[‘హర హర మహాదేవ శంభో శంకర!’ అనే భక్తి కవితని అందిస్తున్నారు గొర్రెపాటి శ్రీను.]


‘ఓం నమఃశ్శివాయ’ అంటూ నిన్ను తలిస్తే చాలు
కష్టాలన్ని పటాపంచలు చేస్తూ
సౌఖ్యాలను ప్రసాదించే
కరుణామయుడవు నువ్వే శివయ్య!
పార్వతీదేవికి అర్ధ తనువునిచ్చి
అర్ధనారీశ్వరుడుగా ఇలలో కీర్తినందుకుంటున్న
మహిమాన్వితుడవు నువ్వే శివయ్య!
నార వస్రాలని ధరించి
నాగులను హారాలుగా భావించి
గరళాన్ని కంఠాన దాచి
గంగమ్మను శిరమున నిలిపి
మూడు కాలాలకు సూచికగా త్రిశూలాన్ని చేతబట్టి
త్రికాల గమనంతో కాలాతీతుడవైన
పరమేశ్వరుడవు నువ్వే శివయ్య!
ఓంకార స్వరూపా..
అంబికా ప్రియ వల్లభా..
అనంత విశ్వాన్ని కాపాడే
దయామయుడవు నువ్వే శివయ్య!
హృదయమంతా నీపై ప్రేమని పెంచుకుని
చెంబెడు నీళ్ళతో అభిషేకిస్తే ఆనందస్వరూపడవై
అనంత ఆనందాలు అష్టైశ్వర్యాలు
ప్రసాదించే పావనమూర్తి నువ్వే శివయ్య!
భోళాశంకరా.. భళిరా నా శంకరా..!

గొర్రెపాటి శ్రీను అనే కలం పేరుతో ప్రసిద్ధులైన రచయిత జి.నాగ మోహన్ కుమార్ శర్మ డిప్లమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ (బి.టెక్) చదివారు. వీరి తల్లిదండ్రులు శాంతకుమారి, కీ.శే.బ్రమరాచార్యులు.
ఓ ప్రైవేటు సంస్థలో డిప్యూటీ మేనేజర్గా పని చేస్తున్న రచయిత హైదరాబాద్ బాలనగర్ వాస్తవ్యులు.
‘వెన్నెల కిరణాలు’ (కవితాసంపుటి-2019), ‘ప్రియ సమీరాలు’ (కథాసంపుటి-2021) వెలువరించారు. త్వరలో ‘ప్రణయ దృశ్యకావ్యం’ అనే కవితాసంపుటి రాబోతోంది.