[తెలుగు సాహిత్యం పట్ల కొన్ని తరాలలో ఆసక్తి రగిలించి, ఆధునిక తరానికి వ్యక్తిత్వ వికాస పాఠాలు చెప్తూ, యువతకు ఉత్తమ సాహిత్యం ద్వారా ఉత్తమ వ్యక్తిత్వాన్నివ్వాలని నిరంతరం తపించే యువభారతి సంస్థ స్థాపించి వచ్చే దసరాకు 60 సంవత్సరాలు పూర్తవుతాయి. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని తెలుగు సాహిత్యానికి, సమాజానికి యువభారతి చేసిన సేవను తెలుగు పాఠకులకు పరిచయం చేసే ఉద్దేశంతో ప్రతి ఆదివారం సంచికలో యువభారతి ప్రచురించిన పుస్తకాల పరిచయం వుంటుంది. ఈ శీర్షిక వచ్చే విజయదశమి వరకూ సాగుతుంది.]
వ్యాస సాహితీ సంహిత
భారతీయుల కవితా ప్రతిభకు సంకేతం వాల్మీకి రామాయణం. భారతీయుల బహుముఖీన విజ్ఞాన సంపదకు సంకేతం వ్యాస మహర్షి రచించిన పురాణేతిహాసాలు. వాల్మీకిని, వ్యాసుణ్ణి అధ్యయనం చేయనివాడు భారతాత్మను దర్శించలేదు. పుట్టినది మొదలు గిట్టు వరకు భారతీయుల బ్రతుకులను, ఆలోచనలను ప్రత్యక్షంగానో, పరోక్షంగానో నేటికీ ఈ మహామనీషుల సందేశాలు ప్రభావితం చేస్తున్నాయి. ఎన్ని కథలకు, ఎన్ని నాటకాలకు, ఎన్ని జాతీయాలకు, ఎన్ని పదబంధాలకు, ఎన్నెన్ని న్యాయాలకు, ఎన్నెన్ని శబ్దాలకు, ఎన్నెన్ని సంకేతాలకూ పురుడు బోసినవీ మహితాత్ముల రచనా సామర్థ్యాలు !!


పురాణాలలో లేనిది ఎక్కడా లేదు. అంతటా ఉన్నది పురాణాలలోనే ఉన్నది. ఐతే వాటిని అధ్యయనం చేసి కాలానుగునంగా వ్యాఖ్యానించుకొని అనుసరించడంలోనే ఔచిత్యం ఉంది గానీ – గుడ్డిగా అనుకరించడంలో లేదు. అనుకరణలో వికసితమైన వివేకం ఉండదు. అనుసరణంలో మేల్కొన్న వివేకం జాడలు కనిపిస్తాయి. వాల్మీకి వ్యాసులను చదవనిదే వెయ్యేళ్ళ తెలుగు కావ్యాల పంటలు చేతికందవు – నోటికందవు – మనసుకు పట్టవు.
వ్యాసుని బహుముఖీన విజ్ఞానాన్ని తొమ్మిది విభాగాలుగా వింగడించి, వాటిపై విజ్ఞుల చేత ఉపన్యాసాలు ఏర్పాటు చేసి, వాటిని ‘వ్యాస సాహితీ సంహిత’ గా మలచి పాఠక లోకానికి అందించింది యువభారతి.


క్రింద ఇవ్వబడిన link ను క్లిక్ చేసి ఈ పుస్తకాన్ని ఉచితంగానే చదువుకోండి.
లేదా క్రింద ఇవ్వబడిన QR code ను scan చేసినా ఈ పుస్తకాన్ని ఉచితంగా చదువుకోవచ్చు.



శ్రీ పత్రి అశ్వనీ కుమార్ గారి నివాసం నవీ ముంబై, మహారాష్ట్ర.
విద్యాభ్యాసం అంతా విజయవాడ లోనే జరిగింది. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం నుండి MBA పట్టా పుచ్చుకుని, ఉద్యోగార్ధం హైదరాబాద్ వచ్చిన తర్వాత యువభారతి సంస్థతో (1982) నలభై ఏళ్ళ అనుబంధం.
వృత్తిరీత్యా రిలయన్స్ ఇండస్ట్రీస్ లో Finance & Accounts లో Senior Management Team లో పనిచేసి 2016 లో పదవీ విరమణ చేసినా, ప్రవృత్తి మాత్రం – సంగీత సాహిత్యాలే. ప్రస్తుతం ఒక Youtube Channel కి Voice Over artiste గా, స్వరమాధురి సంగీత సంస్థకు అధ్యక్షునిగా వారి విశ్రాంత జీవితాన్ని బిజీ గా, ఆనందంగా గడుపుతున్నారు.