[సత్యగౌరి మోగంటి గారు రచించిన ‘వసంత హేల..!!’ అనే కవిత పాఠకులకి అందిస్తున్నాము.]


నా చేతిలో చేయి వేసి నడిచిన నీవు
నీ అడుగులో అడుగిడిన నేను
గుప్పెడు కూడా లేని నా ఎదలో
ఎల్లలు లేని ఆలయాన్ని కట్టాను నీకు!
నా కలలే నీకు ధూప దీప నైవేద్యాలు.
నీ కలలతో నిండిన నా కనులు
మన స్వప్న వాకిలిలో —
పండు వెన్నెల గనులు..!
నీ తలపుల వాకిట పరవశమైన నేను
చల్లని చిరు గాలినై తేలిపోతుంటా!
నీ హృదయ సామ్రాజ్యానికి
మహారాణినైనా–
నా అణువణువూ నీవే
నీ ప్రతి తలపూ నేనే!
నీవు రువ్వే నవ్వు
నా మనసుకు హరివిల్లు!
సెలయేరు నీవైతే
ఆ హొయలు నేనవుతా!
క్రీగంట నీవు చూసిన
ప్రతి చిలిపి నాకు —
ఆమని చిరుజల్లు..!
నా అణువణువూ నీవే
నీ ప్రతి తలపూ నేనే!
నీవే నా సొంతం
నీ తోడు–
నాకు నిత్య వసంతం..!!

కవయిత్రి సత్యగౌరి మోగంటి వృత్తి రీత్యా ఉపాధ్యాయురాలు. ఎమ్.ఎ; బి.ఎడ్, బి.ఎల్. చదువుకున్నారు. కాకినాడకు చెందిన వీరు ప్రభుత్వ పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్గా పదవీ విరమణ చేశారు. తెలుగు సాహిత్యం లోనూ, రచనావ్యాసంగంలోను అభిరుచి వున్న శ్రీమతి సత్యగౌరి, రేడియో ప్రసంగాలు, అడపాదడాపా వివిధ ప్రక్రియల్లో రచనా వ్యాసంగం చేస్తూ ప్రస్తుతం హైదరాబాదులో విశ్రాంత జీవితం గడుపుతున్నారు.