నిర్జన నిశ్శబ్ద నీరవ నిశీధిలో
నీ తలపుల కొలిమిలో కాగుతున్నాను!
నీ కోసం పరితపిస్తున్నాను, పలవరిస్తున్నాను!
మనం గడిపిన మధుర క్షణాలు
నన్ను వెంటాడుతున్నాయి
ఈ నిరామయ గాడాంధకారంలో
అందుకే నీకై ఈ ఆవాహన!
ఒహ్! ఒక్కసారి వచ్చిపో కనికరంతో
నిద్రలేమి దాని పాత్రను సక్రమంగా పోషిస్తుంది
సజల నయనాలు చెక్కిళ్ళను నిమురుతున్నాయి
ఇప్పుడు మన మధ్య అనుసంధాన కర్తలెవ్వరూ లేరు
ఈ సంభాషణ ఇరు ఆత్మల తంతిలోనే!
నా యెద నిండా నువ్వే నిండాక
ఇక నాకోసం యోచించే తావెక్కడిది?
నీవు నీ స్మృతులే నాకిప్పుడు పంచప్రాణాలు
నీ ఊసులూ, బాసలే అన్నపానాలు
నా మనోవేదనను ఉపశమింపజేసి
శాంతినీ, క్రాంతినీ కలిగించేది – నీ రాకే!
నా దుఃఖాన్ని దిగమ్రింగేది – నీ వెచ్చని స్పర్శే!

సాదనాల వేంకట స్వామి నాయుడు ప్రముఖ సినీ గేయ కవి, నటుడు, గాయకుడు, పత్రికా సంపాదకుడు. ఉత్తమ ఉపాధ్యాయుడు, వ్యాఖ్యాత, డబ్బింగ్ కళాకారుడు.
- ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి 2011లో బంగారు ‘నంది’ని బహుమతిగా అందుకున్నారు.
- భారత ప్రభుత్వ పర్యావరణ అటవీ మంత్రిత్వశాఖ నుంచి వచన కవితకు జాతీయస్థాయి బహుమతిని 1994లో స్వీకరించారు.
- తెలుగు విశ్వవిద్యాలయం నుంచి ‘కృష్ణాపత్రిక సాహిత్య సేవ’ లఘు సిద్ధాంత వ్యాసానికి బంగారు పతకాన్ని 1991లో అందుకున్నారు.
- ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి 2011లో ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం పొందారు.
- 1989లో జీసీస్ క్లబ్ ‘అవుట్స్టాండింగ్ యంగ్ పర్సన్ అవార్డు’, 1990లో ‘రోటరీ లిటరరీ అవార్డు’ లను పొందారు.
- దృశ్య కవితా సంపుటికి రెండు రాష్ట్రస్థాయి పురస్కారాలను అందుకున్నారు.
- ఆకాశవాణి ‘సుగమ్ సంగీత్’ జాతీయ కార్యక్రమంలో రెండు సార్లు సాదనాల రాసిన లలిత గీతాలు దేశంలోని అన్ని ఆకాశవాణి కేంద్రాల నుంచి ప్రసారమయ్యాయి.
- దక్షిణమధ్య రైల్వే నుంచి ఉత్తమ ఉద్యోగిగా సీనియర్ డి.పి.వో, డి.ఆర్.ఎం, సి.పి.వోల నుంచి పలుమార్లు అవార్డులను అందుకున్నారు.
- నాయుడు బావ పాటలు ‘గేయసంపుటి’ ‘పూలాచావ్లా’ పేరుతో ఒరియాలో సంపుటిగా ప్రచురింతమయ్యింది. ఆంగ్లభాషలోకి అనువదింపబడింది.
- తెలుగులో నాలుగు గ్రంథాలను ప్రచురించారు.
- రేడియో, టీ.వి, సినిమా, ఆడియో కేసట్లకు అనేక గీతాలు రాశారు.