కనుల వర్షం కురుస్తున్నా
స్మృతుల జడిలో తడుస్తున్నా
కటిక శిలలా కదలవెందుకో
స్ఫటికమల్లే కరుగవెందుకో
కనురెప్పల మడతలలో
నిన్నలై కరిగిన క్షణాలు జలజలలో
కనుగవ జారి కదిలింది కాలమిలా
కలవరాన్ని మోసుకొచ్చివాలిన
సీతాకోకలా….
నిజంకాని మరీచికలా
నిలిచి కవ్విస్తుంటే
నీరెండలా
కదిలి నవ్వేస్తుంటే
అడుగులలో అడుగేస్తున్నట్టే
వెన్నంటే వస్తుంటే
కుదురుగావుండేది ..ఎలా ఎలా
నేటి నిజంలా
రేపటి ఆశలా
వాస్తవాల వాకిట కువకువ
వేకువ కిరణమై వాలవెందుకో యిలా..
మసకలైన మనసు అద్దం కాననంతదూరం
వెనుక్కి మరలిపోరాదా…కాదంటే
హాయి పల్లకిని మోసిన
అద్భుత క్షణాల బోయీవై
బతుకు మలుపులో
మళ్లీ తిరిగి రారాదా
దిక్కుల మధ్యన వేలాడే చుక్కల్లా
శిథిల జ్ఞాపకాలు సాక్షుల్లా మిగలిపోవాలా?
నాటి ఉల్లాసాలు చిమ్మిన
సల్లాపాల ఇంద్రధనస్సుపై
బాల్యక్రీడల సామీప్యానుభూతుల్లో
సజీవమైన సంభ్రమంలో
క్షణకాలం నిలిచిపో!

గొర్తి వాణీశ్రీనివాస్ సాహిత్యం మీద ఇష్టంతో గత ఐదేళ్లుగా రచనలు చేస్తున్నారు. 500 పైగా కవితలు రాశారు. 150 కథలకు పైగా వివిధ వార,మాస, పక్ష పత్రికలలో ప్రచురణ అయ్యాయి. 100 కథలకు బహుమతులు వచ్చాయి. స్వాతి అనుబంధ నవలలుగా ‘అరణ్య కాండ’, ‘బ్రేక్ ది సైలెన్స్’ ప్రచురణ అయ్యాయి. స్వాతిలో ఇప్పటికి 6 కథలకు బహుమతులు వచ్చాయి.
తపస్వి మనోహరం పబ్లికేషన్స్ ద్వారా 1. “వెన్నెల ధార” నవల 2. “నాతి చరామి” కథా సంపుటి. 3. “వినిపించని రాగాలు” ధారావాహిక ప్రచురితమయ్యాయి.
మన తెలుగు కథలు. కామ్ వారిచే రవీంద్ర భారతి వేదికగా ఉత్తమ రచయిత్రి పురస్కారం అందుకున్నారు.
“కథలు ఆనందాన్ని పంచి, అలుపు తీర్చాలి. ఆలోచనను పెంచి, బతుకు మలుపు తిప్పాలి.” అనే ఉద్దేశ్యాలతో ఎంతో ఇష్టంగా రచనలు చేస్తున్నారు.
2 Comments
sagar
చాలా బాగుంది మేడమ్ ము వర్ణన. మీకు అభినందనలు.
p.sushma
nice poetry mam