రంగనాథం మనసు కుడితిలో పడ్డ ఎలుకలా గిల, గిల లాడసాగింది..
అచేతనంగా వచ్చి మంచంలో వాలిపోయాడు. తాను చేసిన నేరమేమిటో బోధపడ్డం లేదు. తన అర్థాంగి అనసూయమ్మ శాశ్వతంగా సెలవు తీసుకున్న తరువాత పరిణామాలు కళ్ళల్లో కదలాదసాగాయి..
***
ఆరోజు అనసూయమ్మ సంవత్సరీకం..
భోజనాల అనంతరం బంధువులు వెళ్తూ.. వెళ్తూ.. పదో, పరకో.. రంగనాధం చేతిలో పెడ్తున్నారు. ప్రక్కనే కూర్చున్న ఇరువురు కొడుకులు డబ్బును లెక్కిద్దామన్నట్టుగా వంగి, వంగి చూడసాగారు. రంగనాథం చూసీ చూడనట్లు గమనించ సాగాడు.
రాత్రి పడుకోబోయే ముందు కొడుకులిద్దరూ కూడబలుక్కొని తండ్రితో సమావేశమయ్యారు. ఎలా మొదలు పెట్టాలా..! అన్నట్లుగా పెద్దకొడుకు కోదండం తమ్ముని వంక చూశాడు. కానివ్వమన్నట్టుగా కామేశం తలూపేసరికి ధైర్యంగా విషయం కదిలించాడు కోదండం.
“నాన్నా.. తమ్ముడు నేను కలిసి ఒక నిర్ణయం తీసుకున్నాం. మీకు గూడా సమ్మతంగానే ఉంటుంది” అంటూ ప్రారంభించాడు. “నాన్నా.. అమ్మ పోయాక మీరు ఇక్కడ ఒంటరిగా ఉండడం మాకెవ్వరికీ నచ్చడం లేదు. మీరు చెయ్యి కాల్చుకోవడం మీ కోడళ్ళు బాధ పడ్తున్నారు” అంటూ ఇంకా చెప్ప బోతున్న పెద్ద కొడుకు మాటలను మధ్యలోనే అడ్డుకుంటూ..
“చూడు బాబు. మీ నిర్ణయం ఏమిటో నేను ఊహించగలను. ప్రతీ ఇంట్లో ఇది మామూలే, మీరు అడిగే వరకు రాగూదడనే నేను ఈ వీలునామా వ్రాసి ఉంచాను. మీ నిర్ణయం ప్రకారం నేను మీదగ్గరే ఉంటాను. నాకు మీరు గాక మరెవ్వరున్నారు” అని వీలునామాతో బాటు మరో కవరు చేతికిచ్చాడు రంగనాథం.
‘ఇదేంటి నాన్నా..” అంటూ కవరు తీసుకుంటూ అడిగాడు కామేశం.
“ఇందాక మన బంధువులు నాకిచ్చిన కట్నాలు.. ఇవి గూడా నాకెందుకు? వాని కంటే విలువైన వాళ్ళు నా మనుమలూ, మనుమరాండ్లు” అంటూ చిరునవ్వు నవ్వేడు.
తాము ఊహించిన దాని కంటే అధిక ప్రయోజనమే జరిగిందన్నట్లు వీలునామా చదువుతూ పెడ్తున్న కోదండం ముఖకవళికలను చదువసాగాడు కామేశం.
“మీ ఇష్టమే నాన్నా. మేము ఎప్పుడు కాదన్నామని..” అంటూ తృప్తిగా లేచి పడక గదుల్లోకి పరుగెత్తారు. ఈ విషయం వారి, వారి అర్ధాంగుల చెవుల్లో ఊదాలని.
రంగనాథం మనసు తేలిక పడి లేచి వెళ్ళి తన మంచంలో వాలి పోయాడు.
మూడు నెలలు దాటినా కొడుకుల ముచ్చట లేదు.
ఫోన్ శబ్దానికి ఆలోచనల నుండి తెప్పరిల్లాడు రంగనాథం.
***
‘నాన్నా మిమ్మల్ని తీసుకు వెళ్దామని ప్రయత్నిస్తూనే ఉన్నాం. ఇంతలో కరోనా వైరస్ మూలాన నిన్న లాక్డౌన్ ప్రకటించారు. భౌతిక దూరం పాటిస్తున్నాం. వస్తామన్న నమ్మకం లేదు’ అంటూ వాట్సాప్ మెసేజ్ చూసి మంచంలో అలాగే అతుక్కు పోయాడు రంగనాథం.
పరిచయం
పేరు: చెన్నూరి సుదర్శన్,
విద్య; ఎం.ఎస్సి, ఎం.ఫిల్ ( గణితశాస్త్రం),
DAST ( Diploma in Advanced Software Technology – CMC)
పుట్టిన తేది: 18-08-1952 ( 69 సం.లు)
తల్లి దండ్రులు: చెన్నూరి లక్శ్మి, చెన్నూరి లక్శ్మయ్య.
పుట్టిన స్థలం: హుజురాబాదు (అమ్మమ్మగారిల్లు) కరీంనగర్ జిల్లా
స్వస్థలం: ములుగు, ములుగు జిల్లా.
ఉద్యోగం: 1976-1982 టెలీఫోన్ ఆపరేటర్
1982-2008 జూనియర్ లెక్చరర్ (గణితశాస్త్రం)
2008-2010 ప్రిన్సిపాల్, ప్రభుత్వ జూనియర్ కళాశాల నంగునూరు, సిద్దిపేట
2010 ఆగష్టు – పదవీ విరమణ.
అభిరుచులు: చిత్రలేఖనం, కార్టూన్లు గీయడం, సుద్దముక్కలపై శిల్పాలు, సూక్ష్మ కళ, రచనావ్యాసాంగం
రచనలు: దాదాపు 120 కథలు, 50 కార్టూన్లు, 100 కవితలు.
ప్రచురణలు: 1. ఎంసెట్-ప్రశ్నావళి (తెలుగు, ఆంగ్లమాధ్యమం) 2. ఝాన్సీ, హెచ్.ఎం (కథల సంపుటి) 3. మహాప్రస్థానం (కథానికల సంపుటి) 4. జీవన చిత్రం (ఆత్మకథ) 5. ప్రకృతిమాత ( పిల్లల కథలు) 6. జీవన గతులు ( కథా సంపుటి) 7. జర్నీ ఆఫ్ ఏ టీచర్ (నవల) ధారావహికంగా ‘అచ్చంగా తెలుగు’ మాస పత్రికలో వస్తోంది. 8. అనసూయ ఆరాటం (తెలంగాణ మాండలికంలో నవల)
9. అమ్మ ఒడి (కథా సంపుటి) 10. రామచిలుక (పిల్లల కథలు) ప్రచురణలో ఉన్నాయి.
మెప్పుకోలు: 1. ‘రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ’ (2008). 2. బెస్ట్ టెలీఫోన్ ఆపరేటర్ (1977).
3. వాలీ బాల్, బాల్ బ్యాట్మింటన్, కేరమ్స్ ఆటలలో జిల్లాస్థాయిలో బహుమతులు.
4. “యువ కవి” ప్రభుత్వ ఉన్నత పాఠశాల, ములుగులో సన్మానం
5. “హాస్య కవి” శ్రీ కరణం రాంచంద్రం మాజీ విద్యాశాఖామాత్యులతో సంగారెడ్డి లో ‘వృషనామ’ ఉగాది పండుగ(25-03-2001) సందర్భంగా సన్మానం.
పలు కార్టూన్లకు.. కథలకు బహుమతులు. శ్రీవాకాటి పాండురంగారావు స్మారక అవార్డు.
6. యాదగిరి టీవీ. చ్ఛానల్లో ‘సాహితీ సౌరభాలు’ కార్యక్రమంలో నా ఇంటర్వ్యూ ప్రసారం.
7. పలు కథలు రేడియోలలో.. ప్రసారం. ‘పోటువ’ కథ పై సమీక్ష సి.వి.ఆర్. టీ.వీ.లో..
8. గిడుగు రామమూర్తి పంతులు సాహితీ పురస్కారం
ప్రస్తుత చిరునామా: చెన్నూరి సుదర్శన్.
1-1-21/19, ప్లాట్ # 5, రోడ్ #1, శ్రీ సాయి లక్ష్మీ శోభా నిలయం,
రాంనరేష్ నగర్, హైదర్నగర్,
హైద్రాబాదు- 500 085 (తె.రా.)
చరవాణి : 94405 58748
email: sudarshan.chennoori@gmail.com