నీ చెంపలపై చేరిన కెంపులు
నా గుండె గూటికి సంకెళ్లేస్తున్నాయే..
నా పాదాలని కదలనీక నీ ఎదరే నిలబెడుతున్నాయే!
నీ చిరునవ్వుల గమకాల సందళ్లు
నా యద వీణల్ని సుతారంగా తాకుతూ
నిరంతరం నీ తలపుల్లో ఊరేగేలా చేస్తున్నాయే!
నీ ముద్దు ముద్దు మాటలు ఆలకిస్తుంటే
నా మది పొందే ఆనందం అనంత పారవశ్యం
నీ సమ్మోహనాల పిలుపుల మహత్యాలు
నా జన్మంతా నీకై తపించే తన్మయాల తహతహలే చెలీ!
నీ చల్లని చూపుల హాయిదనాల సోయగాలు
నా చైతన్యాల స్ఫూర్తిదనాలు..
నీ ప్రేమల సౌందర్యాల సౌభాగ్యాలే
నాకు సిరుల వరాల సంబరాల జాతరలే సఖీ!
నా ఊపిరి రాగానికి ఆలంబన..
నా నడకల బాటలకి ప్రేరణ..
నా జీవన పథానికి మార్గనిర్దేశనం..
నా రేపటి జయ కేతనాలకి సంకేతం..
నా సమస్తం నువ్వే నేస్తం!

గొర్రెపాటి శ్రీను అనే కలం పేరుతో ప్రసిద్ధులైన రచయిత జి.నాగ మోహన్ కుమార్ శర్మ డిప్లమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ (బి.టెక్) చదివారు. వీరి తల్లిదండ్రులు శాంతకుమారి, కీ.శే.బ్రమరాచార్యులు.
ఓ ప్రైవేటు సంస్థలో డిప్యూటీ మేనేజర్గా పని చేస్తున్న రచయిత హైదరాబాద్ బాలనగర్ వాస్తవ్యులు.
‘వెన్నెల కిరణాలు’ (కవితాసంపుటి-2019), ‘ప్రియ సమీరాలు’ (కథాసంపుటి-2021) వెలువరించారు. త్వరలో ‘ప్రణయ దృశ్యకావ్యం’ అనే కవితాసంపుటి రాబోతోంది.