[‘చిట్టితల్లి’ అనే మకుటంతో శ్రీమతి వి. నాగజ్యోతి ఆటవెలదులలో బాలబాలికల కోసం అందిస్తున్న పద్య శతకం.]


31.
దోష మెంచి నంత రోష పడగరాదు
అరయగలవు నీవె తరచి చూడ
తప్పుటడుగు పడును తపన పెరిగి నంత
చెప్పుచుంటి వినుము! చిట్టి తల్లి!
~
32.
కలుపు బెరికివేయు కర్షకునివలెనె
సంతు తప్పిదముల జక్కబరచి
వారి బతుకు పంట పండించ వలెనమ్మ!
చెప్పుచుంటి వినుము! చిట్టి తల్లి!
~
33.
దొంగతనము జేసి దొరవలె తిరిగినన్
మర్మ మెరుగు మనసు మాట వినున?
భంగ పడుదు వమ్మ! బయట పడెడు వేళ
చెప్పుచుంటి వినుము! చిట్టి తల్లి!
~
34.
శిలయు ప్రతిమలాయె నులిదెబ్బ తగులగా
వెదురు గాయ పడిన వేణువాయె
నెదురు దెబ్బ లెపుడు నెదుగుదలకె సుమ్ము
చెప్పుచుంటి వినుము! చిట్టి తల్లి!
~
35.
తలచ రాదు నాదు తలరాత యనుచును
చింత పడుచు విసుగు చెంద వలదు
తరచి వెదకి నపుడె తగుదారి దొరకును
చెప్పుచుంటి వినుము! చిట్టి తల్లి!
~
36.
ఓడినంత నెపుడు నోరిమి విడరాదు
కృషిని వీడరాదు గెలుపునొoద
ఒజ్జ యగుచు నేర్పు నోటమి పాఠముల్
చెప్పుచుంటి వినుము! చిట్టి తల్లి!
~
37.
అక్షయముగ పుట్టు నాలోచనలయందు
నెంచు కొనుచు సాగు మంచి దొకటి
గమ్యమెఱిగి సాగ గగనమ్మె తలదించు
చెప్పుచుంటి వినుము! చిట్టి తల్లి!
~
38.
చింతమాపు చేయ సిద్ధార్థుడే మారి
బోధనలను చేయు బుద్ధుడాయె
చింతనదుపు చేయ సిద్ధించు కార్యమ్ము
చెప్పుచుంటి వినుము! చిట్టి తల్లి!
~
39.
సాగవలయునన్న శాంతి మార్గమునందు
జరుగుతున్న దరసి చనగవలయు
గతము వగచినంత వెతలింకి పోవునా?
చెప్పుచుంటి వినుము! చిట్టి తల్లి!
~
40.
గాలికబురు లెపుడు గగనాని కెగబ్రాకు
నిజము సాగదెపుడు గజము కూడ
జాప్య మైన గాని సత్యమ్ము ధరనిల్చు
చెప్పుచుంటి వినుము! చిట్టి తల్లి!
(ఇంకా ఉంది)

శ్రీమతి వరికేటి నాగజ్యోతి ఆంధ్రప్రదేశ్లోని రాజమండ్రిలో జన్మించారు. పదవ తరగతి వరకే చదువుకున్న నాగజ్యోతి గారు దక్షిణ భారత హిందీ పరీక్షలలో భాషాప్రవీణ, హిందీ టైపింగ్ పరీక్షలు లోయర్, హైయ్యర్ పాసయ్యారు. వివాహానంతరం ఢిల్లీకి వచ్చి గృహస్థురాలి బాధ్యత స్వీకరించారు. సాహిత్యాభిలాషి. వీరు రాసిన కథలు, కవితలు, పద్యాలు పలు అంతర్జాల పత్రికలలో ప్రచురించబడ్డాయి.
పుస్తక సమీక్షలు కూడా చేస్తూ వుంటారు. ఇన్నేళ్ళ తరువాత కోవిడ్ కాలంలో శ్రీ పూసపాటి గురువుగారు, శ్రీమాన్ నల్లాన్ చక్రవర్తి గురువుగారి ద్వారా పద్య రచన, ప్రాథమిక వ్యాకరణం నేర్చుకున్నారు. శ్రీమాన్ నల్లాన్ చక్రవర్తి గురువుగారి సహకారంతో – ఆప్త మిత్రులు శ్రీ ధరణిగారు, సన్నిహితులు, తమ శ్రీవారి ప్రోత్సాహం వలన ‘చిట్టి తల్లి’ పద్య శతకం రాసారు.
గత పదిహేను సంవత్సరాలుగా ఉత్తర్ ప్రదేశ్ ఘజియాబాద్ నివాసి.