాడుతాను
తేట తెలుగు పదాల చిరు సవ్వడులు వింటాను
వాటిలో సరిగమల రాగాలు ఆవిష్కరిస్తాను
తెలుగులో కలలుకంటాను నవ్వుతాను దుఃఖిస్తాను
హాహాకారాలు చేస్తాను ప్రగల్భాలు పలుకుతాను
ఆలోచనలు ఆవేశాలు అనుభూతులు పంచుకుంటాను
తెలుగు చెయ్యి పట్టుకుని
మనుష్యుల మనస్సుల్లోకి తొంగి చూస్తాను
అంతరంగాలను అర్థం చేసుకుంటాను
తెలుగులో నన్ను నేను వెతుక్కుంటాను
నా సుఖదుఃఖాలను అన్వేషిస్తాను
తెలుగు సాహిత్యాన్ని అక్కున చేర్చుకుంటాను
మానవ జీవితాగాధాలను శోధిస్తాను
వైవిధ్యభరిత జీవితాలను చిత్రిస్తాను
ప్రపంచానికి దగ్గరవుతాను
తెలుగు నా తృష్ణ
తెలుగు నా ఊపిరి
జీవనానంద లహరి
పరుగులెత్తే సజీవ వాహిని
అనుబంధాల వెన్నెల వెలుగు

శాంతిశ్రీ బెనర్జీ గుంటూరులో పుట్టి పెరిగారు. ఎమ్.ఏ. వరకు వారి విద్యాభ్యాసం అక్కడే జరిగింది. జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ, ఢిల్లీలో ఎమ్.ఫిల్. చేశారు. తీన్మూర్తి భవన్, డిల్లీలో నెహ్రూకు సంబంధించిన ‘సెలెక్టెడ్ వర్క్స్ ఆఫ్ జవహర్లాల్ నెహ్రూ’ ప్రాజెక్ట్లో అసోసియేట్ ఎడిటర్గా పనిచేసి వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నారు. అప్పటినుండి కథలు, కవితలు, వ్యాసాలు, ట్రావెలాగ్స్ రాస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్లో ఉంటున్నారు. 2022 జూలైలో వారి కథా సంపుటి ‘మానుషి’, కవితా సంపుటి ‘ఆలంబన’ వచ్చాయి.