[శ్రీ రాచకుళ్ల విశ్వరూప చారి రచించిన ‘తందనాలు’ అనే చిన్న కవితలని పాఠకులకు అందిస్తున్నాము.]


311
చెట్లు ఆకులు రాల్చే ఋతువు శిశిరం
వట్టి బోయిన చెట్లు బోసిగా వున్నై
కట్టెల్లల్లే చెట్లు కాంతి విహీనంగా
వట వృక్షాలు కూడా అదే పరిస్థితి
312
తాళి యెగతాళి ఈరోజుల్లో
మళ్ళీ మళ్ళీ కట్టించుకునే పరిస్థితి
కుళ్ళి కుళ్ళి ఏడవాల్సి వస్తుంది ఈ బంధంతో
ఒళ్ళు హూనం అవుతుంది కొందరికి
313
ప్రకృతి విలపించి పోతున్నది
కకావికలౌతుందని కాలుష్యంతో
శకలాలుగా మిగులుచున్నవి ఉపగ్రహాలు
ఇంకా రక రకాల కాలుష్యంతో
314
మొగలి పూల వాసన యెంత మత్తో
కౌగిలింతతో బంధించుకునే జంటకే ఎరుక
అంగాగం పులకింతలే
ఊగి పోదురు మత్తులో యెంతో ఆనందంగా
315
నెమలులు నాట్యమాడతాయంటారు
కోమలులు గూడా అంతే నేర్పరులు
రమణీయమైన తమ నాట్యంతో
మైమరపింప చేతురు సభికులెల్లరను
316
కోర్కెలు గుర్రాలై పరుగెడుతున్నప్పుడు
అర్జంటుగా నిర్ణయాలు తగవు
అర నిమిషమైనా ఆలోచించాలి
సరైన నిర్ణయంతో మంచే జరుగును
317
ధనార్జనకు అడ్డదార్లలో జనం
కనపడనన్ని తప్పులు
జన జీవితం అతలా కుతలం
తానూ సమాజంలో భాగమేనని తెలిసేది ఎన్నడో?
318
అంటరానితనం పాటించటం యెంత అమానుషం
పాటించటం నేరం కాదా?
కట కటా మనుషులందు యెంత అజ్ఞానం
చట్టాలెన్నినున్నా నిరుపయోగమే
319
ప్రభుత్వాల పందారాలు ఎన్నో
డబ్బు, స్థలాల, జీవాల పంపిణీ రూపేణా
ప్రభుత్వాలు అప్పు చేసి మరీ పంపిణీ చేస్తున్నవి
కబంద హస్తాలలో ఎన్నో
320
సెంట్ స్థలంలో ఏమి కట్టుకోవచ్చు
వంటగది, ఒక చిన్న గది మాత్రం
తటపటాయించే పనిలేకుండా
కట్టుకోవచ్చుగదా, అదే ప్రభుత్వాల ధ్యేయం

శ్రీ రాచకుళ్ల విశ్వరూప చారి (ఆర్.వి. చారి) గారిది తెనాలి. ప్రసుతం హైద్రాబాదులో సెటిల్ అయినారు.
చారి గారు ఈ.ఎస్.ఐ. కార్పొరేషన్లో సూపరింటెండెంట్గా పనిచేసి రిటైర్ అయినారు. వారి మేనమామ గారు కీ.శే. పూసపాటి నాగేశ్వర రావు. అయన వీరబ్రహ్మేంద్ర చరిత్ర పద్య కావ్యం రచించి యున్నారు. కాగా అయన అష్టావధాని కూడా. వారి స్వగ్రామము రావెల్, గుంటూరు జిల్లా. చారి గారికి తమ మామయ్య మాదిరి పద్యాలు వ్రాయాలని కోరిక. కానీ ఛందస్సు తెలిసుండాలిగా. అందుచే వ్రాయలేక పోయారు.
కానీ నానీలు వ్రాయుటకు వారి కుమార్తె శ్రీమతి ప్రత్తిపాటి సుభాషిణి కారణం. ఆమెది బాపట్ల, గుంటూరు జిల్లా. టీచర్గా పని చేస్తున్నారు. వారు ఈ మధ్యనే ఒకానొక సంధర్బములో హైదరాబాద్ వొచ్చి తాను రచించిన ‘నిశ్శబ్ద పర్జన్యాలు’ చారిగారికి ఇచ్చారు. అవి చాలా బాగున్నాయి. అవి చదివిన తరువాత, ఆ స్పూర్తితో, నానీలు వ్రాయాలని కోరికతో చారిగారు నానీలు వ్రాసారు. పద్యాలు వ్రాయాలనే వారి కోరిక ఈ విధంగా తీరుచున్నది.