[‘చూస్తుండగానే’ అనే కవితా సంపుటిని వెలువరించిన శ్రీమతి షేక్ కాశింబి గారి ప్రత్యేక ఇంటర్వ్యూ అందిస్తున్నాము.]


సంచిక టీమ్: నమస్కారం షేక్ కాశింబి గారూ.
షేక్ కాశింబి: నమస్కారమండీ.
~


ప్రశ్న 1. ‘చూస్తూండగానే’ కవితాసంపుటిని వెలువరించినందుకు అభినందనలు. 58 కవితలున్న ఈ సంపుటికి 16వ కవిత పేరునే శీర్షికగా ఎందుకు ఎంచుకున్నారు? వివరిస్తారా?
జ: ఈ కవిత సమాజంలో ప్రబలుతున్న మత్తుమందుల సేవనం గురించి ఆర్తితో రాసినది. ‘డ్రగ్స్’ అనేవి ఒకప్పుడు ఎక్కడో దొరికేవి. వాడే వారి సంఖ్య కూడా చాలా తక్కువగా ఉండేది. ఎప్పుడో పట్టుబడుతుండేవి. కానీ చూస్తుండగానే.. ఈ మహమ్మారి సర్వవ్యాపిగా మారి సమాజాన్ని కుదిపేస్తుంది. ముఖ్యంగా యువతరాన్ని నిర్వీర్యం చేస్తోంది. ఈ సంపుటి లోని బలమైన కవితల్లో ఇదొకటి. దీని వైపు పాఠకుల దృష్టిని ఆకర్షించే ఉద్దేశంతో ఈ పేరు పెట్టడం జరిగింది.


ఆదరించి, దారి చూపిన అన్నయ్య, వదినలు – శ్రీ షేక్ మస్తాన్ వలి, శ్రీమతి అస్మత్ ఆరా లతో కవయిత్రి
ప్రశ్న 2. “కాశింబి కవిత్వమంతా మానవీయ దృక్పథంతోనే కొనసాగుతుంది. ఇవాళ్టి అస్తిత్వవాదాల పట్ల మొగ్గు చూపలేదు. తనదైన శైలిలోనే మానవతావాదాన్ని చాటుకున్నారు. తాను కవయిత్రిగా ఎదుగుతున్న క్రమంలో ఈ ఏడేళ్ళలో మంచి పరిణతి సాధించారనే చెప్పవచ్చు” అని ముందుమాటలో డా. రాధేయ గారు వ్యాఖ్యానించారు. కవయిత్రిగా, అనువాదకురాలిగా మీ సాహిత్య ప్రస్థానం గురించి చెప్తారా?
జ: డా. రాధేయ గారి వ్యాఖ్యానాన్ని సత్యమని నమ్ముతున్నాను. ఎందుకంటే.. వారితో పాటు మరి కొందరు ప్రముఖులు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
నిజానికి నా రచనా వ్యాసంగం – నేను ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడే ప్రారంభమైంది. డిగ్రీ పూర్తయ్యే నాటికే ‘ఆంధ్రభూమి’, ‘ప్రగతి’, ‘కాలమేఘం’ (ఒంగోలు) వంటి పత్రికలలో దాదాపు 20-25 కవితలు ప్రచురింపబడ్డాయి. అడపాదడపా రాస్తున్నా – కారణాంతరాల వలన ఈ ప్రక్రియ నిరవధికంగా వాయిదా పడి – తిరిగి రిటైర్మెంట్ తర్వాత డా. సి భవానీ దేవి గారి చొరవతో పునరుజ్జీవమై, పుస్తక రూపం దాల్చింది. అప్పట్నించి నిర్విఘ్నంగా కొనసాగడం దైవకృపగా భావిస్తాను. ఇంతవరకు వచ్చిన నా రచనలు:-
- అంతశ్చేతన – తెలుగు కవితా సంపుటి 2017
- జీవితం పేరు – తెలుగు కవితా సంపుటి 2021
- చూస్తుండగానే – తెలుగు కవితా సంపుటి 2024 (ISBN NO: 978-93-340-4621-2)
- तप्तशिला (తప్తశిల) (2021) డా. సి. భవానీదేని గారి తెలుగు కథా సంపుటికి హిందీ అనువాదం – (ISBN 978-81-952225-0-6)
- फीनिक्स (ఫీనిక్స్) (2024) – హిందీ కవితా సంకలనం (ISBN: 978-13-340-1499-0)
ప్రశ్న 3. కవిత్వం అనేది మౌలికంగా అనుభూతి ప్రధానమైనది. ఎలాంటి అనుభూతులు మీ విభిన్నమైన కవితలకి ప్రేరణగా నిలిచాయి? కొన్ని ఉదాహరణలు చెప్పండి.
జ: మీరన్నది అక్షర సత్యం. నేను ఎదుర్కొన్న లేక నాకెదురైన జీవితపు భిన్న పార్శ్వాలు.. ఆయా సందర్భాల్లో నా ప్రతిస్పందనలు చాలా వరకు నా కవితలకి ప్రేరణలు. ఇందులో వ్యక్తిగతమైనవి, కుటుంబపరమైనవి, వృత్తిపరమైనవి, సమాజగతమైనవి కూడా మిళతమై ఉన్నాయి. మానవ సంబంధాల విషమతలు నన్నెక్కువగా ప్రభావితం చేశాయి. అందుకే ఈ దిశగా ఎక్కువ దృష్టి పెట్టి రాశాను..


కుటుంబ సభ్యులతో కవయిత్రి
ప్రశ్న 4. ఈ సంపుటి లోని కవితలకు ఏకసూత్రత ఉందా? ఒక్కో కవిత విడివిడిగా కనబడినా, సంపుటిలో వాటినన్నింటినీ కలిపి ఉంచిన కనబడని దారం లాంటి అంతస్సూత్రం గురించి చెప్పండి.
జ: మంచి ప్రశ్న వేశారండీ! కళ్ళ ముందు కదిలే ఆర్థిక, సామాజిక వైషమ్యాలు, మత, లింగ పరమైన వివక్షలు నన్నెక్కువ ఆర్ద్రపరిచాయి. ఆ ఆర్ద్రత నుండి, ఆ పరిస్థితుల్ని చక్కదిద్దాలనే ఆవేదన, ఆతృత, తీవ్రమైన సంఘర్షణ నుంచి నా కవిత్వం ఉద్భవించింది. కవితల శీర్షికలు, అందులో వెలిబుచ్చిన లేక చర్చించిన విషయాలు భిన్నంగా కనిపించినా.. వీటి వెనుక ఉన్న ఏకసూత్రత ఇదే. ఈ భావావేశం, ఊపిరాడనితనం – వాటి సముద్ధరణ, కనీస పరిష్కరానికి గొంతెత్తాలనే నా ఆరాటం.. ఈ రచనలకి మూలమైన దారం.
ప్రశ్న 5. కవిత్వానికి లయ ప్రధానమా? వస్తువు ప్రధానమా? భావ వ్యక్తీకరణ ప్రధానమా? మీరు దేనికి ప్రాముఖ్యతనిస్తారు?
జ: నిజానికివన్నీ ప్రభావాత్మకమైన కవిత్వానికి అవసరమే. దేని ప్రాధ్యానత దానిదే. అయితే, నేను వస్తువుకే తొలి ప్రాధాన్యత ఇస్తాను. ఈ సందర్భంలో ఆరుద్రగారి కవితా పంక్తులు గుర్తు చెయ్యడం సముచితంగా భావిస్తాను.
‘కీర్తి కోసం కాక ఆర్తి వల్ల అరిస్తే
చెప్పకుండానే ఏదో ఒక ఛందంలో
చెవికింపుగా వినసొంపుగా
కవి పలకడం ఖచ్చితంగా ఖాయం’
ఇది నా నమ్మకం కూడా.


ఆంధ్రప్రదేశ్ రచయితల సంఘం కార్యవర్గ సభ్యురాలుగా..
ప్రశ్న 6. ‘70 ఎమ్. ఎమ్.’ కవితలో “ఉద్యమాలకు అందని సమానత్వపు చంద్రుణ్ణి/ఉనికి మాత్రంతోనే నేలపైకి దించింది” అన్నారు. ఉద్యమాల ద్వారా సమానత్వాన్ని సాధించలేకపోయామని, కరోనా ఆ పని చేసిందని అన్నారు. కానీ ఆ ఉపద్రవపు తీవ్రత సమసిపోగానే మనుషుల్లో వ్యక్తిగత/సామాజిక అవలక్షణాలు మళ్ళీ తలెత్తున్నాయి కదా. మరి దీని గురించి మీ అభిప్రాయం?
జ: మీరే అంటున్నారు కదా, అవలక్షణాలని! వాటికి మనిషి ఆత్మ లోంచి పుట్టే గట్టి సంకల్పమే విరుగుడు కాగలదు. నేటి సమాజంలో మంచిని ఆచరించాలన్న సంకల్పబలం కన్నా భయానికి, బెదిరింపులకు ఎక్కువ ప్రభావితులౌతున్నారు జనం. జన మానసాల్లో పరిణతి, దూరాలోచన ఉంటేనే.. ఏ కరోనా రాకున్నా.. మార్పు సాధ్యమవుతుంది. కానీ, అది అంత సులువుగా నెరవేరదేమో అనిపిస్తుంది. ఎందుకంటే జనంలో ఓర్పు, నిలకడ, నిజాయితీ కొరవడ్డాయి. చిటికెలో అన్నీ జరగాలనే తత్వం పెరిగింది.


తెలుగు భాషా సంఘం అధ్యక్షులు శ్రీ విజయబాబు గారిచే సన్మానం పొందుతూ..
ప్రశ్న 7. ఈ సంపుటి శీర్షికగా నిలిచిన ‘చూస్తుండగానే’ అనే కవిత నేపథ్యాన్ని వివరిస్తారా?
జ: ‘డ్రగ్ ఎడిక్టు’లయిన ఒకరిద్దరు యువకులు చూస్తూండగానే పూర్తిగా దిగజారి ఆరోగ్యం కోల్పోవడం.. వారి కుటుంబాలు మనోవేదనతో, ఆర్థిక ఇబ్బందులతో అతలాకుతలం కావడం.. మనసుని గాయపరిచింది. అదృష్టవశాత్తూ వారు కొంత కాలానికి బాగుపడ్డారు. ఒకవేళ ‘వారు మారకుంటే..’ అన్న భావనే ఈ కవితకి నేపథ్యం.
ప్రశ్న 8. బాపట్ల రచయితల సంఘం నిర్వహించిన పోటీలలో ప్రథమ బహుమతి పొందిన ‘దసరా వేషాలు’ కవిత నేపథ్యాన్ని వివరిస్తారా?
జ: తప్పకుండా! నా చిన్నతనంలో మా ఊర్లో (దరిశి, ప్రకాశం జిల్లా), దసరా సమయంలో దాదాపు 11 రోజులు దసరా వేషాలు కొనసాగేవి. అందులో ముఖ్యమైనవి – దొంగవేషం, పులి వేషం, పిట్టల దొర వేషం ఉండేవి. పిల్లలందరం వారి వెంట ఊరంతా తిరిగి ఆనందించే వాళ్ళం. ఆ జ్ఞాపకాలే ఈ కవితకి నేపథ్యం.


గత ఉగాదికి సాహితీకిరణం వారి కవితలపోటీలో శ్రీ బైసా దేవదాస్ గారినించి బహుమతి స్వీకరిస్తూ..
ప్రశ్న 9. సాధారణంగా రచయితలకు వారి రచనలన్నీ నచ్చుతాయి. అయితే ఈ సంపుటిలో మీకు బాగా నచ్చిన కవిత ఏది?
జ: మీరన్నది అక్షరాల సత్యం. అన్ని కవితలూ నచ్చినవే అయినా అనాథ బాలలను ఉద్దేశించి రాసిన ‘మనలో ఒకరు’ నాకు నచ్చిన కవిత. నిజానికిది ఒక కవితల పోటీ కోసం రాసిన కవిత. అయితే, సరైన సమయానికి పంపలేక పోయాను. ఇది ఎక్కువ ఆర్ద్రపరిచిన కవిత. కన్నీళ్ళ తోనే దీన్ని రాశాను.
ప్రశ్న 10. ఈ సంపుటిలో ఏ కవితని రాయడానికి మీరు ఎక్కువ కష్టపడ్డారు? ఏ కవితలోని పంక్తులైనా మరో విధంగా రాసి ఉంటే భావ వ్యక్తీకరణ బాగుండేది అని అనిపించిందా?
జ: భావావేశము, సంఘర్షణల తర్వాత కవితకు జన్మనివ్వడం సాధారణం. ఇది ఎంతో ఇష్టంతో చేసే పని గనుక కష్టంగా అనిపించదు. కొన్ని కవితల్ని గంటల్లో పూర్తి చేస్తే, కొన్ని రోజులు, వారాలు, నెలలు పట్టవచ్చు, తప్ప ఆ క్రమంలో ఏం జరిగినా.. కవిత చూసుకున్నాక మరేమీ తెలియదు.. సాధారణంగా నాకు నచ్చిన సరళిని ఒకటికి రెండుసార్లు, సరి చూసుకునే రాస్తాను. గనుక, మరో విధంగా రాస్తే బాగుండేదన్న ఆలోచన రాలేదు.


భవానిదేవి గారు.. ఇతర సంఘ సభ్యులతో..
ప్రశ్న11. డా. సి. భవానీదేవి గారి కథల సంపుటిని ‘తప్తశిల’ పేరిట హిందీలోకి అనువదించారు. తెలుగు భావాలను, ఉద్వేగాలను, ఉపమానాలను హిందీలోకి తర్జుమా చేయడంలో ఏవైనా ఇబ్బందులెదుర్కున్నారా? అనువాదానికి స్పందన ఎలా ఉంది?
జ: చిన్న చిన్న ఇబ్బందులు అనువాదకులందరికీ సాధారణంగా ఎదురయ్యేవే – ‘ముక్కాలి పీట’, ‘తలంబ్రాలు’, ‘అరిసెలు’, ‘మరచెంబు’, ‘మడి’ వంటి పదాల కోసం మిత్రులను సంప్రదించాను. కొన్నింటిని ఫుట్నోట్లో వివరించడం జరిగింది. అనువాదానికి స్పందన సంతృప్తి కరంగా ఉంది.


ప్రపంచ తెలుగు మహాసభల్లో..
ప్రశ్న12. ‘ఫీనిక్స్’ పేరిట హిందీలో ఓ కవితా సంపుటి ప్రచురించారు కదా, ఆ పుస్తకం గురించి పాఠకులకు వివరిస్తారా?
జ: ‘ఫీనిక్స్’, మౌలికమైన హిందీ రచన. ఇందులో 61 కవితలు హిందీలో రాసినవి. 09 కవితలు తెలుగు నుంచి అనువదించినవి. ఈ అనువాద కవితల్లో మూడు డా. సి. భవానీ దేవి గారివి, ఒకటి శ్రీ మౌనశ్రీ మల్లిక్ గారిది, మూడు శ్రీ మహమ్మద్ ఖాన్ గారివి, రెండు మా అన్నయ్య షేక్ మస్తాన్ వలి గారివి ఉన్నాయి. హిందీలో ప్రచురింపబడినవి, ఆకాశవాణిలో ప్రసారమైనవి, జాతీయ, అంతర్జాతీయ సెమినార్లలో చదివిన కవితలు.. ఈ సంకలనంలో చోటు చేసుకున్నాయి.
ప్రొఫెసర్లు, పెద్దలు, మిత్రులు, శిష్యుల అభినందనలు పొందింది. ఇంకా జనం లోకి వెళ్ళవలసి ఉంది.


అమరావతి సాహితీమిత్రులు సంస్థ ద్వారా ఉగాది పురస్కారం పొందుతూ.. శ్రీ రావి రంగారవు గారు.. శ్రీ పాపినేని శివశంకర్ గార్లతో..
ప్రశ్న13. ‘చూస్తూండగానే’ కవితా సంపుటి ప్రచురణలో ఏవైనా గుర్తుండిపోయే అనుభవాలు ఉన్నాయా? ఈ పుస్తకానికి పాఠకుల ఆదరణ ఎలా ఉంది?
జ: ప్రత్యేకమైన అనుభవాలంటూ ఏమీ లేకున్నా.. ఈ పుస్తకానికి సంబంధించిన పనులన్నీ నెల లోపే పూర్తవడం ఒక మంచి జ్ఞాపకం. మిత్రులు, సమీక్షకులు, ఆత్మీయుల మన్ననలు పొందిందని చెప్పగలను. పాఠకుల ఆదరణ మొదలైంది. కానీ ఇంకా ఊపందుకోవల్సి ఉంది.
ప్రశ్న14. భవిష్యత్తులో ఎలాంటి రచనలు చేయాలనుకుంటున్నారు? ఏవైనా పుస్తకాలు ప్రచురణకు సిద్ధంగా ఉన్నాయా?
జ: నిర్దుష్టమైన రచనలు చెయ్యాలనే ప్రణాళికేమీ లేదు. ప్రభావాత్మకమైన గుర్తుండిపోయే కవితల్ని.. ముఖ్యంగా దేశభక్తి కవితల్ని రాయాలని అనుకుంటున్నాను.
ఒక దీర్ఘకవిత తుది మెరుగుల్లో ఉంది. బహుశా అదే నా తదుపరి ప్రచురణ కావచ్చును.
ప్రశ్న15. సాహిత్యానికి సంబంధించి ఇంకేమైనా చెప్తారా?
జ: తప్పకుండా!
- హిందీలో ఆకాశవాణి విజయవాడ, విశాఖపట్టణం కేంద్రాల నుంచి దాదాపు 30 కార్యక్రమాలు ప్రసారమయ్యాయి. ఇందులో నేను S.C.I.M. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఉన్నప్పుడు నా విద్యార్థులు 10 మందితో కలిపి చేసిన ‘శాస్త్ర సమ్మేళన్’ అనే ఏకాంకి నాటిక మా కాలేజీలో రికార్డ్ అయ్యి ప్రసారమవడం మంచి జ్ఞాపకం.
- దూరదర్శన్ విజయవాడ నుంచి హిందీలో కవితా పఠనం ప్రసారమయ్యింది ‘గుల్దస్తా’ కార్యక్రమంలో.
- దాదాపు 12 జాతీయ, 03 అంతర్జాతీయ సెమినార్లలో పత్ర సమర్పణ జరిగింది.
- దాదాపు 5-6 వ్యాసాలు జాతీయస్థాయి సంకలనాల్లో ప్రచురింపబడ్డాయి.
- ‘సమకాలీన్ భారతీయ సాహిత్య్’, ‘అనువాద్’ జాతీయ పత్రికల్లో తెలుగు నుంచి అనువదించిన 2 కథలు ప్రచురితములు (తెలుగులో శ్రీ మన్నె సత్యనారాయణ గారి కథలు).
- ‘విపుల’లో హిందీ నుంచి అనువదింపబడిన కథ (శ్రీ జిందర్, పంజాబీ రచయిత) ప్రచురితం.
- అనేక సామాజిక, సాహిత్యాంశాలపై తెలుగు, హిందీ భాషల్లో విద్యాలయాల్లోను, ఇతర వేదికలపైనా ప్రసంగించడం మంచి జ్ఞాపకం.
~
సంచిక టీమ్: విలువైన మీ సమయం వెచ్చించి మా ఈ ఇంటర్వ్యూకి జవాబులిచ్చినందుకు ధన్యవాదాలు షేక్ కాశింబి గారూ.
షేక్ కాశింబి: ధన్యవాదాలండీ! సంచిక టీమ్కి నా ప్రత్యేక కృతజ్ఞతలు.
***


రచన: షేక్ కాశింబి
పేజీలు: 112
వెల: ₹ 120
ప్రతులకు:
షేక్ కాశింబి
ఫ్లాట్ నెం. 101, వైష్ణవి ఆర్చిడ్స్,
1వ లేన్, విజయపురి కాలనీ,
జె.కె.సి. కాలేజీ రోడ్,
గుంటూరు – 522 006
ఫోన్: 9052216044
~
‘చూస్తుండగానే’ కవితాసంపుటి సమీక్ష:
https://sanchika.com/choostundagaane-book-review-kss/
19 Comments
D.Nagajyothi
ప్రేమ మూర్తి ,సహృదయురాలు,మంచి కవయిత్రి శ్రీమతి కాసీం బీ గారి ఇంటర్వ్యూ వారి అంతరంగాన్ని దర్శించేందుకు ఎంతో సహకరించింది. వారి జీవన విశేషాలు, సాహితీ ప్రస్థానం గూర్చి తెలుసుకోవడం ఎంతో స్ఫూర్తిదాయకం వారికి నా శుభాభివాదాలు .మంచి మనసున్న వారి ఇంటర్వ్యూ అందించినందుకు ధన్యవాదాలు అండీ
P . Ujwala vani
Most deserving interview of renowned Poet Kasimbi Garu. I am happy that Sanchika identified such a good Poet and her work. I wish all the best for her future endeavours.
I am happy that her photos with learned people are published by Sanchika with the interview.
P . Ujjwala vani
పాణిరావు యర్రగుంట్ల
సోదరి సమానురాలు, ప్రముఖ రచయిత్రి, అనువాదకురాలు శ్రీమతి కాసీo బీ గారి ఇంటర్వ్యూ ఆద్యంతం ఆసక్తిగా స్ఫూర్తి దాయకం గా సాగింది. రచయిత్రి జీవన ప్రయాణం, సాహితీ …ప్రయాణం ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న రచయితలకు మార్గ నిర్దేశం. సామాజిక సమస్యలపై స్పందించడం రచయిత్రి గొప్పతనం .
మంచి ఇంటర్వ్యూ అందించారు. ధన్యవాదాలు.
Niha shayk
I feel highly elated for the opportunity my grandma has got through this interview ! It’s been our pleasure , that they have recognised her talent . She is not only a great poet but also utmost sweet person , who deserves this honour !
With all due respect
Thank u
A Murali krishna
కాశింబి గారు 1991 నుంచి నాకు గురువు గారు. మాతృ సమానులు. 1992 లో నేను కవిత్వం వ్రాయడానికి తొలి ప్రేరణ. ఈరోజు కొన్ని కవితల్లో ప్రసంసాపత్రాలు పొందడం ఆమె చలవే.. ఇటర్వ్యూ చాలా బాగుంది. అన్ని కోణాలు స్పృశించారు.. ధన్యవాదాలు…
జొన్నకూటి లక్ష్మి
43 ఏళ్ల మా పరిచయంలో నా ప్రాణ స్నేహితురాలు కాశింబీ తన అనుభవాలతో పరిణితి చెందిన తన కవితలతో సమాజాన్ని మేలుకొలిపే ప్రయత్నం చేయడం హర్షణీయం.ఆర్ద్రత , ఆవేదనతో సూచించే కవితలు ఆమ అంతరంగంలోని ఉద్వేగాన్ని, సంఘంలో జరుగుతున్న ఎన్నో తప్పిదాల్ని కళ్లకి కట్టినట్లు చెప్పారు. ఈ కవితల వలన సమాజంలో మార్పు రావాలనే ఆమె దృక్పథం అభినందనీయం. ఇంటర్వ్యూ చాలా బాగుంది.
Dr.GVRS Phani Durga
మాతృమూర్తి ,మమతల కోవెల శ్రీమతి కాశింబీ గారి ఇంటర్వ్యూ చాలా బాగుంది .వాల్మీకి శోకం నుండి శ్లోకం ఉద్భవించి రామాయణమైనట్లు సమాజంలో జరుగుతున్నటువంటి అనేక సంఘటనలతో ఆమె హృదయం ద్రవించి ఆమె నుండి వచ్చినటువంటి అనేక కవితలు నేటి సమాజానికి చాలా అవసరం. పదవీ విరమణ అనంతరం ఆమె ఈ ప్రస్థానం ఎందరికో ఆదర్శప్రాయం .ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు ……. అలాంటి వారిలో ముందుండే మా కాశింబి గారికి శతకోటి వందనాలు.
-----శివకుమార్ పేరిశెట్ల.....
‘తమ్ముడూ’ అని ‘నాన్నా’ అని మనసుని తట్టిమరీ పలకరించే అక్కయ్య “కాశింబీ” గారికి ప్రేమపూర్వక నమస్సులు.’అమరావతీసాహితీమిత్రుల’ ఉగాది పురస్కారాన్ని మీ ప్రక్కనే నిలబడి అందుకున్నందుకు చాలా ఆనందపడ్డాను.అక్కయ్యా!మీ ఇంటర్వ్యూ బావుంది.మీ సరికొత్త రచన చదవాలనివుంది.మీకు శుభాకాంక్షలు!
వీసం నారాయణ రావు
అమ్మలాంటి అమృతపు కవితలతో నేటి సమాజంలో ఉన్న అనేకమైన అంశములపై యువతకు మంచి మార్గ నిర్దేశం చేసే విధంగా పరిశోధనాత్మకమైన దృష్టితో మంచి మార్గదర్శనం చేస్తున్నటువంటి మా మాతృమూర్తి కాసింబి మేడమ్ గారికి హృదయపూర్వక నమస్కారాలు.
వారి కవితలు గత కొంత కాలము నుండి మేము చదువుతూ చాలా ఆనంద పడుతున్నాం . వారి ఇంటర్వ్యూలో ప్రతి ప్రశ్నకు సమాధానము చాలా యుక్తిగా భావితరానికి మంచి జ్ఞానాన్ని అందించే విధముగా కొత్త తరాన్ని సృష్టించే విధముగా కొనసాగింది.
ధన్యవాదములు
Dr.GVRS Phani Durga
మాతృమూర్తి శ్రీమతి కాశింబి గారి ఇంటర్వ్యూ చాలా బాగుంది వాల్మీకి శోకం నుండి శ్లోకం గా రామాయణం ఉద్భవించినట్లు, ఆమె యొక్క హృదయం సమాజంలో జరుగుతున్నటువంటి అనేక సంఘటనలను చూసి ద్రవించి ఆమె నుండి ఉద్భవించినటువంటి అనేక కవితలు నేటి సమాజానికి చాలా అవసరం .
పదవీ విరమణ అనంతరం ఆమె ఈ ప్రస్థానం అనేకమందికి ఆదర్శప్రాయం. ఎందరో మహానుభావులు అందులో ముందుండే మాకాశింబి గారికి శుభాభినందనలు.
Veruva Nageswara Rao
అక్కయ్య గారికి నమస్కారములు,
ఇది చాలా మంచి ఇంటర్వ్యూ , ప్రశ్నలు మరియు సమాధానాలు రెండూ ఆసక్తికరంగా మరియు స్ఫూర్తిదాయకంగా ఉన్నాయి. అభినందనలు & శుభాకాంక్షలు.
వేరువ నాగేశ్వర రావు
K Santhi Bhavani
కాశింబి మేడం గారి కవితలు బాగుంటాయి. అందరికీ అర్థమయ్యే విధంగా సరళమైన భాషలో రచనలు చేస్తారు. ప్రస్తుత సమాజంలో ఉన్న పరిస్థితులను అద్దంలో చూపించినట్లు ప్రశ్నలు మరియు సమాధానాలు ఉన్నాయి. మేడం గారు ఇంకా మంచి కవితలు రాయాలి అని కోరుకుంటున్నాను.
ధన్యవాదములు
.
S.Venugopal, రిటైర్డ్ లెక్చరర్
శ్రీమతి కాశింబి గారు నాకు సుపరిచితులు.వారు వృత్తి రీత్యా హిందీ అధ్యాపకులు అయినప్పటికీ, తెలుగు సాహిత్యం, తెలుగు కవిత్వం వారి ప్రవృత్తి.వారి రచనల్లో సామాజిక సృహ ఎక్కువగా కనపడుతుంది. సమాజంలోని రుగ్మతలు,సమస్యలు, దురాచారాల మీద ఆమె కవితలు, కథానికలు, గేయాలు వుంటాయి. సమకాలీన సమస్యలు మీద ఆమె కవితల్లో స్పందిస్తుంటారు. వారిని ” సంచిక” ఇంటర్వ్యూ చేయడం ముదావహం.వారికి నా ధన్యవాదాలు.
శ్రీమతి కాశింబీ గారు భవిష్యత్తులో ఇంకా ఎన్నో రచనలు చేసే శక్తి నీ, ఆయురారోగ్యాలను భగవంతుడు ఇవ్వాలని కోరుకొంటున్నాను.
Jaya Lakshmi Maddala
Kasimbi Madam is like my mother. I love her so
much I love her nature n writings.God bless you Madam.
పింగళి భాగ్యలక్ష్మీ
Gorrepati Srinu
Interview is so nice. Congratulations Kasimbi madam
Esther Rani
The interview is quite meaningful and interesting. Heartfelt congrats to SANCHIKA web magazine and to my beloved friend Kasimbee.
అశ్విని రావుల
అమ్మ, ఇదే నేను కాశింబి గారిని సంబోధించే విధానం. నాకు గురువుగా పాఠాలతో పాటు, పరిణతి కూడిన హుందాతనం అంటే ఏమిటో ప్రత్యక్షంగా చూపించిన వారు. మనసును తట్టిన ఆవేదన, ఆనందం, ఆక్రోశం, భావం ఏదయినా వెంటనే వ్యక్తపరిస్తే మనిషిగా మిగిలిపోతాం, కానీ కాస్త ఆగి ఆలోచించి దాని మూలాన్ని కనుగొంటే ఇలా అమృతమూర్తులుగా మారుతాం. ఎంతటి భావోద్వేగాన్నైనా అగ్ని పర్వత విస్ఫోటనంలా కాకుండా నిదానింది, దానిని నిష్కళంక హృదయంతో అనుభవించగలిగినప్పుడే, దానిని మనసు దగ్గర ఆపకుండా అర్థవంతమైన రచనల రూపంలో లయబద్దంగా సాగే సెలయేరులా వెలికి పంపగలం. ఇది తపస్సుకు తక్కువేమి కాదు. కాశింబి గారు ఎంత మంచి గురువో అంత కంటే గొప్ప తాపసి అందుకే వారి రచనలలో అంతటి ఆర్థ్రత.
నా గురువుకి ఈ సందర్భంగా పాదాభివందనం.
Manjusha mandapati
My hearty congratulations to you Mrs Kasimbi aunty … Sooo proud of you after seeing such a heart touching poetries and your content in books .. You are deserve for more appreciation and awards … May god give you more strength to write such a good books for future generations.
Love you aunty