[శ్రీ పెద్దాడ సత్యప్రసాద్ రచించిన ‘వసంతం నా సొంతం’ అనే కవితని పాఠకులకి అందిస్తున్నాము.]


నా మనసే ఓ వసంతం
అది విరబూస్తుంది ప్రతి నిత్యం
నిరంతరం పూల పరిమళాలను
ఆఘ్రాణిస్తూ సాగిపోతుందలా
కొత్త చిగుళ్ళను తొడుగుతూ
సొగసు పోయే వగలను
తిలకిస్తూ పులకిస్తుందలా
ఇక్కడ అంతా సృజనాత్మకమే
శిశిరాలకు తావు లేదక్కడ
శిధిల వ్యథల తలపులకు చోటే లేదు
నిశీధి విషాదాలకూ అవకాశమే లేదు
అంతటా ఆమనులూ వెన్నెలలే
నిరంతరం సరికొత్త అనుభూతులను
ఆస్వాదించడమే నా మనసుకు తెలుసు
వసంతానికి ఏడాదిలో కొన్ని రోజులే చోటు
కానీ నా మనసులో మాత్రం దానికి
శాశ్వత చిరునామా
యవ్వనమంతా నా మనసు ముంగిట్లోనే
నవ్వుల జాతర నా హృదయపు లోగిళ్ళలోనే
ఇలా కాలలకు అందని ప్రేమలతో
నే పరవశించిపోతాను
నిత్య సత్యమై పలకరించిపోతాను
నా మనసంతా వసంతమై
ఈ జగమంతా నా సొంతమై
పులకరించిపోతాను

పెద్దాడ సత్యప్రసాద్ విశాఖపట్నం జిల్లా వాస్తవ్యులు, కవిగా, రచయితగా దశాబ్దాల ప్రయాణం. వీరి కధలు, కవితలు వివిధ పత్రికలలో ప్రచురితమవడమే కాక, ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ద్వారా కూడా ప్రసారం అయ్యాయి. ఇక, వృత్తిగతంగా పాత్రికేయులు. రెండున్నర దశాబ్దాలకు పైగా పాత్రికేయ వృత్తిలో అంకితభావంతో పనిచేస్తున్నారు. రాజకీయ విశ్లేషణలు వీరి ప్రత్యేకత. ప్రస్తుతం ఆకాశవాణి విశాఖపట్నం ప్రాంతీయ వార్తా విభాగంలో న్యూస్ ఎడిటర్గా పనిచేస్తున్నారు.
1 Comments
-సరికొండ రవీంద్రనాథ్
Feel Good Poetry. ప్రసాద్ గారికి అభినందనలు