[డా.టి.రాధాకృష్ణమాచార్యులు రచించిన ‘కొత్త పూల కాంతి’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]


వేదన గాయాల మట్టి రక్తసిక్తం ఈడ
గుడిసెలు పడిపడి రోదించే ఊరు
నిద్రిస్తున్నది చీకటి కిటికి ఎండిని చెరువు నీడ
చేతికందిన ముద్ద దిగలేదు గొంతు దాటి
ఆకలి అరుపులది నిత్య గోలే విశ్వంలో
ఏ మార్పు తీర్చని మాట రోదన వ్యథ
భిక్షకు తను పాపం కొత్త
తికమక అడవి నింపదు కడుపు
కాపలా ఇల నిజం లేని డొల్ల సాగుబడి
నిరుపేదల ఇళ్లూ నోళ్ళూ కాదు
కూల్చేది పేదరికం మూలాలు
యోజనకూ యోచనకూ మనసు కరువు
మనుగడ లేని ఊహలూగే ఉట్లు
ఆశలీదే లోయల తొట్లు
మూసిన కనుల దారి మెట్లు
స్వార్థం తెరిచిన వరద గోదారి గేట్లు
నీవేకాదు
వాడు కూడా ఉన్నాడని ఓ మనిషీ
చెమట గుర్తుచేస్తుంది
ఆత్మీయ ఏరువాకే తెస్తుంది
నీలోనాలో వేదన రోదనల్లేని
కొత్త పూల కాంతి ప్రపంచాన

డా.టి.రాధాకృష్ణమాచార్యులు సీనియర్ వైద్యులు, ప్రముఖ కవి,రచయిత, అనువాదకులు, సమీక్షకులు.
5 సంకలనాలు తెలుగు కవిత్వంలో 1999 నుండి కరీంనగర్ నుండి పబ్లిష్ చేశారు. నలిమెల భాస్కర్ ‘సాహితీ సుమాలు’ వివిధ భారతీయ భాషల్లోని సాహితీవేత్తల పరిచయ సంకలనాన్ని “The Speaking Roots” Title తో ఆంగ్లంలోకి అనువాదం చేసినారు.