[శ్రీ రాచకుళ్ల విశ్వరూప చారి రచించిన ‘తందనాలు’ అనే చిన్న కవితలని పాఠకులకు అందిస్తున్నాము.]
51
పద్యానికి కావాలి యతి గణ ప్రాసలు
అధ్యయన పండితులు మాత్రం అర్హులు
గద్యానికి ఆ అవసరం లేదు
విద్యావంతులెవరైనా వ్రాయగలరు
52
నరకమంటే ఎక్కడో లేదు
నిరంతర నిర్వాకాలలోనే గోచరిస్తుంది
పరపతి గలవారు తెలివిగా తప్పించుకుంటారు
కారణాలు వెతికి
53
అల్ప సంతోషులు జీవితంలో సుఖంగా వుంటారు
స్వల్ప విజయాలతోనే
కల్ప వృక్షాలు కావాలంటారు ఆశాపరులు
తల్పాలూ కావాలంటారు అతిగా
54
అంగ ప్రదక్షిణాలు చేసేవారు కొందరు
వంగి వంగి దండాలు పెడతారెందరో
రంగ రంగా అంటుంటారు
కంగారుగా ప్రదక్షిణాలతో ఇంకొందరు
55
కంచు కాగడాలోనూ కనిపించని ఔదార్యం
మచ్చు కైనా లేని కనికరం
చించి చించి శోధించినా లేని మానవత్వం
చచ్చు చివరకు దుర్మార్గుడీలాగ
56
మట్టినుండే ఉద్భవించు జీవులు
గట్టి గట్టిగా పెరుగును జీవం
పట్టి పట్టి చూచుకొందరు జీవితాన్ని
చిట్ట చివరకు మట్టిలోనే కలసిపోవు
57
కోరి తెచ్చుకున్న కొత్త పెళ్ళాం
కరి రంగులో వున్ననూ యెంతో అందంగా వున్నది
తరిచి చూడగా యోగ్యవంతురాలు
మురిపించి ఆనంద పర్చుచున్నది
58
వ్యత్యాసాలు తెలియనివాడు
సత్యమే మాట్లాడువాడు
నిత్య నూతన యవ్వనుడు మంచి మనస్కుడు
ముత్యము చిప్పలోని ముత్యము వంటి వాడు గదరా
59
యుగ యుగాలనుండి మనిషి జీవితం మారుతూ వస్తుంది
గంగా జలం పవిత్రమొక్కప్పుడు
రంగ రంగ అంటూ అప్పుడు
యోగాభ్యాసాలు యెక్కువై ఇప్పుడు
60
రోషమున్న వాళ్లెవరు పనికి వెరవరు
వేషాలు వేసి పని తప్పించుకోరు
అష్ట కష్టాలు పడి నెరవేర్తురు
సాష్టాంగ దండ ప్రమాణాలు చేయరు

శ్రీ రాచకుళ్ల విశ్వరూప చారి (ఆర్.వి. చారి) గారిది తెనాలి. ప్రసుతం హైద్రాబాదులో సెటిల్ అయినారు.
చారి గారు ఈ.ఎస్.ఐ. కార్పొరేషన్లో సూపరింటెండెంట్గా పనిచేసి రిటైర్ అయినారు. వారి మేనమామ గారు కీ.శే. పూసపాటి నాగేశ్వర రావు. అయన వీరబ్రహ్మేంద్ర చరిత్ర పద్య కావ్యం రచించి యున్నారు. కాగా అయన అష్టావధాని కూడా. వారి స్వగ్రామము రావెల్, గుంటూరు జిల్లా. చారి గారికి తమ మామయ్య మాదిరి పద్యాలు వ్రాయాలని కోరిక. కానీ ఛందస్సు తెలిసుండాలిగా. అందుచే వ్రాయలేక పోయారు.
కానీ నానీలు వ్రాయుటకు వారి కుమార్తె శ్రీమతి ప్రత్తిపాటి సుభాషిణి కారణం. ఆమెది బాపట్ల, గుంటూరు జిల్లా. టీచర్గా పని చేస్తున్నారు. వారు ఈ మధ్యనే ఒకానొక సంధర్బములో హైదరాబాద్ వొచ్చి తాను రచించిన ‘నిశ్శబ్ద పర్జన్యాలు’ చారిగారికి ఇచ్చారు. అవి చాలా బాగున్నాయి. అవి చదివిన తరువాత, ఆ స్పూర్తితో, నానీలు వ్రాయాలని కోరికతో చారిగారు నానీలు వ్రాసారు. పద్యాలు వ్రాయాలనే వారి కోరిక ఈ విధంగా తీరుచున్నది.