భారత జాతీయతావాదం, చైతన్యం
మొదటి ప్రకరణము – ఏడవ అధ్యాయము-2
యువ హిందువులకు బయటకి కనపడే దాని కన్నా వారికి ఇవ్వబడే దాని కంటె, స్వీకరించేది ఎక్కువగా ఉంటుంది. ఒక కొత్త స్వభావాన్ని అలవర్చు కోవడంలో వారు శిక్షణ పొందుతారు. జాతీయవాదంలో, స్వీయరక్షణా స్ఫూర్తితో ఎదురు తిరగడమే అత్యంత అవసరమని వారు ఆలోచించేలా తీర్చిదిద్దబడతారు. భౌతికంగా, మానసికంగా ఒక తిరుగుబాటుకు వారు సిద్ధం చేయబడతారు. భౌతిక సంసిద్ధత అవసరమే. కాని అది మాత్రం చాలదు. చిన్న పిల్లలకు వ్యాసాలు రాయమని ఇలా విషయాలు ఇస్తారు – “ఐదారు మంది బందిపోటు దొంగలు అర్ధరాత్రి మీ మీద దాడి చేశారనుకోండి. మిమ్మల్ని మీరు ఎలా కాపాడుకుంటారు? మీ నాన్నగారు అప్పుడు ఏం చేస్తారు? మీ అమ్మగారు, మీ చెల్లెలు, మీరు ఏం చేస్తారు? లేదా ఒక వేళ దోపీడీ దొంగలు వచ్చి పడితే, మీ ఇల్లు సులభంగా మీరు వారిని ఎదుర్కునే విధంగా కట్టబడిందా? అలా లేకపోతే, మీ యింటిని మరింత దుర్భేద్యంగా చేసుకోవడానికి ఏ మార్పులు చేస్తే బాగుంటుందో ఊహించండి”. అలాంటి వ్యాసాలు వ్రాయడం ద్వారా, ప్రమాదం ప్రతి రోజూ పొంచి ఉంటుందని ఆలోచించే అలవాటు నేర్చుకుంటారు (అది చాలా చోట్ల ఉన్నదే). ఒక హిందువుగా, వారిలో ప్రతి ఒక్కరు ఎప్పుడూ సిద్ధంగా ఉండాలని, వారు గ్రహిస్తారు. ఒక వేళ దాడి జరిగితే, తమను తాము రక్షించుకోవడానికి వారు ఏం చేయాలో అర్థం చేసుకుంటారు (ఎందుకంటే వారికి రక్షించడానికి ప్రభుత్వంగాని, పోలీసులుగాని, ఎవరూగాని వుండరు),(వారి యింటిని, వారి కుటుంబ సభ్యులను).
తన ఊర్లోని హిందువులు, ప్రమాదమే కనుక, ఎదురైతే ఆ హిందూ యువకుల వైపే చూస్తారు. ఎందుకంటే అతడు శిక్షణ పొందినది, ఆ ధర్మాన్ని నిర్వర్తించటానికే. అలా, హిందూ యువకులు, మొత్తం తమ దేశ రక్షణ అంతా తమ వ్యక్తిగత బాధ్యత అని భావించే అలవాటును అలవర్చుకుంటారు. ఆ భావనను వారు, కనీసం బంగాల్లో, సంవత్సరాల తరబడి మర్చిపోయారు.
ఆత్మరక్షణ అనే కళలో శిక్షణ పొందిన వారిపై, మనం అనుకున్న సామాజిక సంస్కరణలను రుద్దాల్సిన పనిలేదు.
చేతివేళ్లు మాములుగా ఐతే విడివిడిగానే ఉంటాయి. కాని చేయి ఒక ముష్టిఘాతం ఇవ్వాలంటే, తక్షణం ఒకటిగా బిగుస్తుకుంటాయి. అలాగే, కుల స్పృహ, వర్గ స్పృహ, తెగ స్పృహ అనేవి అవంతట అవే వెనక్కు తోసివేయబడతాయి, విడిగా ఉన్న హిందువులందరూ ఒక్కటవుతారు. ఎప్పుడు? తిరుగుబాటు భావన వారిలో బలంగా రూపుదిద్దుకున్నపుడు!
హిందువులలో, తరతరంలో, ఈనాటి వరకు ఎందరో సంఘ సంస్కర్తలు, దైవాంశ సంభూతులు వచ్చారు. వారు కుల వైషమ్యాల వల్ల కలిగే చెడు ఫలితాలను తొలగించడానికి ప్రయత్నించారు. కాని.. సఫలీకృతులు కాలేదు. రామ్ మోహన్ రాయ్ కాలేదు, శ్రీ గౌరంగ కాలేదు, సర్వమానవుల్లో ఇద్దరో ముగ్గురో గొప్పవారుంటే, అందులో ఒకడైన సాక్షాత్ బుద్ధుడే సఫలం కాలేదు! వారి బోధనల ఫలితం, విభిన్న కొత్త మత విశ్వాసాలు ఏర్పడడం అయింది, ఒక శాశ్వతమైన సామాజిక క్రమం ఏర్పడటానికి బదులు. కాని వారిలో ఒకరు ఆ మార్పును తేగలిగారు. ఆయనే గురుగోవిందసింగ్. ప్రపంచంలో, హైందవత్వం రక్షించబడటానికి ఆయన కృషి చేశారు. రెండున్నర శతాబ్దాల క్రిందటే పంజాబులోని హిందువులు పూర్తిగా నశించకుండా ఆయన వారిని కాపాడాడు. అలాంటి మార్పును ఆయన, తన శిష్యులను ఒక సైనిక సమాజంగా వ్యవస్థీకృతం చేయడం ద్వారా తీసుకురాగలిగాడు. వారి వారసులు ఇంకా అదే స్ఫూర్తినే కొనసాగిస్తున్నారు.
ఒక పౌర జనాభా యొక్క సామాజిక దృక్పథం మారడం కష్టం. కాని ఒక సైనిక జనాభా తన దృక్పథాన్ని ఇట్టే మార్చుకుంటుంది, తన అలవాట్లను యుద్ధావసరాలకు అనుగుణంగా “ప్రజలు నా గురించి ఏమనుకుంటారు? నా బంధువుల స్పందన ఎలా ఉంటుంది?” ఇలాంటి ప్రశ్నలు ఒక సైనికుని మనసులోకి అసలు రావు. సైనిక జీవితం ఒక కొత్త సమాజాన్ని సృష్టిస్తుంది. ఒక కొత్త రకమైన బంధాన్ని, ఒక కొత్త సౌభ్రాతృత్వ భావాన్ని, ఒకే రకమైన కష్టాలను, ప్రమాదాలను పాలుపంచుకుంటూ, ఒకే అదేశాలను శిరసావహిస్తూ, ఒకే వైపు పోరాడే వారందరినీ, ఆ సౌభ్రాతృత్వంలో భాగం చేస్తుంది. అలాంటి పరిస్థితి ఏర్పడినప్పుడు పౌర జీవితంలోని సంప్రదాయాలు, వైషమ్యాలు, విస్మరించబడతాయి. యుద్ధరంగంలోని సైన్యం జీవితంలో ఎందుకూ అర్థం లేని భావాలు, అలవాట్లు, ఆచారాలు, ఎందుకూ పనికిరానివి, అవసరం లేనివనిపిస్తాయి. అంతే కాదు అవి అసౌకర్యాన్ని కలిగిస్తాయి. సైన్యం ఉమ్మడి చర్యకు అవి విఘ్నాలవుతాయి. ప్రయత్న పూర్వకంగా వదలివేయబడతాయి. ఉదాహరణకు, పౌరజీవితంలో, చాలా మంది హిందువులు, తక్కువ కులాల వారితో కలిసి భోజనం చేయకుండా ఉండడం ఒక ధర్మంగా భావిస్తారు. కాని, హిందువుల్లో పది విభిన్న కులాలకు చెందిన వారు, ఏదో ఒక రోజు, తమ ఉమ్మడి ఆత్మరక్షణ కోసం, ఒక ఉమ్మడి వ్యవస్థాగత సైనిక జీవితపు క్రమశిక్షణ క్రిందికి వస్తే, వారు పదిరకాల వంటపాత్రలను తాము వెళ్ళిన చోట కంతా తీసుకుని వెళ్లరు, ఎవరి అన్నం వారు వేరు వేరుగా వండుకుంటానికి, వారు అలా ఆలోచించడాన్ని కూడా అసౌకర్యంగా భావిస్తారు. అప్పుడు విభిన్న కులాల వారు కలసి భోం చేస్తే పాపమనే భావన అదంతట అదే సమసిపోతుంది. కొత్త జీవితం కొత్త స్వభావాన్ని కలుగజేస్తుంది.
అక్కడక్కడా, హిందూ యువక బృందాలను సైనికపరంగా, వ్యవస్థీకరించాలని ప్రయత్నించే వారి లక్ష్యం, నిస్సందేహంగా, అవసరమైనప్పుడు పోరాటపటిమ చూపేందుకు సిద్ధంగా ఉండే, సుశిక్షితమైన హిందూ సైనిక వ్యవస్థను తయారు చేయడమే. కాని, హైందవత్వం అంతటా అలాంటి అవిభక్త, జాతీయభావపూరిత, ఆత్మనిర్భర, శక్తివంత, నూతన జీవం తొణికిసలాడే, నూతన స్వభావం గల సైనిక శక్తిని నిర్మించడానికి ఇంకా ఎంతో చేయాల్సి ఉంది. హిందువులను తిరుగుబాటుకై జాగృతం చేయడానికి, క్రమశిక్షణతో కూడిన ఒక చర్యకు వారిని అలవాటు పడేలా చేయడానికి, ఒక ఏకమొత్తంగా, యుద్ధరంగంలోని సైన్యంలా, నిరంతరం, వారు ఎటువంటి ప్రమాదాన్ని ఎదుర్కోడానికైనా సిద్ధపడేలా చేయడానికి, అలా వుంచడానికి, ఇంకా చాలా చేయాల్సి ఉంది.
సైనిక శిక్షణ పొందిన హిందూ యువకులు తమ ప్రభావాన్ని కేవలం తర్వాతి తరాల హిందువుల మీదే కాకుండా (అది చాలా ఆలస్యం కావచ్చు), వారి ఈ తరపు పెద్దలపైనా, పాతతరం పైన కూడా చూపుతారు. అది సహజం. ఒక వరుసలో కవాతు చేయడం, కలసి తినడం, కలిసి ఆడడం, కలిసి జాతీయజెండాకు వందనం చేయడం, ఆజ్ఞలను శిరసావహించడం, నేర్చుకున్న తర్వాత, వారు తమ ఇండ్లకు తిరిగి వెళతారు. ప్రతి గ్రామంలో, వారు కొత్త హిందూ సైన్యాన్ని నిర్మిస్తారు. అంతే కాదు, హిందూ కుటుంబ పరిధిలోకి హిందూ సైనిక వ్యవస్థ యొక్క ఆదర్శాలను, సిద్ధాంతాలను, సుగుణాలను తీసుకొని వస్తారు. వారి సోదరులకు, సోదరీమణులకు, నాన్నలకు, అమ్మలకు, హిందూ గౌరవాన్ని, జీవితాన్ని, ఆస్తిని రక్షించడంతో ప్రారంభమయ్యేదే అతి ముఖ్యమైన మెట్టు అని విశదపరుస్తారు. అది హిందూ గృహరక్షణతోనే మొదలవుతుంది. అదే అత్యంత అవసరం. తిరుగుబాటు అనేదే సుగుణమని, సహన శీలత కాదని చెబుతారు. హిందువుల ఇంటి ప్రాంగణంలోని ప్రతి కుటుంబ సభ్యుడిని, ఏ ముట్టడి జరిగినా, ఎదుర్కొనేలా తమను తాము సమీకరించుకునేలా చేస్తారు. చిన్న పిల్లల నుండి వృద్ధుల వరకు ప్రతి ఒక్కరు, ఎటువంటి అవమానాన్నైనా ఎదుర్కొనేందుకు, ప్రమాద పరిస్థితిలో, ముందుగానే దాన్ని ఎదుర్కోన్నేందుకు సంసిద్ధంగా ఉండడం తమ విధి అని తెలుసుకుంటారు. బిడియము గల హిందూ బాలికలను, స్త్రీలను, ఆత్మనిర్భరత, ఆత్మరక్షణ కలిగి ఉండాలని ప్రేరేపిస్తారు. ప్రస్తుతం వారు తమ ఇంట్లోనే, ఒక గదిలోంచి ఇంకో గదిలోకి – చీకట్లో వెళ్లడానికి భయపడే స్థితిలో ఉన్నారు. ప్రతి హిందువు ఇల్లు ఒక చిన్న కోట అవుతుంది. ప్రతి గ్రామం లోని హిందువులందరూ విడిది చేసిన సైనిక శిబిరంలా తయారవుతారు. సైనిక శిక్షణ పొందిన హిందూ యువకులు ఆవిధంగా మొత్తం పౌర సమాజాన్ని, ఒక శాశ్వత సైనిక శక్తిగా తయారు చేస్తారు. అది గనుక సాధించ బడకపోతే, తాము అల్ప సంఖ్యాకులుగా ఉన్న చోట, హిందువులకు మనగలిగే ఆశ లేదు. ఉత్తర, తూర్పు బెంగాల్ లాంటి ప్రాంతాల్లో, అది ఏ మాత్రం ఆలస్యం కాకుండా సాధించబడాలి. అది, హిందువులకు జీవన్మరణ సమస్య.
వారి జీవితాన్ని, స్వభావాన్ని, అలా మార్చుకోవడం ద్వారా, వారు రెండు రకాలుగా వారికి బలాన్ని సమకూర్చే వనరులను పొందుతారు. అవి, ఒకటి సంసిద్ధత, రెండవది ఐక్యత. ఆ రెండూ లేకపోవడంమే, గతం నుండి ఇప్పటి వరకు వారి అన్ని ఆపదలకూ కారణం. సంసిద్ధత అనేది అసలు ప్రమాదం ఏమిటనే స్పృహ, దీనికి సరైన సైనిక శిక్షణ తోడు కావాలి. ఐక్యత అనేది, హిందువులందరూ, తామంతా ఒక వర్గం అనే భావాన్నుండి ఏది తమను దూరంగా ఉంచుతుందో, దాన్ని త్యజించడం. ముఖ్యంగా, కఠినమైన కులపట్టింపులు ఒక వైపు, మితిమీరిన ప్రాంతీయ వాదం ఒక వైపు. ఈ రెండింటినీ హిందువులు వదిలెయ్యాలి.
విస్తృతమైన, హిందూ సైనిక వ్యవస్థతో, ప్రతి రోజూ సంబంధాలు నెరపడం ద్వారా, హిందూ జనాభా మొత్తం, ప్రమాదం, దాన్ని ఎదుర్కొనే సంసిద్ధత పట్ల జాగరూకులు అవుతారు. అంతే కాదు మరింత ఏకీకరణ చెందుతారు. సైనికీకరణ చెందడం అంటే ఏకీకరణ చెందడమే. హిందూ సైనిక వ్యవస్థలోని తల్లిదండ్రులు, బంధువులు, స్నేహితులు, పరిచయస్థులు, ఒక్కసారి దాని స్ఫూర్తితో ప్రభావితులైతే, వారు కొత్త పురుషులుగా, స్త్రీలుగా మారతారు. ఆత్మరక్షణ, దేశ రక్షణల గురించి వారు ఆలోచించినప్పుడు [మొత్తం హైందవత్వం అంతా ఒక దేశమని, హైందవేతర సోదరులు కూడా, (వారు తాము హిందువులమని వారు మరచిపోయారు) హిందువులే అని వారు భావించినప్పుడు,] వారి అలవాట్లు, పెద్ద ఇబ్బంది లేకుండానే మారిపోతాయి. వారి విలువలు, ప్రమాణం పూర్తి భిన్నంగా ఉంటుంది. హిందువుల వ్యవస్థకు, రక్షణకు అవరోధంగా ఉన్న ఏ సాంఘికాచారమైనా, వారి స్వీకారానికి వ్యతిరేకమైనది ఏదైనా, ఎవరైనా భారతీయుడు, తమతో నిజమైన భారతీయ సంస్కృతిని, నాగరికతను పంచుకోవడం అసౌకర్యంగా వేగంగా భావిస్తూంటే, అది తనంతట తానే, మన యువ హిందూ సైనిక అన్వేషకుల వల్ల, క్షీణించిపోతుంది.
హిందూ సమాజం, ఆత్మరక్షణను తన తొలి అవసరంగా పరిగణిస్తూ, అత్యంత శీఘ్రంగా ఒక సైనిక స్ఫూర్తిని రగిలించుకోగలిగితేనే ఇది సాధ్యం.
మతం చేత మంజూరు చేయబడినవిగా నమ్మబడుతున్న ఆచారాలను అటుంచితే, అత్యంత సాధారణ, అప్రధాన ఆచారాలను మార్చేయడం అంత సులభం కాదని మనకు తెలుసు. కాని భారతీయుల దైనందిన జీవితంలో కొన్ని సందర్భాలున్నాయి. అటువంటి ఆచారాలను కూడా, అయోమయపు వేగంతో, పక్కన పెట్టేస్తున్నారు. ఉదాహరణకు, ఒక హిందువు కొడుకు, అప్పుడే ఒక ఉపకారవేతనాన్ని పొంది, ఇంగ్లాండుకు వెళ్లి, తన చదువును కొనసాగించాలనుకుందాం. అప్పుడు ఛాందసుడైన ఆ తండ్రి తన చాదస్తాన్ని వదిలి పెట్టి, తన కొడుకుకు బొంబాయి వరకు వెళ్లి, వీడ్కోలు పలుకుతాడు. ఎంత ఆశ్చర్యకరం? ఆ యువకుడు ఓడలో కాలు మోపిన నాటి నుండి, అతనికి తనవైన జీవిత నియమాలను పాటించడం అసాధ్యం అవుతుంది. అతడు మాంసాహారం, కొవ్వు లాంటవి ముట్టడు, సందేహం లేదు. కాని అతడు తినే పళ్లాలలో గిన్నెలలో ఎన్ని సార్లు, ఎంత మందికి ఆవు కొవ్వు వడ్డించి ఉంటారో ఎవరు చెప్పగలరు? అయినా సరే, ఆ ఛాందసుడైన హిందూ తండ్రి అతన్ని పంపక మానడు. పైగా అలా వెళ్లడం చాలా అవసరంగా, ఎంతో ముఖ్యంగా భావిస్తాడు.
హిందువులు, ఒక ఐక్య క్రమశిక్షణ పూరిత కార్యాచరణకు అవరోధంగా, జాతీయ రక్షణకు అడ్డుగా నిలుస్తున్న వాటిని ఎప్పుడు వదిలేస్తారు? విస్తృతమైన సైనిక అలవాట్లు, వారిలో మరింత విస్తృతమైన సైనిక దృక్పథాన్ని కలిగించినప్పుడు, జాతీయ రక్షణ, (ఆత్మరక్షణతో ప్రారంభమయేది) వారి విధుల్లో కెలా అత్యున్నతమైనది ఐనప్పుడు, ఐక్య కార్యాచరణ ఒక అవసరం ఐనపుడు. అప్పుడే, (దాని కంటే ముందు కాదు) హైందవత్వం మనుగడ సాగించే స్థితిలో ఉంటుంది, తన గమ్యాన్ని, భారతదేశ గమ్యాన్ని తన చేతుల్లో తీసుకోగలుగుతుంది, సంఖ్యాపరంగా తాను మైనారిటీగా ఉన్న ప్రాంతాల్లో సైతం.
ఎక్కడైనా అల్లర్లు చెలరేగితే, అరడజను మంది ముస్లిములు, కర్రలు, రాళ్లు పట్టుకుని, వంద మంది హిందువుల ఊరేంగిపును చెల్లా చెదరు చేస్తారు. అల్ప సంఖ్యాకులైనా, ఆయుధాలు కలిగి, సంసిద్ధులై ఉంటే, నిరాయుధులైన, సిద్దంగా లేని గుంపును సులభంగా అధిగమించగలరు. హిందువులు నిరాయుధులుగా ఎందుకున్నారు? సంసిద్ధులుగా లేరు కాబట్టి. వచ్చి ఎప్పుడైనా మీద పడే ప్రమాదం పట్ల వారికి అవగాహన లేదు కాబట్టి. తమ శత్రువులు ఉపయోగించే, అలాంటి కర్రలు, రాళ్లలాంటి ఆయుధాలనే వారు కూడా ఉపయోగించకుండా వారిని ఎవరూ ఆపలేరు (ప్రస్తుతం, బ్రిటిష్ సైన్యం తప్ప, మిషన్ గన్లను ఎవరూ ఊపయోగించలేరు. ఆ విషయంలో, హిందువులు, హైందవవేతరులు ఒకటే) హిందువుల్లో లేనిది ఆయుధాలు కాదు, ఐక్యత, సంసిద్ధత, సైనిక స్ఫూర్తి. దాని వల్లే, పెద్దగా చెప్పడానికి లేని ఆయుధాలు కూడా లేని తమ శత్రువులను వారు ఎదుర్కోలేకపోతున్నారు. సంసిద్ధత, ఐక్యత అనేవి జతగూడితే, సంఖ్య బలం గొప్ప శక్తి అవుతుంది. మరో రకంగా కాలేదు.
ఎక్కడ హిందువులు తక్కువ సంఖ్యలో ఉంటారో, అక్కడ వారంతా సైనికులుగా మారితే, సుశిక్షతులై, సంసిద్ధులైతే, వారు తమను తాము రక్షించుకోవడము మాత్రమే కాకుండా, పరిస్థితిని తమ అదుపులోకి తీసుకోగలిగిన వారు కూడా అవుతారు. అలాంటి సమయం వస్తూ ఉంది.
మనం ఇంతకు ముందు, ఒక అయోమయపు కాలం రాబోతుందని (త్వరలోనో, తర్వాతో), అప్పుడు సమర్థవంతమైన ప్రభుత్వం, కొంత కాలం భారతదేశంలో ఉండదు.
అప్పుడు, ఉత్తర తూర్పు బెంగాల్లో కూడా, ఇంకా హిందువులు నిరాశలో ఉన్న మైనారిటీలుగా ఉన్న కొన్ని అలాంటి ప్రాంతాలలో, వారు భారతదేశానికి యజమానులవుతారు. వారు వ్వవస్థీకృతులై, సిద్ధంగా ఉంటే. అప్పుడు పోలీసులు ఉండరు. వారే పోలీసులుగా వ్యవహరిస్తారు. దేశమంతటా శాంతి భద్రతలను నెలకొల్పుతారు. అప్పుడు హిందూ సైనిక శక్తే, ఒకే ఒక ప్రభుత్వం అవుతుంది. తర్వాత ఏం జరుగుతుందనేది ఇప్పుడే చెప్పలేము. కాని మనం ఒకటి మాత్రం ఆశించవచ్చు. తక్కువ వ్యవధిలో, నిస్సహాయ సమూహంగా, మిగిలిపోయిన వారు, అంత సులభంగా లొంగిపోరని, అదే మనం సూచిస్తున్నది.
అలాంటి అనుభవం తర్వాత, హిందువులకు ఒనగూడే శక్తి, అధికారం, గర్వం, మరి ఊహించడానికి కూడా వీలులేనంత గొప్పగా ఉంటుంది. సంధికాలంలో, ప్రభుత్వం లేనప్పుడు, హిందూ సైనిక శక్తి చేత రక్షించబడిన భారతీయ ముస్లింములు, క్రైస్తవులు సైతం, హిందూ పరిధిలోకి తిరిగి రావచ్చు. అదీ అధిక సంఖ్యలో. అప్పుడు మతావేశం, నిజమైన భారత జాతీయవాదానికి వేగంగా తావునిస్తుంది. అది ఏం చేయగలదో చూసినప్పుడు, ప్రపంఛం యావత్తూ, బలంగా పునరుత్పత్తి చెందిన భారతదేశాన్ని గౌరవిస్తుంది.
అలా, హిందువులు, సంపూర్ణ స్వాతంత్ర్యాన్ని అనుభవిస్తూ, విజేతలుగా మారి, సమున్నత భారతదేశాన్ని పునర్నర్మిస్తారు. అందులో ఆశ్చర్యం ఏమీ లేదు. అట్లే, ఏదో ఒక రోజు (వారి ప్రత్యక్ష లేదా పరోక్ష ప్రభావం ద్వారా) ఆర్యుల సనాతన వాదం, పాశ్చాత్యదేశాల్లో కూడా పునరుద్ధరించబడే స్వప్నం, ప్రస్తుతం అసాధ్యం అనిపించినా, సాకారం కావచ్చు. అందులో కూడా ఆశ్చర్యం లేదు.
ఏం జరుగగలదో, ఏం జరుగవచ్చో ఎవరికీ తెలియదు. ఒక తరుణ దేశానికి, అది బలంగా ఉండాలంటే, అన్ని ఆశలూ సహజమే.
హైందవత్వాన్ని వ్యవస్థీకృతం చేయడం ద్వారా, ముందు మనం నిజమైన భారతదేశాన్ని పునఃబలోపేతం చేద్దాం.
జైహింద్!

శ్రీ పాణ్యం దత్తశర్మ 1957లో కర్నూలు జిల్లా వెల్దుర్తిలో పుట్టారు. తండ్రి శతావధాని శ్రీ ప్రాణ్యం లక్ష్మీనరసింహశాస్త్రి. తల్లి శ్రీమతి లక్ష్మీనరసమ్మ. టెంత్ వరకు వెల్దుర్తి హైస్కూలు. ఇంటర్, డిగ్రీ, ఎం.ఎ. (ఇంగ్లీషు), ఎం.ఎ. (సంస్కృతం), ఎంఫిల్, పిజిడిటియి (సీఫెల్), ప్రయివేటుగానే.
దత్తశర్మ ఇంటర్మీడియట్ విద్యాశాఖలో లెక్చరర్గా, ప్రిన్సిపాల్గా, రీడర్గా, ఉపకార్యదర్శిగా సేవలందించారు. కవి, రచయిత, విమర్శకులు, గాయకులు, కాలమిస్టుగా పేరు పొందారు. వీరివి ఇంతవరకు దాదాపు 50 కథలు వివిధ పత్రికలలో ప్రచురితమై వాటిలో కొన్ని బహుమతులు, పురస్కారాలు పొందాయి.
వీరు ‘చంపకాలోచనమ్’ అనే ఖండకావ్యాన్ని, ‘Garland of poems’ అన్న ఆంగ్ల కవితా సంకలనాన్ని, ‘దత్త కథాలహరి’ అన్న కథా సంపుటాన్ని ప్రచురించారు. వీరి నవల ‘సాఫల్యం’ సంచిక అంతర్జాల పత్రికలో 54 వారాలు సీరియల్గా ప్రచురితమై, పుస్తక రూపంలో ప్రచురింపబడి అశేష పాఠకాదరణ పొందింది. 584 పేజీల బృహన్నవల ఇది. ‘అడవి తల్లి ఒడిలో’ అనే పిల్లల సైంటిఫిక్ ఫిక్షన్ నవల సంచిక డాట్ కామ్లో సీరియల్గా ప్రచురించబడింది.
వీరికి ఎ.జి రంజని సంస్థ కవి సామ్రాట్ విశ్వనాథ పురస్కారాన్ని, ‘తెలంగాణ పాయిటిక్ ఫోరమ్’ వారు వీరికి ‘Poet of Profundity’ అన్న బిరుదును, బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంవారు వీరి సిద్ధాంత గ్రంథానికి అవార్డును, సి.పి. బ్రౌన్ సమితి, బెంగుళూరు వారు వీరికి ‘NTR స్మారక శతకరత్న’ అవార్డును బహూకరించారు.
ఇద్దరు పిల్లలు. ప్రహ్లాద్, ప్రణవి. కోడలు ప్రత్యూష, అల్లుడు ఆశిష్. అర్ధాంగి హిరణ్మయి. సాహితీ వ్యాసంగంలో రచయితకు వెన్నుదన్నుగా ఉన్న గురుతుల్యులు, ప్రముఖ రచయిత వాణిశ్రీ గారు. వీరు – తమ సోదరి అవధానం లక్ష్మీదేవమ్మ గారు, మేనమామ శ్రీ కె. సీతారామశాస్త్రి గార్లకు ఋణగ్రస్థులు.