[శ్రీ గొర్రెపాటి శ్రీను రచించిన ‘మనోగీతిక’ అనే కవితని పాఠకులకి అందిస్తున్నాము.]


చిన్నప్పుడు లేలేత అడుగులతో
ఇల్లంతా తిరుగుతూ ఆడుకున్నప్పుడు
అరుగులపై చేరి నేస్తాలతో
ముచ్చటించుకున్న శుభసమయాలు
నాన్న చేతి కిచ్చిన బొమ్మేదో
ప్రాణమై దాచుకుని పదే పదే చూసుకుంటూ మురిసిపోతూ
మిత్రుల దగ్గర ఆటబొమ్మ ప్రత్యేకతలు వల్లెవేసిన రోజులు
పసిడి ప్రాయంలో అమ్మ కొంగు చాటున దాగి
దాగుడుమూతల భలే భలే ఆటపాటలు..!
పచ్చగా మెరుస్తున్న చెట్లతో జతకట్టేస్తూ
ఉయ్యాలాటలు, కోతికొమ్మచ్చి అల్లర్లు..
అందంగా పరుచుకున్న వెండి వెన్నెల్లో
మంచాలపై చేరి ఇష్టంగా
చెప్పుకున్న కమ్మనైన కథలు..
ఎప్పుడు గుర్తొచ్చినా పెదవులపై
చిరునవ్వు తొణికిసలాడుతుంది!
మళ్ళీ అలాంటి రోజులు తిరిగొస్తే
బాగుంటుందని మనస్సు పలవరిస్తుంది!

గొర్రెపాటి శ్రీను అనే కలం పేరుతో ప్రసిద్ధులైన రచయిత జి.నాగ మోహన్ కుమార్ శర్మ డిప్లమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ (బి.టెక్) చదివారు. వీరి తల్లిదండ్రులు శాంతకుమారి, కీ.శే.బ్రమరాచార్యులు.
ఓ ప్రైవేటు సంస్థలో డిప్యూటీ మేనేజర్గా పని చేస్తున్న రచయిత హైదరాబాద్ బాలనగర్ వాస్తవ్యులు.
‘వెన్నెల కిరణాలు’ (కవితాసంపుటి-2019), ‘ప్రియ సమీరాలు’ (కథాసంపుటి-2021) వెలువరించారు. త్వరలో ‘ప్రణయ దృశ్యకావ్యం’ అనే కవితాసంపుటి రాబోతోంది.