ప్రాపంచికమైన ఏ బాధలూ నా దరి చేరని
నిజంగా అమృతప్రాయమే అయిన ఆ దశలో..
నువ్వు నన్ను ఒంటరిని చేసి వెళ్ళిపోయావు!
ఆనాటి జ్ఞాపకాలు మదిలో కదలాడుతోంటే
మనసు పలవరిస్తూ పులకించిపోగా..
నేటి దుస్థితిని దీనంగా అనుభూతిస్తూ..
గుండె బరువెక్కిపోతోంది!
బ్రతుకు తెరువు గురించి ఆరాటాలు లేవు..
జీవన పోరాటాలూ లేవు!
గతం తాలూకూ వ్యథలు లేవు..
భవిష్యత్తును ఊహించుకునే భయాలూ లేవు!
గాలిపటంలా పిల్లగాలులతో కలిసి..
స్నేహబృందంతో విహరించిన మధురానుభూతులు!
కడ శ్వాస వరకూ కళ్ళల్లో కదలాడే..
కమ్మని కలల్లాంటి జ్ఞాపకాలు కదా అవి!
ప్రశాంత సాగరంలో తరంగాల సౌందర్యం..
ఎన్నో దశాబ్దాల తపస్సు అనంతరం
మహర్షులు పొందే ప్రశాంతత..
నీ కౌగిలిలో దాగి వున్న నిశ్శబ్దం..
అపురూపమైన జీవన సంగీతాన్ని
ఆస్వాదించేలా చేసింది కదా అప్పుడు!
నా జీవన ఆకాశంలో తేలియాడిన మేఘమాలికలు
హృద్యంగా వీచిన పిల్లతెమ్మెరల చందాన..
అలా వచ్చి ఇలా వెళ్ళిపోయావేమిటి!?
జీవన పోరాటంలో అలిసి సొలసిన వేళ..
నా హృదయ సౌందర్యాన్ని ఎందరో గాయపరిచిన వేళ..
అన్నింటినీ.. అందరినీ..
జీవితం మధ్యలో తెగిపోయిన బంధాలుగా
తలచాను.. మరచాను..!
కానీ.. గుండెను పెనవేసుకుపోయిన నీ బాంధవ్యాన్ని
మరచిపోవడం సాధ్యం కాదు కదా!?
దశాబ్దాల క్రితం ఎడబాసిన మా స్నేహబృందమంతా
ఆత్మీయ కలయిక పేరుతో కలసిన వేళ..
నీ ఒడిలో విశ్రమించి..
నీ హృదయ మైదానంపై ఆటలాడుకుని
సేద దీరిన జ్ఞాపకాలను ఆనందంగా పంచుకున్నాం!
క్షణం కూడా విడిపోకుండా కలిసి తిరిగిన కాలం
క్షణాల్లోనే మాయమైనట్లు..
మాయదారి యవ్వనం జీవితాన్ని కాటేసింది!
బాధ్యతా పర్వతాలను తలపై మోస్తూ
ఒకరి కన్నీళ్ళను మరొకరం తుడుచుకోకుండా
పట్టణాలకు.. నగరాలకు.. దేశ విదేశాలకు..
పొట్ట చేతపట్టుకుని చెల్లాచెదురైపోయాం!
మళ్ళీ ఇప్పుడు.. ఇలా..
గడిచిపోయిన కాలాన్ని గుర్తు చేసుకుంటూ
జీవన యానంలో ఎదురైన బాధల్ని చెప్పుకుంటూ
ఎదల్ని పెనవేసుకొని ఏడ్చేశాం..!
అప్పుడెప్పుడో పోగొట్టుకున్న అద్భుత ప్రపంచం
మళ్ళీ కళ్ళెదుట సాక్షాత్కరించింది..!
ఆత్మకథా గ్రంథాలను ముందరేసుకున్నాం..
ఒక్కొక్క పేజీ తిప్పేసుకున్నాం..
ఓ పేజీలో హాయిగా నవ్వుకునే సంఘటనలు!
మరో పేజీలో కళ్ళు చెమర్చే సన్నివేశాలు!!
మరికొన్ని పేజీలలో హృదయ విదారక దృశ్యాలు!!!
జీవితం పేజీలన్నీ తిరగేశాక..
ముగింపు పేజీలో మాత్రం..
అందరమూ ఏకాభిప్రాయాన్నే వ్యక్తీకరించాం!
మళ్ళీ ఒకసారి నీ ఒడిలో విశ్రమించాలనీ..
అక్కడే వుండిపోయి హాయిని అనుభూతించాలనీ!
ఓ.. నా తీయని బాల్యమా!
నీ జ్ఞాపకాల మధురిమలను ఆస్వాదిస్తూ
ఎంత కాలం గడిపినా..
అది..
నీలో మరోసారి జీవించడమే కదా!

శ్రీ విడదల సాంబశివరావు గారు 22 జనవరి 1952 న గుంటూరు జిల్లా, చిలకలూరిపేట పురపాలక సంఘం పరిధిలో ఉన్న పురుషోత్తమపట్నం గ్రామంలో ఓ మధ్య తరగతి ‘రైతు’ కుటుంబంలో జన్మించారు. శ్రీమతి సీతమ్మ, రాములు వీరి తల్లిదండ్రులు. స్వగ్రామంలో ప్రాథమిక విద్య, చిలకలూరిపేటలో ప్రాథమికోన్నత విద్య, తెనాలిలో బి.ఎస్.సి. పూర్తి చేశారు.
బాల్యం నుంచి నటనపై అభిరుచి ఉంది. అనేక నాటికలలోనూ, నాటకాలలోనూ నటించి ప్రశంసలందుకొన్నారు. వివిధ సంస్థల నుండి పతకాలు పొందారు. రాష్ట్రస్థాయిలో ఉత్తమ నటుడిగా బహుమతులు పొందారు. వీరు రచించిన ‘పుణ్యభూమి నా దేశం’ (నాటకం), ‘తలారి తీర్పు’ (నాటిక) ప్రసిద్ధమయ్యాయి. టివి ధారావాహికల్లోనూ, కొన్ని సినిమాల్లోనూ ముఖ్య పాత్రలు పోషించారు.
సాంబశివరావు గారు వెయ్యికి పైగా కవితలు రాశారు. వాస్తవిక జీవితాలని చిత్రిస్తూ అనేక కథలు రాశారు. కవితలు, నాటకాలు, కథలు కలిపి 14 పుస్తకాలు ప్రచురించారు. పలు పత్రికలలో ఫీచర్లు నిర్వహిస్తున్నారు.
నాటకరంగలోనూ, రచన రంగంలోనూ ఉత్తమ పురస్కారాలు అందుకొన్నారు. నీహారిక పౌండేషన్ అనే సంస్థని స్థాపించి సమాజ సేవ చేస్తున్నారు.