[డాక్టర్ చక్రపాణి యిమ్మిడిశెట్టి రచించిన ‘అనుభవాల కడలి’ అనే కవితని అందిస్తున్నాము.]


ఇప్పుడు కాలం రేఖలన్నీ రంగులద్దుకుని
రంగవల్లికలై అలరారుతున్నాయి.
బుడిబుడి అడుగులనాటి నుండి
నడుంవంగినా నడుస్తున్న నేటివరకూ
దాటివచ్చిన తోవంతా పచ్చగానే కనిపిస్తుంది
అమాయకపు గుర్తులు చెరిగిపోలేదు
నలుపుతెలుపు చిత్రాలు మాసిపోలేదు
వెనకటి జ్ఞాపకాలలోకి తొంగిచూస్తే
కలలవంతెనలు వేసినవి కొన్ని
కరచాలనంతో నడిపించినవి కొన్ని
గుండె కలుక్కుమనిపించినవి మరికొన్ని
మందహాసాలతో కొన్ని చిందులేస్తున్నాయి
నా కళ్ళముందే తెరలుగా కదిలిపోతున్నాయి
స్నేహం భుజంమీద ధీమాగా చేయివేసి
కలయతిరిగిన ఓ కమ్మని లోకం
అనుంబంధాల వాకిళ్ళలో ప్రతినిత్యం
పరామర్శల పరిమళాలు వెదజల్లిన కాలం
బాధ్యతల కావిళ్ళు మోసుకొచ్చిన క్షణాలు
కవ్వించిన వేళలూ, మచ్చలుమిగిల్చిన గాయాలూ..
నిద్రలోకి జారుకొనే సమయం దగ్గరైంది
చూడగలిగే పగళ్ళెన్నున్నాయో తెలీదు
జ్ఞాపకాల తరంగాలే ఊతంగా చేసుకు
అనుభవాల కడలిలో మునిగితేలుతున్నా

డా. చక్రపాణి యిమ్మిడిశెట్టి విశాఖజిల్లా అనకాపల్లిలో 3.9.1954 న లక్ష్మీకాంతం, రాధాకృష్ణ దంపతులకు జన్మించారు. ఎం.కాం.,ఎం.ఫిల్.,పి.హెచ్.డి, హిందీ సాహిత్యరత్న విద్యార్హతలు. అనకాపల్లి వర్తకసంఘ లింగమూర్తి కళాశాల వాణిజ్యవిభాగంలో 1976 లో లెక్చరర్ గా ప్రవేశించి రీడర్గా పదోన్నతి పొంది 2012 సెప్టెంబర్లో శాఖాధిపతిగా పదవీవిరమణ.
గ్రంథాలయాల పట్ల, పుస్తకాల పట్ల అభిరుచి పెరిగింది వారి అన్నగారి వలన. 1970 నుంచి తన భావాలకు అక్షరరూపం యివ్వటం ప్రారంభించారు. ఆ ఆసక్తి కవితలు,గేయాలు రాయటానికి దోహదమైంది. అందరిలాగే ఆయననూ శ్రీ శ్రీ గారి మహాప్రస్థానం ప్రభావితం చేసిందని చెబుతారు.
రంగుల చినుకులు, నెలవంక, కవచం పలుకే బంగారమాయే – కవితాసంపుటులు వెలువరించారు. ప్రస్తుతం కన్వీనర్, అనకాపల్లి సాహితీమిత్రులు.