మధ్యాహ్నం భోజనం చేసి పడుకున్న భాస్కరానికి నాలుగవుతుండగా మెలుకువ వచ్చింది. మంచం దిగి బాల్కనీ లోకి వచ్చి నించున్నాడు. ఎదురుగా దట్టంగా మబ్బులుకమ్మిన ఆకాశం. కనుచూపుమేరంతా తమ కొబ్బరితోట. చెట్లమధ్య వరుసల్లో వేసిన అరటి, కోకో చెట్లూ అన్నీ మబ్బుపట్టిన వాతావరణం లో చీకటిగా కనిపిస్తున్నాయి. మరోవైపు కంకులుపోసుకొని ఉన్న వరిపైరు గాలికి అలలు అలలుగా ఊగుతూ భాస్కరానికి ఉల్లాసాన్నిచ్చింది. “నాన్నగారు నన్ను ఇక్కడికి పంపి మంచిపనే చేసారు” అనుకున్నాడు.
ఇంతలో చిన్నయ్యగారు నిద్రలేచి బాల్కనీలో నించుని ఉండడంచూసిన పాలేరు అన్నవరం ” అబ్బాయిగారూ, టీ తాగుతారా?” అని అడుగుతూనే ఫ్లాస్కులో సిధ్ధంగా ఉన్న వేడి టీ ని గ్లాసులోపోసి భాస్కరానికి అందించాడు. సిగరెట్టు అంటించి, టీ తాగుతూ కూర్చున్న భాస్కరానికి దూరం నించి మైకులో ఏవో భజన పాటలు వినబడ్డాయి. కొంచెం సేపు గడిచేకా ఒక స్త్రీ కంఠం వినబడింది ఏదో ఉపన్యాసం ఇస్తూ!
“ఈ పాటలూ భజనలూ యేమిటి అన్నవరం” అని ప్రశ్నార్థకంగా చూశాడు భాస్కరం. ” అయాండీ! మన కరణంగారిపుంత కి దగ్గర్లో మన అరటితోటకి ఆనుకుని యెవరో ఒక ఆడ సాదువమ్మగారు మటం పెట్టారు బాబూ! నాన్నగారు ఆవిడికి చాలా సాయంచేసారు. ఈ పాటలూ బజన్లూ అన్ని అక్కణ్ణించేనండీ” అన్నాడు అన్నవరం. అతను మాట ముగించాడో లేదో ఫెళఫెళారావాలతో ఉరుములూ, మెరుపులూ, ఆ వెంటే వానా మొదలయ్యాయి. ఇక అబ్బాయిగారు బయటికివెళ్ళరు అని గ్రహించిన అన్నవరం కొబ్బరితోటలూ, పంటలూ, రోజురోజుకీ పెరుగుతున్న కూలీల సమస్యలూ అన్నీ యేకరువు పెట్టసాగాడు.
మర్నాటి ఉదయం భాస్కరం కాలకృత్యాలు తీర్చుకుని, అన్నవరాన్ని తీసుకుని నడకకి బయలుదేరాడు. అంతలోనే మళ్ళీ లౌడ్ స్పీకర్ లో భగవద్గీత మొదలయింది. నిన్న సాయంత్రం అన్నవరంచెప్పిన మఠం గుర్తొచ్చి అదేంటో చూద్దామనిపించి భాస్కరం అటువైపు తిరిగాడు. కొద్దిసేపట్లోనే ఆశ్రమంకనబడింది. అన్నవరం పరుగెత్తి పోయి, రాజమండ్రి నించి లాయరుగారబ్బాయిగారొచ్చారని అక్కడివారికి చెప్పాడు. ఎవరో ఒక వృధ్ధస్త్రీ వచ్చి భాస్కరాన్ని లోనికి తీసుకెళ్ళింది. అక్కడ ప్రత్యేకంగా ఉన్న ఒక కుటీరం దగ్గరికి తీసుకెళ్ళి, “కూర్చోండి బాబూ, మాతాజీ వస్తారు “అని చెప్పింది.
కొద్దిసేపట్లో మంచి తేజస్విని అయిన అరవైయేండ్ల కాషాయాంబరధారిణి వచ్చారు. ఆవిడ ముఖం లో యేదో గొప్ప వెలుగు కనబడింది భాస్కరానికి. లేచి నమస్కరించాడు. అతన్ని దీవించి, తన మఠానికి భాస్కరం తండ్రి వెంకట్రామయ్యగారు చేసిన సహాయాన్ని మెచ్చుకున్నారు. “బాబూ, నేను దేశమంతా తిరిగినదాన్ని. ఈ ప్రదేశం నాకు ఎందుకో బాగా నచ్చింది. ఇక్కడ స్థిరపడి, ఆశ్రమాన్ని కట్టుకోవాలనిపించింది. ఈ చుట్టుపక్కల పొలాలూ, తోటలూ అన్నీ మీవేనని తెలిసి, రాజమండ్రి వెళ్ళి మీ నాన్నగారిని కలిసాను. పుణ్యాత్ముడైన ఆయన మాకు ఆశ్రమం కట్టుకోడానికి ఈ స్థలాన్ని ఇచ్చారు. మీరు అచ్చం నాన్నగారిలానే ఉన్నారు, చాలా సంతోషం బాబూ, మీరు వచ్చినందుకు” అంటూ ఆవిడ భాస్కరం వివరాలన్నీ తెలుసుకున్నారు.
ఇంతలో, “మాతాజీ” అంటూ ఒక శ్వేతాంబరధారిణి అక్కడికి వచ్చింది. ఆమెను భాస్కరం ఒక్క క్షణం తేరిపారచూసి విద్యుద్ఘాతం తగిలినవాడిలాగ అయ్యాడు. ఆమె కూడా అతన్ని చూసి అదే అవస్థకు గురయినట్టనిపించింది. అంతలోనే తేరుకుని, మాతాజీతో యేదో మాట్లాడి, నిర్వికారంగా అక్కడినించి వెళ్ళిపోయింది. “ఆమె ముమ్మాటికీ సారసే! సందేహం లేదు. తనను ప్రాణప్రదంగా ప్రేమించి తనది కావలసిన వ్యక్తి, ఇక్కడెందుకుంది? దాదాపు పదిహేనేళ్ళ తరువాత ఇదే ఆమెను చూడడం…ఇలా తెల్లబట్టల్లో, ఆశ్రమవాసినిగా! భాస్కరంముఖంలో విషాదరేఖలు దోబూచులాడాయి. మరికొంతసేపు మాతాజీ వద్ద గిడిపి భాస్కరం వెనుదిరిగాడు. సారస గురించి ఆవిడని అడుగుదామనుకొని, మళ్ళీ ఆపని చెయ్యలేకపోయాడు. వెంటనే ఇంటికి పోవాలనిపించక, దారిపక్కనే ఉన్న ఆంజనేయస్వామి గుడి అరుగుపై కూర్చుండి పోయిన భాస్కరాన్ని గతస్మృతులు చుట్టుముట్టాయి.
భాస్కరం రాజమండ్రిలో పేరుమోసిన లాయరు వెంకట్రామయ్యగారి ఏకైక పుత్రుడు. ఇద్దరు కూతుళ్ళ తరువాత పుట్టిన ఒకే కొడుకు కావడంతో తల్లిదండ్రులకూ, అక్కలకూ కూడా అతనంటే ఎంతో ముద్దు. ఎంత గారాలపట్టి ఐనా, భాస్కరం చదువులోనూ, మంచి నడతలోనూ అందరికీ ఆదర్శంగా ఉండేవాడు. అతనికి చిన్నప్పటినించీ మంచి పుస్తకాలు చదవడం అలవాటయింది. తండ్రివద్దనున్న సాహిత్యాన్నంతా చదివేసాడు ఇంటర్ పూర్తయ్యేసరికి. ఆ తరువాత రాజమండ్రి లోనే ఉన్న గౌతమీ గ్రంథాలయం లోని ఉత్తమ గ్రంథాలన్నీ ఆపోశనపట్టాడు, డిగ్రీ పూర్తయ్యేలోగానే! మంచిమార్కులతో డిగ్రీ పూర్తిచేసి, తండ్రిగారి కోరికమీద న్యాయశాస్త్రం చదవడానికి విశాఖపట్నంచేరాడు. వెంకట్రామయ్య గారు కొడుకుని హాస్టల్లో ఉంచక, మహారాణీపేట లోనున్న తమ దగ్గరిబంధువుల ఇంట ఉంచారు, వారు అతన్ని బాగా చూసుకుంటారనే నమ్మకంతో!
భాస్కరానికి దైవభక్తి ఎక్కువ. రోజూ కాలేజీ నించి ఇంటికి వెళ్ళేటప్పుడు దగ్గర్లో ఉన్న కృష్ణమందిరానికి వెళ్ళేవాడు. ఒకరోజు కృష్ణమందిరంలోనే చూశాడు సారసను మొదటిసారి. మల్లెచెండుకి ప్రాణంవచ్చి నడిచివస్తున్నట్టుందే అనుకున్నాడు ఆమెను చూసి. ఒక స్త్రీని చూసాక అదే అతని తొలిస్పందన! ఒక చిత్రమైన అనుభూతి అతన్ని కమ్ముకుంది. ఇంటికి చేరాకా కూడా ఆమెనుగురించే ఆలోచనలు!
ఆమె అక్కడికి మళ్ళీ వస్తుందనే ఆశతో రోజూ కృష్ణమందిరానికి వెళ్ళేవాడు. కొన్నిరోజులతరువాత అతని కోరిక నెరవేరింది. ఈసారి ధైర్యం చేసి ఆమెను పట్టుపట్టి చూశాడు. నిజంగానే నడిచివస్తున్న మల్లెతీవ ఈ అమ్మాయి అనుకున్నాడు. “సారసా, ఇంక వెళ్దామా” అని ఆమె స్నేహితురాలు పిలవడంతో ఆమె పేరు సారస అని తెలిసిందతనికి. ‘సారసం అంటే పద్మం, ఎంత అందమైన పేరు’ అనుకున్నాడు. ఆరోజు అతనికి ఎక్కడలేని ధైర్యం వచ్చింది. ఆమె వెనకే వెళ్ళి, తను కృష్ణానగర్ లోని లేడీస్ హాస్టల్లో ఉంటోందని కనిపెట్టాడు.
***
ఒక ఆదివారం యూనివర్సిటీ కాన్వొకేషను హాల్లో జరుగుతున్న కవిసంగమం సభకువెళ్ళిన భాస్కరం అక్కడ సారసను చూసాడు. ఆమెకి సమీపంలోనే ఒక సీట్లో కూర్చున్నాడు, ఆమెనే చూస్తూ! కొంతసేపయ్యక ఆమెను వేదికపైకి పిలిచారు, మాట్లాడ్డానికి. ఆధునిక కవితారీతులపై ఆమె సోదాహరణంగా మాట్లాడ్డం చూసిన భాస్కరం ఆమె సాహిత్యజ్ఞానానికి అబ్బురపడ్డాడు. సభ పూర్తయ్యాక పూనకం వచ్చినవాడిలా వెళ్ళి ఆమెకు తనను పరిచయం చేసుకొని, ఆమెను అభినందించాడు. సాధారణంగా మగవిద్యార్థులతో మాట్లాడని సారస, భాస్కరం మాటల్లోని సంస్కారానికీ, స్వచ్చంగా కనబడ్డ అతని ముఖాన్నీ చూసి, తను ఎం. ఏ. తెలుగు మొదటి సంవత్సరం చదువుతున్నట్టూ, తమది కూడా రాజమండ్రేనని, తన తండ్రి అక్కడి ప్రముఖ వైద్యుడు రాజారావుగారనీ చెప్పింది. తమ ఇద్దరిదీ ఒకే వూరు అని తెలియడంతో ఇద్దరూ సంతోషించారు.
అలా ఏ సుముహూర్తంలో పరిచయం అయిందోకాని, వారిద్దరి అభిరుచులూ, అభిప్రాయాలూ ఒకటే కావడంతో వారి స్నేహం క్రమంగా పెరిగి, బీజప్రాయం నుండి మొలకై, అనతికాలంలోనే సౌరభాలు వెదజల్లే మల్లె తీగలా పెరిగి పందిరిగా అల్లుకుపోయింది. ఒకరికి తెలిసిన విషయాలు ఒకరికి చెప్పుకునేవారు. ఆమె అన్నిరకాల సాహిత్యాన్నీ చదివేది. అలా చదివి అర్థం చేసుకుని అనుభవించే ఆనందానికి మరేదీ సాటిరాదని ఆమె అనేది. ఎం. ఏ. అయ్యాకా వేదకాలం నించీ ఉన్న రచయిత్రులపై పరిశోధన చెయ్యాలన్నది తన కోరిక అని ఆమె అనేది.
ఒకసారి సెమెస్టర్ పరీక్షలయ్యాక ఇద్దరూ కలిసి రాజమండ్రి వెళ్ళారు. భాస్కరం సారసను తన ఇంటికి ఆహ్వానించాడు. సహజంగా సిగ్గరి ఐన తమ కొడుకు ఇలా ఒకమ్మాయిని ఇంటికి పిలవడం అతని ఇంట్లో వారికి ఆశ్చర్యాన్ని కలిగించినా, సారస రూపలావణ్యాలకూ, కలుపుగోలుతనానికీ వారు ముచ్చటపడ్డారు. తొలిచూపులోనే భాస్కరం తల్లికి ఆమె అంటే మంచి అభిప్రాయం కలిగి, ఈ ముచ్చటైనపిల్ల తన ఇంటికోడలైతే బాగుండును అనిపించింది. రాజారావుగారికీ తమకీ అన్నివిషయాల్లోనూ కుదరడం కూడా ఇందుకు కారణం. ఐనా, ఇంకా వీళ్ళ చదువులు పూర్తికావాలిగా, అప్పుడు చూద్దాంలే అనుకున్నారావిడ. ఆ తరువాత ఒక రోజు సారస భాస్కరాన్ని రాజారావుగారికి పరిచయం చేసింది. ఆయనకి క్షణం తీరిక ఉండదు. బ్రహ్మాండమైన ప్రాక్టీసు. మంచి హస్తవాసిగలవారిగా పేరుంది. సారస ఒక్కతే సంతానం ఆయనకి. నాలుగేళ్ళ క్రితం సారస తల్లి ఒక ప్రమాదంలో మరణించింది. ఆప్పటినించి ఆయనకి కూతురే సర్వస్వం ఐంది. ఒక డాక్టర్నే అల్లుడిగా తెచ్చుకుని తన ప్రాక్టీసుని కూడా అప్పగించి తను రిటైరైపోవాలని ఆయన సంకల్పం. ఐతే, సారస భాస్కరాన్ని పరిచయంచేసినప్పుడే ఆయనకి అనుమానంవచ్చింది, వారిది కేవలంపరిచయమేనా, లేక వేరే అభిప్రాయాలు వాళ్ళకి యేమైనా కలుగుతున్నాయా అని. కానీ, అప్పటికి మాత్రంభాస్కరంతో కలుపుగోలుగానే మాట్లాడారాయన.
భాస్కరంవెళ్ళిపోయాక, ‘బేబీ, ఈ పరిచయాలు ఈ వయసులో బాగానే ఉంటాయి. కానీ నువ్వు మితిమీరి పెంచుకుంటే వాటిలో కూరుకుపోతావు. అతనికి ఎంత చదువున్నా, సంస్కారం ఉన్నా, నువ్వు మాత్రం ఆడపిల్లవి, జాగ్రత్తగా ఉండాలి’ అని సగటు తండ్రిలాగానే హెచ్చరించారాయన. కాలక్రమంలో భాస్కరం లా కోర్సు పూర్తయింది. సారస కూడా ఎం. ఏ. పూర్తిచేసి పీహెచ్ డి లో చేరింది. రాజారావుగారి అనుమానాన్ని నిజం చేస్తూ వాళ్ళిద్దరి స్నేహం గాఢమైన ప్రేమగా మారింది. పెళ్ళి కూడా చేసుకోవాలనే నిర్ణయానికి వచ్చేసారిద్దరూ! భాస్కరానికి తన తల్లిదండ్రులకి సారస అంటే ఉన్న సదభిప్రాయం తెలుసు. రాజారావుగారిని ఒప్పించడం పెద్ద కష్టం కాదనుకున్నాడు. రాజమండ్రిలోనే తండ్రివద్ద జూనియర్ లాయరుగా చేరాడు.
**********

8 Comments
Janardhana Sharma
కథ అని తెలిసినా మనసు ద్రవించింది… రామాయణములోని ఒక్క శ్లోకం ఆధారంగా ఇంత మంచి కథను అల్లి అందించినందుకు అనేక ధన్యవాదాలు. మీ మొదటి కథను చదివినపుడు మీరు ఇంకా కథలను మెరుగు పరచాలనీ, ఎక్కడ లొసుగులున్నాయో చెప్పాలనీ అనిపించింది.. కానీ చెప్పలేకపోయాను.. నా అభిప్రాయానికి సమాధానమా అన్నట్టు ఈ కథ ఎంతో మెరుగ్గా ఉంది.. ఆ లొసుగులు లేనేలేవు… కాబట్టి చెప్పే అవసరం ఇక లేదు.
ధన్యవాదాలు.
పి.కే. ఆనంద్
ఈ కథలో విలన్ గా ఎవరూ లేకపోవడమే ప్రత్యేకత. విలనంటు ఉంటె అది విధి మాత్రం. ఈ కథలో ఉన్న కథాపాత్రాలన్ని సహృదయులే, సంస్కార సంపన్నులే. ఇందులో ఎవరినీ తప్పుపట్టలేము. ఎవరికివాళ్ళ వైపు ఆలోచిస్తే వాళ్ళు చేసింది సరియైన నిర్ణయమే అనిపిస్తుంది. చందమామ కథ చదివినట్టు సాఫీగా సాగింది కథనం. కథ ముగింపు బాగుంది. ఆ తర్వాత ఏం జరుగుతుంది అనేది పాటకుల నిర్ణయానికి వదిలేయడం నచ్చింది. వాళ్ళిద్దరూ తర్వాత పెళ్లి చేసుకోవచ్చు, చేసుకోకపోవచ్చు. మళ్ళీ కలవవచ్చు కలవక పోవచ్చు. ఖచ్చితమైన నిర్ణయం ఏమీ తీసుకోకుండా నైస్ గా విధికే వదిలేయడం సేఫ్ కదా.
Sivaramakrishna Vankayala
Thank you Anand!
c v mohan rao
చాల చాల బావుంది సార్ కధ అప్పుడె అయిపోయిందా అనిపించింది. మీ చేతుల మీదుగ వివాహం జరిపిస్తే బావుణ్ణు
శ్రీధర్ చౌడారపు
ముగింపు నీరసంగా ఉంది. ప్రయోజనం లేని ముగింపు వల్ల పాఠకులకు ఏ రకమైన రసానందాన్ని కలిగిద్దామనుకున్నారో అర్థం కాలేదు.
Sasikala Volety
కధాంశం పాతదయినా, కధనం సంస్కారయుతంగా అచ్చతెలుగులో సాగింది. చిన్నతనంలోనే భర్తృహీన అయిన అమ్మాయి తెల్లచీర కట్టుకుని, సన్యాసినిలా మారడం చాలా అసహజంగా ఉందండి. ఆధునికకాలానికి తగ్ద ఇతివృత్తంలా అనిపించింది. ముగింపు ఉదాత్తంగా ఉంది. రామాయణ శ్లోకం, దాన్ని కధకు అన్వయ్ంచిన తీరూ బావున్నాయి. ఎప్పటికయినా సుఖాంతం అయ్యే కధే!
గన్నవరపు నరసింహమూర్తి
కథ నందంగా మలిచారు. మీ శైలి అద్భుతము. అభినందనలు శ్రీ శివరామకృష్ణారావు గారూ.
Rekha Jyothi
విధి అనే తుఫాను తాకిడి జీవన నావను ఎటు తీసుకువెళ్తే అటు నిశ్శబ్ధంగా వెళ్ళే వారి కథ ఇది, పోరాడే అవకాశం, ఎదురీదే సామర్థ్యం ఉండి కూడా
:(, కథలో లీనం అయ్యేలా రాశారు!!