[సత్యగౌరి మోగంటి గారు రచించిన ‘జీవన ధర్మం..!!’ అనే కవిత పాఠకులకి అందిస్తున్నాము.]


ఆకాశం చిక్కబడింది,
మేఘాలు చినుకు ముత్యాలతో-
సందడి చేశాయి..!
ఆ ముత్యపు జల్లులు ,
ఆనందాతిశయంతో-
భూమిని తడిపేశాయి!
మురిసిన మట్టి,
సుగంధభరితమైంది.
మైమరచిన చిరుగాలి
వెదురును వేణువును చేసి,
తీయని రాగమాలపించింది!
భూమ్యాకాశాల అనురాగానికి,
కొండలు కోనలు పరవశించి,
కో..అంటే, కో..అంటూ,
ప్రతిధ్వనించాయి..!
కొండలపై నుండి చినుకు చుక్కలు,
ధారలై జలధారలై ఉరికి ఉబికి,
ప్రవాహాలై పరుగందుకున్నాయి!
ఈ ప్రవాహపు హోరు,
కొంటె గాలికలిసి,
యుగళగీతమైంది..!
వెన్నెల వెలుగులో, కొండ గాలి,
ఈల పాటలో-
మది మురిసే క్షణాలు-
ఏ హృదయానికీ అందని,
అనిర్వచనీయ,
అతీత సౌందర్యాలు!
ఈ ప్రకృతి క్షణాలకు
ఊపిరి పోసిందా..?
నాలో జీవం నింపిందా..
తేలదు ఎప్పటికీ..!!

కవయిత్రి సత్యగౌరి మోగంటి వృత్తి రీత్యా ఉపాధ్యాయురాలు. ఎమ్.ఎ; బి.ఎడ్, బి.ఎల్. చదువుకున్నారు. కాకినాడకు చెందిన వీరు ప్రభుత్వ పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్గా పదవీ విరమణ చేశారు. తెలుగు సాహిత్యం లోనూ, రచనావ్యాసంగంలోను అభిరుచి వున్న శ్రీమతి సత్యగౌరి, రేడియో ప్రసంగాలు, అడపాదడాపా వివిధ ప్రక్రియల్లో రచనా వ్యాసంగం చేస్తూ ప్రస్తుతం హైదరాబాదులో విశ్రాంత జీవితం గడుపుతున్నారు.