[జూలై 21 గురుపౌర్ణమి సందర్భంగా శ్రీ గొర్రెపాటి శ్రీను రచించిన ‘గురుదేవో భవ!’ అనే కవితని పాఠకులకి అందిస్తున్నాము.]


తప్పేమైనా చేస్తే సున్నితంగా మందలిస్తూ
మనలో దాగిన అజ్ఞానమనే చీకటిని పారద్రోలేలా
మానవతా జ్యోతులు వెలిగించే వెలుగుదివ్వెలు గురువులు!
నలుగురితో సఖ్యతగా, సన్నిహితంగా, ఆత్మీయంగా
ఎలా మసలుకోవాలో సూచించే సన్మార్గదర్శకులు గురువులు!
జ్ఞానామృతాన్ని ప్రసాదించే వాళ్ళు గురువులు!
తమ బోధనలతో
మనలో పాఠాలపై శ్రద్దాసక్తులు కలిగించే
ఉత్తములు,స్ఫూర్తిప్రదాతలు గురువులు!
సందేహం ఎంతటి క్లిష్టమైనదైనా ఇట్టే తీర్చే
జ్ఞాన గుణవంతులు గురువులు!
తమ శిష్యుల అభ్యున్నతే గురుదక్షిణగా భావించే
మహోన్నత మానవతామూర్తులు..
ఇలలో వెలసిన దైవ స్వరూపులు సద్గురువులు!

గొర్రెపాటి శ్రీను అనే కలం పేరుతో ప్రసిద్ధులైన రచయిత జి.నాగ మోహన్ కుమార్ శర్మ డిప్లమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ (బి.టెక్) చదివారు. వీరి తల్లిదండ్రులు శాంతకుమారి, కీ.శే.బ్రమరాచార్యులు.
ఓ ప్రైవేటు సంస్థలో డిప్యూటీ మేనేజర్గా పని చేస్తున్న రచయిత హైదరాబాద్ బాలనగర్ వాస్తవ్యులు.
‘వెన్నెల కిరణాలు’ (కవితాసంపుటి-2019), ‘ప్రియ సమీరాలు’ (కథాసంపుటి-2021) వెలువరించారు. త్వరలో ‘ప్రణయ దృశ్యకావ్యం’ అనే కవితాసంపుటి రాబోతోంది.