[శ్రీమతి యలమర్తి అనూరాధ రచించిన ‘ప్రక్షాళన’ అనే కవిత అందిస్తున్నాము.]


మంచి నీళ్ళు వస్తున్నాయని
ఇల్లంతా నింపుకోం
కావల్సినంత పట్టుకుంటాం.
డబ్బయినా అంతే
ఆశల గుర్రాలపై దౌడు మానేసి
తృప్తి కళ్ళెంతో జీవనం సాగిస్తే
సంతృప్తి ప్రయాణం ప్రాప్తి.
పరిసరాల పరిశుభ్రత పాటిస్తాం
మనసు శుభ్రత మరచిపోతాం
కల్మషం కట్టలు కట్టలుగా పేర్చుతూ
కాలువలు కట్టిస్తాం.
అక్కర్లేని చెత్త తీసేసినట్లే
మది కాలుష్యం పారద్రోలటం
దినచర్యగా ప్రారంభిస్తే
శాంతి మనశ్శాంతీ నీ తోడే.
కళ్ళు రెండు, కాళ్ళు రెండు, చేతులు రెండు
నరాలు.. రక్త నాళాలు
అన్నీ.. అన్నీ.. ఒకటికి మించే
ఎన్నో.. ఎన్నెన్నో.. అన్నీ కలిసే
మరి మనిషిగా నువ్వెందుకు
ఒంటరి బ్రతుకు ఆస్వాదిస్తావ్?
నీ శరీరమే ఓ భగవద్గీత
‘మనమంతా ఒకటే’కి ప్రతీక
అనుసరించు! ఆచరించు.
‘మన’ వదిలి ‘మనం’తో సంచరించు
దేశ సమైక్యతకు చేతులు కలుపు!

అనూరాధ యలమర్తి సుప్రసిద్ధ రచయిత్రి. కథలు 250కి పైగా, కవితలు 500కు పైగా, వ్యాసాలు 500కు పైగా రాసారు. నాలుగు నవలలు రచించారు. వెలువరించిన పుస్తకాలు- ప్రేమ వసంతం- నవల, సంసారంలో సరిగమలు (వ్యాసాలు), వెజిటేరియన్ వంటకాలు, చిట్కాల పుస్తకం, విక్టరీ వారి పెద్ద బాలశిక్ష లో మహిళా పేజీలు 100.
శ్రీ చంద్రబాబు నాయుడి చేతుల మీదుగా రాష్ట్రస్థాయిలో ఉత్తమ సాహితీ వేత్త అవార్డు స్వీకరించారు. గుర్రం జాషువా, కొనకళ్ళ, వాకాటి పాండురంగారావు, పోతుకూచి సాంబశివరావు, సోమేశ్వర సాహితీ అవార్డుల లాంటివి 50కి పైగా అవార్డులు అందుకున్నారు.
ఆంధ్రభూమి దినపత్రికలో వీరి నవల ‘విలువల లోగిలి’ ప్రచురితమైంది. ఇంతకుముందు పచ్చబొట్టు’ సీరియల్ అందులోనే వచ్చింది.