[డా. సి. ఉమా ప్రసాద్ గారి ‘ప్రాచీన మధ్యయుగపు వాగ్గేయకారుల సారస్వత పరిచయం’ అనే ఫీచర్ అందిస్తున్నాము.]


క్షేత్రజ్ఞుడు – మూడవ భాగం:
క్షేత్రయ్య – అన్నమయ్య:
తేట తెనుగు పదాల కూర్పులలోను, తన భావవ్యంజనంలోను సంగీత కల్పనలోను స్వతంత్రమైన మార్గము తొక్కి పదరచన చేసినప్పటికీ, క్షేత్రయ్య రచనలను, అన్నమాచార్యుల రచనలను ప్రక్క ప్రక్కన పెట్టుకొని చదివే వారికి తెలుగు నుడికారంలోను, భావవ్యక్తీకరణంలోను అక్కడక్కడ సంఘటనలు నేర్చుకోవడంలోను, నాయికా నాయక స్వభావ నిరూపణంలోను సామ్యము కనపడక మానదు.
అన్నమాచార్యుడిని క్షేత్రయ్య అనుకరించాడని అనుకోవడం కంటే, విస్తృతంగా కృషి చేసిన ఒక పూర్వ వాగ్గేయకారుని రచనలను లెస్సగా చదివియో, పాడుకుని ఉన్న సత్ఫలితం క్షేత్రయు రచనలతో ప్రతిఫలించినదని చెప్పడం సమంజసం.
క్షేత్రయ్య – అన్నమయ్య పోలికలు:
క్ర.సం. | క్షేత్రయ్య | అన్నమయ్య |
1 | వలపనే దెటువంటి వస్తువో తెలియదే | నాకుంజెప్పరె వలపు నలుపో తెలుపో |
2 | అక్కరో, నను బాసినందు కాడితి నింతే..
మేరగాదు రమ్మనవే నా సామిని మొరతోపు శాయక మువ్వగోపాల సామిని |
మొక్క లాన నీవు మొరతోపు లాడంగాను |
3 | కోడికూసెనయ్యయో | కొండలో కోవెల కుయ్య |
4 | అవి యొక్క యుగము | అటు కొంత కాలంబు |
5 | ఆడపుట్టువు పుట్టు నన్నల యింతుర | ఆడదాని బ్రతుకింత ఆరడి కదా ? |
6 | ఏమిసేతు కన్నెప్రాయము | ఏమిసేతు నా భాగ్యము |
7 | ఊరకుండ లేక..
సొలసి నే నేమైన |
చిత్తరువు వ్రాయబోతే |
8 | ఇంత తెలిసి యుండి | కట కటా అయ్యో కాంతనెంత యేపుదురా |
9 | మానినిరో చేర రమ్మని | ఏటి పొందు యేటి గుణము |
జయదేవుని అష్టపదులందలి సంస్కృత భాష కంటెను క్షేత్రయ్య భావగాంభీర్యమును వ్యక్తపరచుటలో రచనా చాతుర్యము మరి ఏ యితర వాగ్గేయకారునకు లేదు అని చెప్పవచ్చు ఆని శ్రీ సీతాపతిగారు వ్రాసిన ప్రశంస అతిశయోక్తి కాదు.
క్షేత్రయ్య మితిమీరిన స్వానుభన శృంగారమైన, కృష్ణ మంత్రోపదేశము పొంది కృష్ణ భక్తుడై, మధుర పద్ధతిలో తానే నాయికగా, గోపాలుడు నాయకుడిగా, పదాలు రచించి జీవాత్మ పరమాత్మానుసంధాన తత్వాన్ని కూడా ‘ఇద్దరి సందున పవళించియున్న ఇంతి వేరెవరురా’ వంటి పదాలలో వ్యంగ్యంగా చొప్పించినాడు. నాయికా నాయకులిద్దరూ జీవాత్మాపరమాత్మలు. సందున నున్న ఇంకొక యువతి మాయ.
క్షేత్రయ్య వాడిన లోకోక్తులు కొన్ని:
- అనుకో పనేమున్నది? అరటాకు ముల్లు సామ్యమైనందు కిప్పుడు
- కలిపోసిన నుట్టివంకలు చూచే వయ్యయో
- తోటకూర దొంగవలె తొలగిపోయేవాడవు
- పామాడి జోగివలె పోయెనా బ్రతుకు
- బావిలోని నీరు వెల్లువ పోయ్యీనటవే
- పదరి వానికి నీకు బోయపగల వలెనే యుండెనే
- నే నొకటి తలచితే దైవమొకటి తలచినందుకు
- వలపు సిగ్గెరుగదు
- ఇంట గెలిచి రచ్చ గెలువవలెను
- ఏరు గడిచితే పుట్టి వానికే పొమ్మన్నమాట నిజమాయె
- పైడి చేతికి వచ్చినదే చాలు నటవే
- చేతి కాసు లేదు, గాని చే సైగలే
- ఊరికి పోయిన మగడు ఉట్టిపడ్డట్లు వచ్చి
- ఇతడి సొమ్ములు వ్యెట్టిన బంగార మౌన, చలి వడగండ్లు ముత్యమౌన
~
సాహిత్య కవులలో శ్రీనాథుని పైనీ, చేమకూర వేంకటకవి పైనీ క్షేత్రయ్యకు గౌరవమున్నట్లు ఈక్రింది పద్యాలలోనే పలుకుబళ్లు అతని పదాలలో కన్పించడాన్ని బట్టి తెలుసుకోవచ్చు.
క్షేత్రయ్య: కాయజుని తలిరుపదను కత్తులమ్మ యీ చెలులు
శ్రీనాథుడు: కంచి యరవత లసమాస్త్రు ఖడ్గలతలు
చేమకూర: ఎగు బుజంబుల వాడు మృగరాజు మధ్యంబు/పుడికి పుచ్చుకొను నెన్నడుము వాడు/……. /మెరుగు చామన చాయ మేనివాడు.
~
ముఖ్య వాగ్గేయకారుల ముద్రలు – భాషలు:
వాగ్గేయకారు | ముద్ర | భాష |
క్షేత్రయ్య | మువ్వగోపాల | తెలుగు |
సారంగపాణి | వేణుగోపాల | తెలుగు |
మువ్వలూరు సభావతి అయ్యర్ | రాజగోపాల | తెలుగు |
ఘనం శీనయ్య | మన్నారామ | తెలుగు |
సుబ్బరామయ్యర్ | సుబ్బరామన్ | తమిళం |
ఘునం కృష్ణయ్యర్ | ముత్తుక్కుమార లేక వేలార్ | తమిళం |
కలి కుంజర భారతి | కలికుంజర | తమిళం |
(ఇంకా ఉంది)

డా. సి. ఉమా ప్రసాద్ గారు పుట్టింది, పెరిగింది రాజమండ్రి. వారి స్థిర నివాసం హైదరాబాద్. తల్లి తండ్రులు – కీ.శే: M.V. రంగా చార్యులు, M. ప్రమీలా దేవి. అత్తామామలు: కీ. శే.డా. సి. ఆనందా రామం, శ్రీ రామా చార్యులు.
భర్త: సి. బదరీ ప్రసాద్(రిటైర్డ్ సీనియర్ మేనేజర్ ఆంధ్రా బ్యాంక్). ఉమా ప్రసాద్ ఉపాధ్యాయురాలిగా (M A ఎకనామిక్స్ ఆంధ్రా యూనివర్సిటీ) పని చేశారు. వారి ప్రవృత్తి సంగీతాభిలాష (పిహెచ్డి ఇన్ మ్యూజిక్ పద్మావతి మహిళా యూనివర్సిటీ).
భావ కవితలు, స్వీయ సంగీత రచన, రాగల కూర్పు, పుస్తక పఠనం వారి అలవాట్లు. వివిధ సంగీత పత్రికలలో- సంగీత రచన వ్యాసాలు మరియు కవిత్వ ప్రచురణాలు, లక్ష గళార్చన ప్రశంసా పత్రం, తెలుగు బుక్స్ ఆఫ్ రికార్డ్స్ లో కవిత్వ ప్రచురణ పురస్కారాలు.
గురువులు: విజయవాడ సంగీత కళాశాలలోని అధ్యాపకులైన అందరి గురువులు, శ్రీమతి రేవతి రత్న స్వామి గారు మొట్టమొదటి గురువు- తదనంతరం పెమ్మరాజు సూర్యారావు గారు, MV రమణ మూర్తిగారు, కిట్టప్పగారు, అన్నవరపు రామస్వామి గారు, డా. నూకల చిన సత్యనారాయణ గారు. తదితరుల ఆశీస్సులతో సంగీతంలో ఓనమాలు దిద్దుకొని సంగీతంలో పిహెచ్డి పట్టా పొందారు. “మహా సముద్రంలో ఒక నీటి బిందువు నా సంగీత -కృషి” అంటారు.
మధుర గీతికలు (రెండు భాగాలు), రస గాన లహరి, స్వర అమృతవాహిని, హనుమ కీర్తనల సమాహరం, చైతన్య భావ కవితామాలికలు, రాగరంజని (రెండు భాగాలు), భావ-రాగ-లహరి (రెండు భాగాలు), కవితామృతఝరి అక్షర తరంగిణి, అపురూప-అపూర్వ-రాగలహరి వంటి పుస్తకాలను వెలువరించారు.